/rtv/media/media_files/2025/02/14/HPsKaKbgom2zfPV1xrKP.jpg)
tourism tg Photograph: (tourism tg)
Telangana: రాష్ట్రానికి ఆదాయం సమకూర్చేలా పర్యాటక రంగానికి మరింత మెరుగులు దిద్దాలని పర్యాటక శాఖ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఆశించిన ప్రగతి కనిపించట్లేదని, యువతకు ఉపాధి కల్పించే వనరుగా తీర్చిదిద్దాలన్నారు. పర్యాటక శాఖపై ఐసీసీసీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సదర్భంగా పర్యాటకులను ఆకర్షించే వనరులు మనకు ఎన్నో ఉన్నా, గతంలో ప్రచారంపైన శ్రద్ధ చూపకపోవడంతో నష్టపోయామన్నారు. ఇకనైనా వినూత్న పద్ధతిలో ఆలోచించి ఈ రంగంలో ఆశించిన ప్రగతి తీసుకురావాలన్నారు. తెలంగాణ ఘన చరిత్రను వర్తమానానికి అనుసంధానిస్తూ.. భవిష్యత్కు బాటలు వేసేలా పర్యాటక శాఖను తీర్చిదిద్దాలని తెలిపారు.
పెట్టుబడులు పెట్టే వారికి ప్రోత్సాహాకాలు..
సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టే వారికి ప్రోత్సాహాకాలు కల్పించాలి. నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్లో బోట్ హౌస్ అందుబాటులో ఉంచాలి. డెస్టినేషన్ వెడ్డింగ్లకు తెలంగాణను వేదికగా మార్చాలి. ఆలయాలు, పులుల అభయారణ్యాలకు పర్యాటకంలో ప్రత్యేక ప్రాధాన్యం ఉందని.. ఆ దిశగా దృష్టిసారించి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. భద్రాచలం, సలేశ్వరం, రామప్ప వంటి ఆలయాలు, మల్లెల తీర్ధం, బొగత జలపాతాలు, బౌద్ధ స్తూపాలు, జైన ఆలయాలు ఇలా ప్రతి ఒక్క పర్యాటక ప్రదేశంలో వసతులు మెరుగుపర్చడంతో పాటు సరైన ప్రచారం కల్పించాలని ఆదేశించారు. భువనగిరి కోట రోప్ వే పనులపైనా ఆరా తీశారు. భూ సేకరణలో కొంత జాప్యం జరిగిందని, ఇప్పుడు భూ సేకరణ పూర్తయినందున త్వరలో టెండర్లు పిలుస్తామని అధికారులకు చెప్పారు. సాధ్యమైనంత త్వరగా భువనగిరి కోట రోప్ వే పనులకు టెండర్లు పిలవడంతో పాటు కోటపై ఉన్న చారిత్రక కట్టడాల పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఇది కూడా చదవండి: YS Jagan: అందుకు తగిన మూల్యం చెల్లించక తప్పదు.. కూటమి సర్కార్ కు జగన్ వార్నింగ్
స్పోర్ట్స్కు పర్యాటక శాఖలో ప్రాధాన్యం..
పర్యాటక శాఖ పాలసీకి తుది రూపు ఇచ్చే సమయంలో అటవీ, ఐటీ, విద్యుత్, టీజీ ఐఐసీ, వైద్య, క్రీడల శాఖలతో సమన్వయం చేసుకోవాలన్నారు. ఒక శాఖ విధానాలు మరో శాఖ విధానాలకు ఆటంకంగా ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. అడ్వెంచర్ స్పోర్ట్స్కు పర్యాటక శాఖలో ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. వైద్య అవసరాలకు విదేశాల నుంచి వచ్చే వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పర్యాటకుల్లా వచ్చిపోయేలా అన్ని చర్యలు తీసుకోవాలని తెలిపారు. పర్యాటక శాఖకు బడ్జెట్ కేటాయింపులు పెరిగేలా చూస్తామన్నారు. ఈ సమీక్షలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ ఛైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి, పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ ప్రకాశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.