Banakacharla: 3 నదుల అనుసంధానం 2 రాష్ట్రాల మధ్య చిచ్చు.. బనకచర్ల ఫుల్ స్టోరీ ఇదే!

మూడు నదులను అనుసంధానం చేసి బనకచర్ల ప్రాజెక్ట్ నిర్మించాలనుకుంటున్న ప్రతిపాదన 2 తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతోంది. గోదావరి వరద జలాలను పెన్నా బెసిన్‌కు తరలించాలని ఏపీ ప్రభుత్వం ఆ ప్రాజెక్ట్‌ను డిజైన్ చేసింది. దీనికి తెలంగాణ ఒప్పుకోవడం లేదు.

New Update
banakacharla

సరిగ్గా 11ఏళ్ల క్రితం ఓ రాష్ట్రం రెండుగా చీలింది. నీళ్లు, నిధులు, నియామకాల పంపకాల్లో.. తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగిందని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. అయితే, ఇప్పుడు అదే నీళ్లపై గొడవ మళ్లీ  తెరమీదకు వచ్చింది. గోదావరి, కృష్ణా జలాల విషయాల్లో రెండు ప్రాంతాల మధ్య ఎప్పటి నుంచో విభేదాలు ఉన్నాయి. గతేడాది చివరిలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రూ.80వేల కోట్లతో కొత్త ప్రాజెక్ట్ నిర్మిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. దీంతో రాయలసీమ సస్యశామలంగా మారుతుందని ఆయన చెప్పారు. అదే ప్రస్తుతం ఆంధ్రా, తెలంగాణ మధ్య నడుస్తోన్న హాట్ టాపిక్ బనకచర్ల ప్రాజెక్ట్. మూడు నదులను అనుసందానం చేసే ఈ ప్రాజెక్ట్.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మాత్రం చిచ్చు పెడుతుంది. అసలు ఏంటీ బనకచర్ల ప్రాజెక్ట్? సీఎంలు వార్నింగ్ ఇచ్చుకునే తారా స్థాయికి.. ఈ వివాదం ఎందుకు వెళ్లింది? ఇప్పుడు క్లీయర్‌గా తెలుసుకుందాం..

బనకచర్ల ప్రాజెక్ట్

ఉత్తరాంధ్రలో వర్షాలు ఎక్కువగా కురిసినా అవి సాగుకు వాడుకోలేని పరిస్థితి, రాయలసీమ లోనేమో కరువు. దీంతో గోదావరి బేసిన్ నుంచి నీళ్లను తీసుకొచ్చి పెన్నా బేసిన్‌లో కలపాలని ఆంధ్రప్రదేశ్ ప్లాన్ చేసింది. కొత్తగా నిర్మించే బనకచర్ల ప్రాజెక్టుతో రాష్ట్రంలో నదుల అనుసంధానం పూర్తై.. భవిష్యత్‌లో నీటి సమస్య ఉండదని ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు చెప్పారు. ప్రతిఏటా వర్షాకాలంలో సముద్రంలోకి వృధాగా పోతున్న గోదావరి వరద జలాలను రాయలసీమ, ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు తరలించేందుకు గోదావరి–బనకచర్ల ప్రాజెక్టుని ఏపీ ప్రభుత్వం డిజైన్ చేసింది. వరదల సమయంలో లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 200 TMCలను వాడుకోవాలనేది ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశమని ఏపీ ప్రభుత్వం అంటోంది. రూ.80వేల కోట్లతో చేపట్టే బనకచర్ల ప్రాజెక్ట్..  రాయలసీమలోని 80 లక్షల మందికి తాగునీటితో పాటు 3లక్షల హెక్టార్ల ఆయకట్టుకు నీరందించాలని చూస్తోంది. నాగార్జున సాగర్‌ కుడి కాలువ, వెలిగొండ, తెలుగు గంగ, గాలేరు నగరి, కేసీ కెనాల్‌ కింద 22 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించడానికి రూ.80,112 కోట్లతో ఈ ప్రాజెక్టును ఏపీ గవర్నమెంట్ ప్రతిపాదించింది. ఈ మేరకు కేంద్ర జల శక్తి శాఖకు ఏపీ ప్రభుత్వం నివేదిక ఇచ్చింది. ఈ ప్రాజెక్ట్‌కు ఆర్థిక సాయం చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఇంట్రా స్టేట్‌ లింక్‌ ప్రాజెక్టు కింద నిధులివ్వాలని కోరారు. దీనిపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో కూడా సీఎం చర్చించారు.

