/rtv/media/media_files/2025/05/05/9fKsh8hslaWgNUu7VbCF.jpg)
Govt Employees Strike
Govt Employees Strike : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు తమ డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మెకు సిద్ధమవుతున్నారు. 16 నెలలుగా ఎదురు చూసినా ప్రభుత్వం నుంచి వారి సమస్యల పరిష్కారంపై సానుకూల స్పందన రావడం లేదు. దీంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ హక్కుల సాధనకోసం ఆందోళన బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఐదు డీఏలు పెండింగ్ ఉండగా.. పీఆర్సీ బకాయి పడింది. ఇక బిల్లులు భారీగా పెండింగ్లో ఉన్నాయి. పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలని, పీఆర్సీ అమలు చేయాలని, పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై వర్క్ టు రూల్, పెన్ డౌన్ వంటి నిరసనలతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి ఉద్యోగులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఆర్టీసీ ఉద్యోగులు ఉద్యమానికి సమరశంఖం పూరించగా వారితోపాటు తాము కూడా ఆందోళనకు సిద్ధమని ప్రభుత్వ ఉద్యోగులు ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులు భారీ ఉద్యమ కార్యాచరణకు సిద్ధమయ్యారు.
Also Read: కాళ్ల బేరానికి దిగిన పాకిస్తాన్.. ఐక్యరాజ్య సమితి ఎమర్జెన్సీ మీటింగ్
అందులో భాగంగా ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రకటించిన దాని ప్రకారం.. ఈ నెల 15వ తేదీ నుండి అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన ధర్నాలు చేపట్టనున్నారు. ఆ తర్వాత జూన్ 9వ తేదీన హైదరాబాద్ నగరంలో దాదాపు 50 వేల మంది ఉద్యోగులతోభారీ మహాధర్నా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు.. ఉపాధ్యాయులు, పెన్షనర్లు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన చేసేందుకు కార్యాచరణ ప్రకటించారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించకపోగా, కనీసం చర్చలకు కూడా పిలవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే పరిష్కరించాల్సిన అనేక ముఖ్యమైన డిమాండ్లను ఉద్యోగులు ముందుకు తెచ్చారు. వాటిలో ముఖ్యమైనవి పెండింగ్లో ఉన్న రూ. 9 వేల కోట్ల బిల్లులను తక్షణమే క్లియర్ చేయాలి, ఉద్యోగులకు త్వరగా పే రివిజన్ కమిషన్ (పీఆర్సీ)ని అమలు చేయాలి. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి. ఈ డిమాండ్లతో పాటు, ఇతర సమస్యలను కూడా వెంటనే పరిష్కరించాలని ఉద్యోగులు పట్టుబడుతున్నారు.
పెండింగ్లో ఉన్న 5 కరువు భత్యాలను (డియర్నెస్ అలవెన్స్) వెంటనే విడుదల చేయాలి. పెండింగ్లో ఉన్న బకాయి బిల్లులను వెంటనే విడుదల చేయాలి. వేతన సవరణ సంఘం కమిటీ నివేదికను ప్రభుత్వానికి సమర్పించి 51 శాతం ఫిట్మెంట్ను వెంటనే అమలు చేయాలి.
ప్రభుత్వ ఉద్యోగుల హెల్త్ కార్డులు (ఈహెచ్ఎస్) వెంటనే అమలు చేయాలి. జీఓ 317ను సమీక్షించి బాధితుల బదిలీల కోసం సూపర్ న్యూమరిక్ పోస్టులను కల్పించి వీలైనంత త్వరగా స్థానికత కోల్పోయిన ఉద్యోగ, ఉపాధ్యాయులను తిరిగి వారి స్థానిక జిల్లా/ జోనులను కేటాయించాలి.కంట్రిబ్యూటర్ పెన్షన్ స్కీమ్ రద్దు చేసి (సీపీఎస్, యూపీఎస్) పాత పింఛన్ పథకాన్ని సక్రమంగా పునరుద్ధరించాలి. పెండింగ్లో ఉన్న 57 డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనకు దిగనున్నట్లు వెల్లడించారు.
Also Read: ప్రతీకారం తీర్చుకుంటాం.. ఉగ్రవాదులను చంపుతాం : అమిత్ షా సంచలన కామెంట్స్!
ప్రభుత్వం మీద మరింత ఒత్తిడి తెచ్చేందుకు తమ నిరసనను మరింత తీవ్రతరం చేయడానికి ఉద్యోగులు వివిధ రూపాల్లో ఆందోళనలు చేపట్టడానికి సిద్ధమవుతున్నారు. వర్క్ టు రూల్ (నిబంధనల ప్రకారం మాత్రమే పని చేయడం), పెన్ డౌన్ (పనిని నిలిపివేయడం).. సామూహిక సెలవుల వంటి చర్యల ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని వారు యోచిస్తున్నారు. ఈ ఉద్యమంతో ప్రభుత్వ కార్యకలాపాలు స్తంభించిపోయే ప్రమాదం ఉంది. ఉద్యోగుల ఐక్య పోరాటం ప్రభుత్వానికి ఒక పెద్ద సవాలుగా మారే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి వారి సమస్యలకు పరిష్కారం చూపుతుందో లేదో చూడాలి.
Also Read: కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. జనన, మరణ రికార్డులతో ఓటర్ల జాబితా అనుసంధానం