/rtv/media/media_files/2025/02/14/05Wjj0IbQWIyfjoXZLzH.jpg)
YS jagan mohan reddy
ఏపీలో చట్టానికి, న్యాయానికి చోటు లేకుండా పోయిందని మాజీ సీఎం వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు. తీవ్ర అధికార దుర్వినియోగంతో రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అక్రమ అరెస్టులు చేస్తూ, అసలు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని ధ్వజమెత్తారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విషయంలో కూటమి సర్కార్ వ్యవహరిస్తున్న తీరు అత్యంత అన్యాయంగా ఉందన్నారు. గన్నవరం కేసులో తనపై టీడీపీ వారు ఒత్తిడి తెచ్చి, తప్పుడు కేసు పెట్టించారంటూ సాక్షాత్తూ జడ్జిగారి ముందు దళిత యువకుడు వాంగ్మూలం ఇచ్చి, అధికారపార్టీ కుట్రను బట్టబయలు చేశాడన్నారు. దీంతో తమ బండారం బయటపడిందని, తమ తప్పులు బయటకు వస్తున్నాయని తట్టుకోలేక, దాన్నికూడా మార్చేయడానికి చంద్రబాబు దుర్మార్గాలు చేస్తున్నారని ఆరోపించారు.
వంశీ అరెస్టును ఖండిస్తున్నా..
సత్యానికి కట్టుబడి నిజాలు చెప్పినందుకు దళిత యువకుడిని పోలీసులను పంపించి మరీ వేధించడం ఎంతవరకు కరెక్టు? అని ప్రశ్నించారు. వాంగ్మూలం ఇచ్చిన రోజే ఆ దళిత యువకుడి కుటుంబంపైకి పోలీసులు, టీడీపీ కార్యకర్తలు వెళ్లి వారిని బెదిరించి, భయపెట్టడం కరెక్టేనా? ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమేనా? అని ప్రశ్నలు గుప్పించారు. వంశీ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. వంశీ భద్రతకు ఎలాంటి సమస్య వచ్చినా ఈ ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు.
దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరిపై తప్పుడు కేసును కూడా తీవ్రంగా ఖండించారు జగన్. కళ్యాణ మండపం ప్రాంగణంలో అబ్బయ్య చౌదరి డ్రైవర్ ను టీడీపీ ఎమ్మెల్యే బూతులు తిట్టి, తిరిగి అబ్బయ్య చౌదరిపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టడం దుర్మార్గమన్నారు. టీడీపీ ఎమ్మెల్యే ఏం తిట్ల వీడియోను కోట్లమంది ప్రజలు చూశారన్నారు. తప్పులు టీడీపీ వారు చేసి, వారిపై చర్య తీసుకోమని కోరితే.. పోలీసులు ఎదురు కేసులు పెట్టి అన్యాయంగా వ్యవహరిస్తున్నారన్నారు. అందులోనూ 307, అంటే హత్యాయత్నం కేసులు పెట్టడం ఏంటి? అని ప్రశ్నించారు.
హామీలను అమలు చేయకుండా ప్రజల దృష్టిని మళ్లించడానికి మాపార్టీకి చెందిన నాయకులను, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని తప్పుడు కేసులు, తప్పుడు సాక్షులుతో అక్రమ అరెస్టులకు దిగుతున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వ తప్పులను ప్రజలే తమ డైరీల్లో రికార్డు చేసుకుంటూనే ఉన్నారన్నారు. కూటమి నేతలు తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిస్తున్నామన్నారు.