మూడు దశల్లో ప్రాజెక్ట్

మూడు దశల్లో గోదావరి–బనకచర్ల అనుసంధానాన్ని ఏపీ ప్రభుత్వం ప్లాన్ చేసింది. గోదావరిలో వరద వచ్చినప్పుడు రోజుకు 2 టీఎంసీల చొప్పున.. ఏటా 200 టీఎంసీలను పోలవరం కుడి కాల్వ ద్వారా కృష్ణా నదిలోకి, అక్కడి నుంచి నాగార్జునసాగర్‌ కుడికాలువ ద్వారా కొత్తగా నిర్మించే బొల్లాపల్లి రిజర్వాయర్‌లోకి, అక్కడి నుంచి నల్లమల అభయారణ్యంలో తవ్వే సొరంగం ద్వారా బనకచర్ల క్రాస్‌ రెగ్యులేటర్‌కు తరలిస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది.

మొదటి దశలో పోలవరం నుంచి కృష్ణా నదికి
రెండో దశలో బొల్లాపల్లి వద్ద రిజర్వాయర్‌ నిర్మించి అందులో నీళ్లు నింపడం
కృష్ణా నది నుంచి నాగార్జున సాగర్‌ కుడి కాల్వలో నీటిని కలుపుతారు. ఈ కాలువను 80 కిలోమీటర్ల నుంచి 96.5 కిలోమీటర్ల వరకు సామర్థ్యాన్ని పెంచి జలాలను తరలిస్తారు. సాగర్‌ కుడికాలువలో 96.5 కిలోమీటర్ల ప్రాంతం నుంచి నీటిని లిఫ్ట్‌ చేసి, పల్నాడు జిల్లా బొల్లాపల్లి వద్ద కొండల్లో నిర్మించే రిజర్వాయర్‌లోకి తరలిస్తారు. 150 టీఎంసీల నిల్వ చేసేలా బొల్లాపల్లి జలాశయం నిర్మిస్తారు.
మూడో దశలో బొల్లాపల్లి నుంచి బనకచర్ల రెగ్యులేటర్‌
బొల్లాపల్లి రిజర్వాయర్‌ నుంచి నల్లమల అరణ్యం మీదు బనకచర్ల రెగ్యులేటర్‌కు తరలిస్తారు. ఇందుకోసం నల్లమల అడవుల్లో 26.8 కిలోమీటర్ల మేర సొరంగం తవ్వుతారు.

ఈ ప్రాజెక్టు కోసం 48 వేల ఎకరాల భూమిని సేకరించాలి. ఇందులో 17 వేల ఎకరాల అటవీ భూమి కూడా ఉంది. ఈ బనచకర్ల ప్రాజెక్టులో నీటిని ఎత్తిపోసేందుకు 4 వేల మెగావాట్ల విద్యుత్తు అవసరమని ప్రభుత్వం ఆ నివేదికలో పేర్కొంది. రెండుచోట్ల టన్నెళ్లు, 9 చోట్ల పంపు హౌస్‌లు నిర్మించాలి. అలానే అవసరమైన చోట గ్రావిటీ కాలువ తవ్వాల్సిఉంది. ఈ ప్రాజెక్టుపై వివరాలు ఇవ్వాలని గోదావరి, కృష్ణానది రివర్ బోర్డులను కేంద్ర జలశక్తి శాఖ కోరింది. ఈ మేరకు కేంద్ర జలవనరుల సంఘం లేఖ రాసింది. దీనిపై CWC తెలంగాణకు కూడా లేఖ రాసి, ఆ రాష్ట్రం అభిప్రాయం తీసుకున్న తర్వాత దాన్ని కేంద్రానికి పంపిస్తామని తెలిపింది.

ఇరు రాష్ట్రాల వాదనలు

బనకచర్ల ప్రాజెక్ట్.. గోదావరి జల వివాద ట్రైబ్యునల్‌ అవార్డుకు, ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టానికి వ్యతిరేకమని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. ఈ ప్రాజెక్టు విషయంలో ఏపీ ముందుకు వెళ్లకుండా నిరోధించాలని కేంద్రాన్ని కోరుతోంది. ఈ ప్రాజెక్టులో నాగార్జున సాగర్‌ను వినియోగించడాన్ని తెలంగాణ తప్పు పడుతోంది. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఓ సమావేశం నిర్వహించి.. గోదావరి, కృష్ణా బోర్డులతో పాటు కేంద్ర జలశక్తి శాఖ, కేంద్ర జలవనరుల సంఘానికి లేఖలు రాశారు. ఈ మేరకు ప్రాజెక్టు ముందుకు వెళ్లకుండా అడ్డుకోవాలని, టెండర్లు పిలవకుండా చర్య తీసుకోవాలని కోరాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు, జల్‌శక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌కు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి లేఖలు రాశారు. సెంట్రల్‌ వాటర్‌ కమిషన్, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలపకుండా చూడాలని ఆయన కోరారు. గోదావరి - బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం 2 ప్రతిపాదనలతో ముందుకు వచ్చింది. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలతోపాటు కేంద్రానికి పలు సూచనలు చేసింది. ఈ ప్రాజెక్టుకు గోదావరి బోర్డు, సీడబ్ల్యూసీ, ఎపెక్స్‌ కౌన్సిల్‌ ఆమోదం లభించిన తరువాతే ముందుకు వెళ్లాలని సూచించింది. 

