/rtv/media/media_files/2025/09/29/biggest-movie-piracy-gang-arrested-2025-09-29-14-53-40.jpg)
Biggest movie piracy gang arrested
తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు(Telangana Cyber Crime Police) దేశంలోనే అతిపెద్ద సినిమా పైరసీ ముఠా ఆటకట్టించారు. ముఠాలో కీలకంగా ఉన్న ఆరుగురితో పాటు మరికొంతమందిని అరెస్ట్ చేశారు. వీరు తెలుగుతో పాటు పలు భాషల సినిమాలను పైరసీ చేసినట్లు పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్(CV Anand comments) వెల్లడించారు. పైరసీ మూలంగా 2024లో తెలుగు చిత్ర పరిశ్రమ రూ. 3700 కోట్లు నష్టపోయిందని ఆనంద్ తెలిపారు. పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు సమగ్ర దర్యాప్తు చేశామని సీవీ ఆనంద్ పేర్కొన్నారు. పైరసీ మూవీస్ వల్ల ఆన్లైన్ బెట్టింగ్ లకు కూడా ప్రేక్షకులు అలవాటు పడుతున్నారని ఆయన తెలిపారు. నిందితులు ఓ వెబ్సైట్, టెలిగ్రామ్ ద్వారా పైరసీ మూవీలు స్ట్రీమింగ్ చేస్తున్నారని ఆనంద్ తెలిపారు. సర్వర్స్ హ్యాకింగ్తో పాటు క్యామ్ కార్డర్ ద్వారా నిందితులు సినిమాలను పైరసీ చేస్తున్నారని వివరించారు. బెట్టింగ్ గేమింగ్ యాప్స్ నిర్వాహకులు పైరసీ చేసేవారికి డబ్బులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారని సీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు.
‘బెట్టింగ్ యాప్ నిర్వాహకులు పైరసీ మూవీల ద్వారా వారి యాప్లను ప్రచారం చేసుకుంటున్నారు. ‘‘టెలిగ్రామ్ ఛానల్స్, టొరెంట్స్ ద్వారా సినిమాల పైరసీ జరుగుతోందని సీవి ఆనంద్ తెలిపారు. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ చేసిన ఫిర్యాదు మేరకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. తమిళ్ బ్లాస్టర్స్, ఫైవ్ మూవీ రూల్స్, తమిళ్ మూవీ వెబ్సైట్తదితర వెబ్సైట్లలో పైరసీ సినిమాలను అందుబాటులో ఉంచుతున్నారని వెల్లడించారు. ఈ కేసులో హైదరాబాద్కు చెందిన జానా కిరణ్ కుమార్ ప్రధాన నిందితుడు అని వెల్లడించారు. కిరణ్ అత్తాపూర్లోని మంత్ర మాల్ థియేటర్లో సినిమాలు కాపీ చేశాడనన్నారు.
Also Read : సీఎం రేవంత్ అదిరిపోయే దసరా గిఫ్ట్.. ఇక కేవలం రూ.5కే..!
Biggest Movie Piracy Gang Arrested
నలబై మూవీలు ఈ థియేటర్లో కాపీ చేసినట్లు గుర్తించారు. ప్రతి సినిమాకు 300 నుంచి 400 డాలర్లను బిట్ కాయిన్స్ రూపంలో కిరణ్ కుమార్ తీసుకుంటున్నాడు. అనంతరం క్రిఫ్టో కరెన్సీ ట్రేడింగ్ ఫ్లాట్ ఫాంని ఉపయోగించి ఇండియన్ కరెన్సీలోకి మార్చుకుంటున్నారు. దర్యాప్తులో భాగంగా44 మంది అనుమానితులను విచారించిన తర్వాత అసలు నిందితుడు జానా కిరణ్ కుమార్గా తేలిందన్నారు.కిరణ్ థియేటర్కు వెళ్లి కెమెరా ద్వారా రికార్డింగ్ చేసి పైరసీకి పాల్పడుతున్నారన్నారు. అందరూ విస్తుపోయేలా డిజిటల్ శాటిలైట్ను కూడా హ్యాక్ చేసి పైరసీ చేస్తున్నట్లు గుర్తించామన్నారు. పైరసీ సినిమాలు అప్లోడ్ చేసి బెట్టింగ్, గేమింగ్ యాప్ ప్రకటనల ద్వారా ఆదాయం పొందుతున్నారని తెలిపారు. ‘సింగిల్’, ‘హిట్’ సినిమాల పైరసీ జరిగినప్పుడు మాకు ఫిర్యాదులు అందాయని వెల్లడించారు.
