/rtv/media/media_files/2025/06/08/n6lqxSyYd1zg3Anr7lbC.jpg)
TG Crime
TG Crime: పెళ్లికోసం వెళ్లిన యువకులు సరదాకు గోదావరినదిలో స్నానం చేసేందుకు వెళ్లి మృత్యువాత పడిన సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం మేడిగడ్డ బ్యారేజీ వద్ద చోటుచేసుకుంది. ఈ ఘటనలో మొత్తం 6 గురు యువకులు గల్లంతవడం తో విషాదం నెలకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహదేవ్పూర్ మండలం అంబట్పల్లికి చెందిన గొలుకొండ మల్లయ్య ఇంట్లో ఇటీవల వివాహం జరిగింది. ఈ వివాహానికి హాజరైన బంధువుల్లో ఎనిమిది మంది శనివారం సాయంత్రం 5.30 గంటల సమయంలో అంబట్పల్లి నుంచి ఆటోలో మేడిగడ్డకు వెళ్లారు.
Also Read: ఛత్తీస్గఢ్లో ఎన్ కౌంటర్, మరో ఇద్దరు మావోయిస్టులు మృతి
గోదావరిలో స్నానం చేయడానికి అని వెళ్లిన వారిలో మొదట పట్టి మధుసూదన్ అనే యువకుడు నదిలోకి దిగాడు. అయితే అక్కడే ఉన్న గుంతను గమనించకుండా దిగడంతో మునిగిపోయాడు. మధుసూదన్ మునిగి పోవడాన్ని గమనించిన అతని సోదరుడు పట్టి శివమనోజ్ ఆయనను కాపాడే ప్రయత్నం చేశాడు. కానీ అతను కూడా గుంతలో మునిగిపోయాడు. అలా ఒకరిని కాపాడపోయి ఒకరుగా మొత్తం ఆరుగురు గల్లంతయ్యారు. కాగా మధుసూదన్, మనోజ్ల తండ్రి పట్టి వెంకటస్వామి ఆటలోనే వారంతా అక్కడికి వెళ్లారు. ఆయన ఆటోను నది ఒడ్డున పెట్టి వచ్చేలోపే ఇద్దరూ కుమారులు కళ్లముందే నదిలో గల్లంతవడంతో ఆయన సొమ్మసిల్లి పడిపోయాడు.గల్లంతయిన వారిలో నలుగురు అంబట్ పల్లికి చెందినవారు కాగా మరో ఇద్దరు కొర్లకుంట గ్రామానికి చెందిన వారున్నారు. గల్లంతయిన వారిలో రక్షిత్, సాగర్, మధుసూదన్, రాంచరణ్, శివమనోజ్, రాహుల్ ఉన్నారు. అందరూ కూడా 20 ఏండ్ల లోపు వారే కావడం విషాదకరం.
Also Read: కరువు మొదలైంది..సింధు జలాల కోసం భారత్ కు పాక్ నాలుగు లెటర్స్
కాగా మేడిగడ్డ బ్యారేజీ ఫిల్లర్లు డ్యామేజీ కావడంతో వాటికి రిపేర్లు చేస్తున్నారు. దానికోసం మట్టిని తవ్వడం వల్ల గుంతలు ఏర్పడ్డాయని స్థానికులు చెబుతున్నారు. పెద్ద పెద్ద గుంతలు ఏర్పడంతో నీటి ప్రవాహంలో అవి ఏర్పడే అవకాశం లేదు. మరోవైపు రెండ్రోజులుగా ప్రాణహిత ఎగువన కురుస్తున్న వర్షాలతో నదిలో ప్రవాహం పెరిగింది. దీంతో వీరంతా ఈతకు వెళ్లే సమయానికి నది ప్రవాహం చాలా ఎక్కువగా ఉంది. దీంతో గల్లంతయిన వారి ఆచూకి కనుగొనడం కష్టసాధ్యంగా మారింది. గజ ఈతగాళ్లను రంగంలోకి దింపామని, ఆరు రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందాలనూ రప్పిస్తున్నామని పోలీసులు తెలిపారు. విషయం తెలిసిన వెంటనే మంత్రి శ్రీధర్బాబు స్పందించారు. సంఘటన పట్ల దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని కలెక్టర్ రాహుల్శర్మ, ఎస్పీ కిరణ్లను ఆదేశించారు.
Also Read: ఉక్రెయిన్ను చావుదెబ్బ కొట్టిన రష్యా.. వందలాది డ్రోన్లు, క్షిపణులతో దాడులు