గోదావరిపై తెలంగాణ నిర్మించాలనుకుంటున్న 4 ప్రాజెక్టుల డీపీఆర్‌లు... సీతమ్మ సాగర్, సమ్మక్కసాగర్, కాళేశ్వరం ప్రాజెక్టు పురోగతి, వార్ధా పెండింగ్‌లో ఉన్నాయి. ఇంకా పూర్తిస్థాయి అనుమతులు రావాల్సి ఉంది. ఈలోగా అదే గోదావరి నది నీళ్లను ఏపీ ఎలా తరలిస్తారని తెలంగాణ ఇరిగేషన్‌ రిటైర్డ్‌ ఎస్‌ఈ శ్రీధర్‌ దేశ్‌పాండే అంటున్నారు. తెలంగాణ ప్రాజెక్టులకు 968 టీఎంసీల నీటి కేటాయింపులున్నాయి. ఆ మేరకే ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని అయన అన్నారు. మరి ఏపీ ఏకంగా ఒకేసారి 200 టీఎంసీల నీటిని ఎలా వినియోగించాలని ప్రతిపాదిస్తుందో అర్ధం కావడం లేదని SE శ్రీధర్ చెబుతున్నారు. విభజన చట్టం ప్రకారం ఏదైనా రాష్ట్రం అదనంగా కొత్త ప్రాజెక్టు నిర్మించాలనుకుంటే ముందుగా పక్క రాష్ట్రానికి తెలియజేయాలి. అలా కాకుండా ఏపీ ప్రభుత్వం నేరుగా కేంద్రానికి లేఖ రాసి నిధులు అడగడం అన్యాయమని ఆయన అన్నారు. 

ఆంధ్ర ప్రదేశ్ వాదనలు

సముద్రంలోకి వృధాగా పోయే గోదావరి వరద నీటిని బనకచర్లకు తరలిస్తే తెలంగాణకు వచ్చే నష్టం ఏమిటని ఏపీ ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. గోదావరిపై తెలంగాణ రాష్టం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించినప్పుడు ఏపీ  అభ్యంతరం చెప్పలేదని చంద్రబాబు అంటున్నారు. నదీ ప్రవాహానికి సంబంధించినంత వరకూ ఏపీకి తెలంగాణ ఎగువ రాష్ట్రమని.. గోదావరి వరద నీళ్లను బనకచర్లకు తరలిస్తే ఆ రాష్ట్రానికి ఎలాంటి నష్టం ఉండదని చంద్రబాబు చెబుతున్నారు. బనకచర్ల ప్రాజెక్టు ఆచరణ సాధ్యంకాని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 180 అడుగుల ఎత్తులో ఉన్న గోదావరి నీటిని.. 880 అడుగుల ఎత్తులో ఉన్న బనకచర్ల వద్దకు ఎలా మళ్లిస్తారని సందేహపడుతున్నారు.

రాజకీయ పార్టీ 4వాదనలు

బనకచర్ల ప్రాజెక్ట్ విషయంలో రెండు రాష్ట్రాల నుంచి నాలుగు వాదనలు వినిపిస్తున్నాయి. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కృష్ణపై 500TMC, గోదావరిపై  1000TMC ల జలాలు తెలంగాణ వాడుకోడానికి క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతే మిగిలిన నీటిని ఎటైనా తరలించుకోడని అన్నారు. దీనిపై బీఆర్ఎస్ పార్టీ మండిపడుతుంది. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌కు గోదావరి నీళ్లు తరలించుకుకోడానికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చిందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హాయంలో చర్చలు, ఒప్పందాల కారణంగానే ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు బనక చర్ల ప్రాజెక్ట్‌కు సిద్ధమవుతుందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. కేసీఆర్ ఆనాలోచిన నిర్ణయాల వల్లే నదీ జలాల పంపకాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటి పారుదల శాఖమంత్రి ఉత్తమ్ కుమార్ ఆరోపిస్తున్నారు.

అటు ఏపీలో మాత్రం వైసీపీ బనకచర్ల ప్రాజెక్ట్‌పై మాట్లాడట్లేదని టీడీపీ పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. ఇక వైసీపీ నాయకులు బనకచర్ల ప్రాజెక్ట్‌కు కేంద్రం నుంచి ప్రభుత్వం అనుమతులు తీసుకురాలేకపోతుందని విమర్శలు గుప్పిస్తోంది. ఇలా ఈ నాలుగు రాజకీయ పార్టీలు జనకచర్ల ప్రాజెక్ట్ అంశాన్ని ప్రత్యర్థులపై అస్త్రంగా వాడుకుంటున్నాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు