/rtv/media/media_files/2025/12/03/modi-putin-2025-12-03-11-47-31.jpg)
రష్యా, ఉక్రెయిన్ యుద్ధం(Russia Ukraine War) మొదలైన తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ కు రావడం ఇదే మొదటిసారి. 2021లో ఆయన చివరి సారి ఇండియాకు వచ్చారు. ప్రస్తుతం చాలా కీలక పరిణామాల మధ్యన పుతిన్(putin) భారత్(india) లో పర్యటిస్తున్నారు. ఒకవైపు రష్యా, ఉక్రెయిన్ ల మధ్య సంధి కుదర్చడానికి అమెరికా ప్రయత్నాలు చేస్తోంది. క్రెమ్లిన్ లో ఇరు దేశాధికారులూ చర్చలు చేస్తున్నారు. మరో వైపు రష్యా దగ్గర ఆయిల్ కొంటూ యుద్ధానికి సహకరిస్తోందని అమెరికా..భారత్ పై 25శాతం అదనపు సుంకాలను విధించింది. అమెరికా ఏం చేసినా సరే తమ దేశాలకు ఏది మంచిదో అదే చేస్తామని ఇటు ప్రధాని మోదీ, అటు పుతిన్ ఇద్దరూ తెగేసి చెప్పారు. ఈ నేపథ్యంలో పుతిన్ భారత్ పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశాన్ని రెండు దేశాలు మాత్రమే కాకుండా మొత్తం ప్రపంచం నిశితంగా గమనిస్తోంది.
Also Read : ముందుకు సాగని చర్చలు.. శాంతి ప్రణాళికకు అంగీకరించని రష్యా
భారత పర్యటన షెడ్యూల్..
అధ్యక్షుడు పుతిన్ భారత్ లో రేపు, ఎల్లుండి రెండు రోజుల పాటూ ఉంటారు. ఢిల్లీలో 30 గంటలు ఉంటారని అంచనా వేస్తున్నారు. రేపు సాయంత్రం పుతిన్ ఢిల్లీకి చేరుకుంటారు. ఆయనకు భారత ప్రధాని మోదీఆతిథ్యమివ్వనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ప్రైవేట్ విందు, ఇతర ప్రైవేట్ కార్యక్రమాలతో సహా కొన్ని ముఖ్యమైన సమావేశాలను నిర్వహిస్తారు.
డిసెంబర్ 5న అంటే ఎల్లుండి..ఉదయం 9:30 గంటలకు రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలోఅధికారికస్వాగత కార్యక్రమం జరుగుతుంది. దీని తరువాత రాజ్ఘాట్లో మహాత్మా గాంధీకి పుతిన్, మోదీలతోపాటూ పలువురు నేతలు నివాళులర్పిస్తారు. ఆ తరువాత పరిమిత స్థాయి చర్చలు, తరువాత హైదరాబాద్ హౌస్లో ద్వైపాక్షిక, ప్రతినిధి బృంద స్థాయి చర్చలు జరగనున్నాయి. మధ్యాహ్నం ప్రతినిధులతో భోజనం చేయనున్నారు. దీనికి కొంతమంది ప్రముఖ పారిశ్రామికవేత్తలు కూడా హాజరు కావచ్చునని చెబుతున్నారు. లంచ్ తర్వాత ప్రధాని మోదీ, పుతిన్ లు హైదరాబాద్ హౌస్లో ఒప్పందాలు చేసుకోవడమే కాక, వాటిపై ప్రకటనలు కూడా చేయనున్నారు. ఇక్కడే మీడియా మీటింగ్ కూడా నిర్వహించనున్నారు. ఇందులో ఇండియా-రష్యా బిజినెస్ ఫోరంతో పాటూమోదీ, పుతిన్ కూడా పాల్గొనవచ్చు. సాయంత్రం రాష్ట్రపతి ఏర్పాటు చేసిన విందులో పాల్గొంటారు.. విందు తర్వాత, పుతిన్ భారతదేశం నుండి బయలుదేరుతారు.
పర్యటనలో కూడా కీలక ఒప్పందాలు..
రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటనలో ఇరు దేశాల సంబంధాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయని తెలుస్తోంది. భారత్తో పౌర అణు సహకార ఒప్పందానికి రష్యా చట్టసభ డ్యూమా ఇప్పటికే ఆమోదం తెలిపింది. రేపు, ఎల్లుండి పర్యటలో ఈ ఒప్పందంపై ఇరు దేశాధినేతలూ సంతకం చేయనున్నారు. దీంతో పాటూ వాణిజ్య రంగంలో కూడా పలు ఒప్పందాలను చేసుకుంటారని చెబుతున్నారు. ఎస్-400 క్షిపణి వ్యవస్థలకు సంబంధించిన ఒప్పందం కూడా కుదుర్చుకోనున్నారు. దాంతో పాటూSu-57 ఐదవ తరం యుద్ధ విమానాలను సరఫరా చేయడానికి కూడా రష్యా ముందుకు వచ్చింది. భారత్తో దౌత్య సంబంధాలు పెంచుకోవడమే కాక..ఇరు దేశాల మధ్యానా సహకారాన్ని మరింత పెంపొందించుకోవడానికి రష్యా ఎదురుచూస్తోందని ఆ దేశాధ్యక్షుడు పుతిన్ అన్నారు. ఆయిల్, పరిశ్రమలు, స్పేస్, వ్యవసాయం, టెక్నాలజీ వంటి రంగాల్లో ఉమ్మడి ప్రాజెక్టులు చేపట్టడమే ఇరు దేశాల లక్ష్యమని చెప్పారు. భారత్ నుంచి దిగుమతులు మరింత పెంచుకునే అంశం పైనా ప్రధాని మోదీతో చర్చలు జరపనున్నట్లు పుతిన్ తెలిపారు. భారత్ కు రష్యా కీలక ఇంధన సరఫరాదారుగా కొనసాగుతుందని అన్నారు.
Follow Us