Abhishek Sharma : వాటే ఇన్నింగ్స్.. యువరాజ్ సింగ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ శర్మ

దుబాయ్‌లో పాకిస్థాన్‌తో జరిగిన ఆసియా కప్ సూపర్ ఫోర్ మ్యాచ్‌లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ అరుదైన ప్రపంచ రికార్డు సృష్టించాడు. టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా 50 సిక్సర్లు కొట్టిన బ్యాటర్‌గా నిలిచాడు.

New Update
yuvi

ఆసియా కప్(Asia cup 2025) సూపర్ ఫోర్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌(pakistan) తో జరిగిన పోరులో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ(abhishek-sharma) అద్భుతమైన రికార్డు సృష్టించాడు. కేవలం తన 20వ అంతర్జాతీయ టీ20 ఇన్నింగ్స్‌లోనే 50 సిక్సర్లు పూర్తి చేసి, ఈ ఘనత సాధించిన ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన బ్యాటర్‌గా నిలిచాడు. అభిషేక్ శర్మ కేవలం 331 బంతుల్లో ఈ మైలురాయిని చేరుకుని వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్ ఎవిన్ లూయిస్ (366 బంతులు) పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. ఈ రికార్డులో రసెల్, హజ్రతుల్లా జజాయ్, సూర్యకుమార్ యాదవ్ వంటి ఆటగాళ్లను అభిషేక్ అధిగమించాడు. 

Also Read :  IND vs PAK : పాకిస్థాన్‌కు బిగ్ షాక్.. సూపర్ ఫోర్ మ్యాచ్‌కు కూడా అతనే

T20I లలో అతి తక్కువ బంతుల్లో 50 సిక్సులు

331 బంతులు - అభిషేక్ శర్మ (భారత్ )
366 బంతులు - ఎవిన్ లూయిస్ (వెస్టిండీస్)
409 బంతులు - ఆండ్రీ రస్సెల్ (వెస్టిండీస్)
492 బంతులు - హజ్రతుల్లా జజాయ్ (ఆఫ్ఘనిస్తాన్)
510 బంతులు - సూర్యకుమార్ యాదవ్ (భారత్  )

ఇన్నింగ్స్‌ల పరంగా కూడా అభిషేక్ శర్మ, ఎవిన్ లూయిస్ రికార్డును సమం చేశాడు. ఇద్దరూ తమ టీ20 కెరీర్‌లో 20వ ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించారు. పాకిస్తాన్‌పై 74 పరుగులు చేసిన అద్భుతమైన ఇన్నింగ్స్‌లో, అభిషేక్ శర్మ ఈ రికార్డును నెలకొల్పాడు. ముఖ్యంగా పాకిస్తాన్ స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిది బౌలింగ్‌లో తొలి బంతినే సిక్సర్‌గా మలిచి తన దూకుడైన ఆటతీరును ప్రదర్శించాడు. ఈ మ్యాచ్‌లో అతని మెరుపు ఇన్నింగ్స్ భారత విజయంలో కీలక పాత్ర పోషించింది. 

ఇక ఈ మ్యాచ్ లో  24 బంతుల్లో అర్ధ సెంచరీ బాదిన అభిషేక్, తన గురువు యువరాజ్ సింగ్ పాకిస్థాన్‌పై టీ20లో అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ సాధించిన రికార్డును కూడా బద్దలు కొట్టాడు. 2012 డిసెంబర్ 28న అహ్మదాబాద్‌లో జరిగిన ఇండియా-పాకిస్తాన్ టీ20 మ్యాచ్‌లో, యువరాజ్ తన హాఫ్ సెంచరీ పూర్తి చేయడానికి 29 బంతులు ఎదురుకున్నాడు. 

6 వికెట్ల తేడాతో విజయం

ఇక మ్యాచ్ విషయానికి వస్తే..  పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 172 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ(74), గిల్(47) తొలి వికెట్‌కు 105 పరుగులు భాగస్వామ్యాన్ని  నెలకొల్పారు. స్వల్ప వ్యవధిలో వికెట్లు కోల్పోయినప్పటికీ తిలక్(30*) నిలబడి జట్టుకు విజయాన్ని అందించారు. ఈ టోర్నీలో పాక్‌పై భారత్‌కిది రెండో విజయం కావడం విశేషం. ఇక భారత్ తన తర్వాతి మ్యాచ్ బుధవారం బంగ్లాదేశ్‌తో ఆడనుంది. అటు పాకిస్థాన్ మంగళవారం శ్రీలంకతో తలబడనుంది. 

Advertisment
తాజా కథనాలు