హైఎండ్ కెమెరా ఉన్న సెల్ఫోన్తో నిందితులు సినిమాను రికార్డింగ్ చేస్తు్న్నట్లు గుర్తించామన్నారు. సెల్ఫోన్లను జేబులో గానీ, పాప్కార్న్ డబ్బాలో గానీ పెట్టుకుని సినిమాను రికార్డు చేస్తారన్నారు. ముఠా ప్రత్యేకమైన యాప్ ద్వారా సినిమాలను పైరసీ చేసిందన్నారు. రికార్డింగ్ చేస్తున్నప్పుడు సెల్ఫోన్ స్క్రీన్లైట్ కూడా ఆఫ్లో పెడుతారని దీనివల్ల ఎవరికీ అనుమానం రాదని తెలిపారు. ఇతర భాషల చిత్రాలను రికార్డింగ్ చేసేందుకు ప్రత్యేక ఏజెంట్లను నియమించుకున్నారన్నారు. సినిమా పైరసీలకు నెదర్లాండ్స్కు చెందిన ఐపీ అడ్రస్ వాడుతున్నారని సీవీ ఆనంద్ తెలిపారు. నిందితులు పోలీసులు ఎప్పటికీ పట్టుకోలేని టెక్నాలజీ వాడుతున్నారని, దానికి అనుగుణంగా పోలీసులు కూడా ఈ ముఠాను పట్టుకునేందుకు అత్యాధునిక టెక్నాలజీని వినియోగించాల్సి వచ్చిందన్నారు. మేం కేసును ఛేదించిన విధానం తెలిసి షాక్ నిందితులు షాక్ అయ్యారన్నారు. కిరణ్ కుమార్ బెట్టింగ్ యాప్ల నుంచి నెలకు సుమారు రూ.9 లక్షల వరకు చెల్లింపులు జరిగినట్లు పోలీసులు గుర్తించారు.
కాగా నిందితులను పట్టుకున్న విధానాన్ని వివరిస్తూ.. క్రిప్టో కరెన్సీ పేమెంట్స్ ద్వారా మాకు కొంత క్లూ దొరికిందని, హ్యాకింగ్లో నిపుణుడైన పట్నాకు చెందిన మరో ప్రధాన నిందితుడు అశ్వనీకుమార్ను గుర్తించామన్నారు. డిజిటల్ మీడియా సర్వర్స్ను కూడా హ్యాక్ చేసే నైపుణ్యం అతడికి ఉందని . కొన్ని సందర్భాల్లో గవర్నమెంటు వెబ్సైట్లను కూడా హ్యాక్ చేశాడని పోలీసులు గుర్తించారు. ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ను కూడా నిందితుడు హ్యాక్ చేశాడన్నారు. ప్రభుత్వ వెబ్సైట్లు హ్యాక్ చేసి ఉద్యోగులు, జీతాల వివరాలు తీసుకున్నాడన్నారు. బిహార్లోని పట్నాలో ఉన్న అశ్వనీకుమార్ ఇంటికి మా టీమ్ వెళ్లిన సమయంలో ఆ ఇంటి చుట్టూ 22 సీసీటీవీ కెమెరాలు గుర్తించమన్నారు. నిందితుల వల్ల పలు కంపెనీలు వారి ఉద్యోగులను అనుమానించే పరిస్థితి వచ్చిందని వివరించారు. సినిమాల పైరసీని ప్రధానంగా ప్రోత్సహిస్తున్నది.. బెట్టింగ్, గేమింగ్ యాప్ నిర్వాహకులే అని ఆనంద్ వివరించారు. ఎక్కువ సినిమాల పైరసీ కిరణ్, అశ్వనీకుమార్ ముఠా వల్లే జరిగినట్లు గుర్తించామన్నారు.
పైరసీ ద్వారా నిందితులు లక్ష డాలర్ల వరకు సంపాదించినట్లు పోలీసులు గుర్తించారు. వీరే కాక ఈటీవీ కంటెంట్ను పైరసీ చేసిన హర్షవర్ధన్,నెదర్లాండ్, ప్యారిస్ ఐపీ అడ్రస్ల ద్వారా సినిమాలు పైరసీ చేసిన సిరిల్ తదితరులను కూడా పట్టుకున్నామన్నారు. వీరంతా ఇప్పటి వరకు 500 సినిమాలు పైరసీ చేసినట్లు గుర్తించాం.’’ అని సీవీ ఆనంద్ తెలిపారు. సినిమాల పైరసీ వల్ల నిర్మాతలు తీవ్రంగా నష్టపోతున్నారని, సినిమా పరిశ్రమ బాగా ప్రభావానికి గురవుతోందని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ వ్యాఖ్యానించారు. 2023లో మనదేశంలోని చిత్ర పరిశ్రమ రూ. 22,400 కోట్లు పైరసీతో నష్టపోయిందని సీపీ సీవీ ఆనంద్ వివరించారు.
Also Read: తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్.. రిజర్వేషన్లలో గందరగోళం.. అక్కడ మళ్లీ మార్పు?