/rtv/media/media_files/2025/07/10/telangana-cabinet-meeting-2025-07-10-20-35-39.jpg)
Telangana Cabinet Meeting
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం(telangana-government), స్థానిక రాజకీయాలలో కీలకమైన మార్పులను తీసుకువస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) అధ్యక్షత వహించిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో ముఖ్యంగా స్థానిక ఎన్నికల నియమావళికి సంబంధించి సంస్కరణలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ముగ్గురు పిల్లలు ఉన్న వారు పోటీకి అనర్హులు అనే నిబంధన తొలగించడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనివలన ఇకపై తెలంగాణలో ముగ్గురు సంతానం కలిగిన వారు కూడా పంచాయితీ, మున్సిపాలిటీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ లాంటి స్థానిక ఎన్నికల్లో పోటీ చేయవచ్చును. దీంతో పాటూ వ్యవసాయ రంగానికి ప్రోత్సాహం, హైదరాబాద్ అభివృద్ధి వంటి అంశాలపై కూడా కేబినెట్ దృష్టి సారించింది.
Also Read : బిగ్ అలర్ట్.. ఆవర్తనం ప్రభావం.. ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన, చలి!
వ్యవసాయానికి సంబంధించి కీలక నిర్ణయాలు..
ఈ వానాకాలంలో 1.48 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుంది. దేశంలోనే ఇది రికార్డు స్థాయి ఉత్పత్తి. ఇందులో రాష్ట్రంలో 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని పౌరసరఫరాల విభాగం అంచనా వేసింది. కేంద్ర ప్రభుత్వం 50 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణకు అంగీకరించింది.. మరో 15 లక్షల మెట్రిక్ టన్నులుసేకరించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేయాలని మంత్రి వర్గం నిర్ణయించింది. వానకాలం సీజన్లో పండించిన ధాన్యం కొనుగోళ్లను పకడ్బందీగా నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ, పౌర సరఫరాల శాఖ, రవాణా శాఖ సమన్వయంతో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించింది. ధాన్యానికి చెల్లించే మద్దతు ధరతో పాటు సన్న వడ్లకు ఇచ్చే రూ.500 బోనస్ రైతుల ఖాతాల్లో వెంట వెంటనే జమ చేయాలని నిర్ణయం తీసుకుంది. కలెక్టర్లు, అదనపుకలెక్టర్లు కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేయాలని.. ప్రతి కొనుగోలు కేంద్రం పర్యవేక్షణ, సమన్వయానికి ఒక్కో అధికారికి ప్రత్యేక బాధ్యతలు అప్పగించాలని మంత్రివర్గం నిర్ణయించింది. అలాగే రాష్ట్రంలో కొత్తగా మూడు అగ్రికల్చర్ కాలేజీల ఏర్పాటు కు రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. హుజూర్ నగర్, కొడంగల్, నిజామాబాద్ లో అగ్రికల్చర్ కాలేజీల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.
రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్ళు పూర్తయిన సందర్భంగా ప్రజా పాలన -ప్రజా విజయోత్సవాలను నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. డిసెంబర్ 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహిస్తుంది. ఉత్సవాల నిర్వహణ.. సంబంధిత ఏర్పాట్లపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దాంతో పాటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో ఏన్కూర్ మార్కెట్ యార్డ్ కు పది ఎకరాలు కేటాయిస్తూ కేబినెట్ తీర్మానం చేసింది.
Also Read : ముగ్గురు పిల్లలున్నా పోటీకి అర్హులే..కేబినెట్ నిర్ణయం
మెట్రో పనులు వేగవంతం..
ఇక హైదరాబాద్ కు సంబంధించి మెట్రో రైలు విస్తరణ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. మెట్రో 2A, 2B విస్తరణకు అడ్డంకిగా మారిన మొదటి దశను పీపీపీ మోడ్లో నిర్వహిస్తున్న ఎల్ అండ్ టీ నుంచి స్వాధీనం చేసుకునే విషయంపై సుదీర్ఘంగా చర్చించింది. మెట్రో రైలును ఎల్ అండ్ టీ నుంచి స్వాధీనం చేసుకునే విషయంలో సాధ్యాసాధ్యాలు, అందులో ముడిపడి ఉన్న అంశాలన్నింటినీ లోతుగా అధ్యయనం చేసేందుకు ఉన్నత అధికారుల కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సీఎస్ ఛైర్మన్గా, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, ఎంఏయూడీ కార్యదర్శి, లా సెక్రెటరీ, మెట్రో రైలు ఎండీ, అర్బన్ ట్రాన్స్పోర్ట్ అడ్వయిజర్ అధికారుల కమిటీలో సభ్యులుగా ఉంటారు. అధికారుల కమిటీ తమ రిపోర్టును కేబినేట్ సబ్ కమిటీకి అందిస్తుంది. కేబినేట్ సబ్ కమిటీ సిఫారసుల ఆధారంగా మెట్రోను ఎల్ అండ్ టీ నుంచి స్వాధీనం చేసుకునే విషయంలో తుది నిర్ణయం తీసుకోవాలని మంత్రివర్గం తీర్మానించింది.