మరికొన్ని రోజుల్లో అందరం 2025లోకి అడుగుపెట్టబోతున్నాం. 2024లో అనేక ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో చూసుకుంటే గతంలో పడిపోయిన నేతలు మళ్లీ కమ్బ్యాక్ ఇచ్చారు. గతంలో జైల్లో రోజులు గడిపిన చంద్రబాబు నాయడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చెపట్టారు. మహారాష్ట్రంలో దేవేంద్ర ఫడ్నవీస్ రెండోసారి సీఎం అవ్వడం అక్కడి రాజకీయాల్ని కుదిపేసింది. అయితే 2024లో రాజకీయంగా రాణించిన పలువురి నేతల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
దేవేంద్ర ఫడ్నవీస్
దేవేంద్ర ఫడ్నవీస్ 2014 నుంచి 2019 వరకు మహారాష్ట్ర సీఎంగా పనిచేసిన సంగతి తెలిసిందే. 2019లో ఆయన పదవికాలం ముగిసిన తర్వాత.. నేను మళ్లీ వస్తానంటూ ప్రజలకు చెప్పారు. కానీ ఆ సమయంలో జరిగిన ఎన్నికల్లో శివసేన పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో ఫడ్నవీస్ విపక్ష నేతగా వ్యవహరించారు. అయితే 2022లో శివసేన పార్టీ చీలిపోవడం వల్ల ఎన్డీయే కూటమితో కలిసిన ఏక్నాథ్ షిండే సీఎం అయ్యారు. దీంతో ఫడ్నవీస్కు డిప్యూటీ సీఎం పదవి వచ్చింది. అయితే లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీకి తక్కువ ఎంపీ స్థానాల్లో గెలవడంతో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ హైకమాండ్ ఫోకస్ పెట్టింది.
దేవేంద్ర ఫడ్నవీస్ రాష్ట్రవ్యాప్తంగా 75 ర్యాలీల్లో పాల్గొని ప్రచారం చేశారు. చివరికి ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి గెలిచింది. ఈసారి బీజేపీ హైకమాండ్.. ఏక్నాథ్ షిండేను కాదని దేవేంద్ర ఫడ్నవీస్కు ముఖ్యమంత్రిగా బాధ్యతలు అప్పగించింది. బీజేపీ ఈ ఎన్నికల్లో 132 అసెంబ్లీ స్థానాల్లో గెలవడం వల్లే సీఎం పోస్టును తమ పార్టీ నేత ఫడ్నవిస్కు కట్టబెట్టింది. దీంతో ఫడ్నవీస్కు రెండోసారి సీఎంగా పాలించే అధికారం లభించినట్లయ్యింది.
Also Read: ఒళ్లు గగుర్లు పుట్టించే గే కిల్లర్ స్టోరీ.. బయటపడ్డ షాకింగ్ విషయాలు
చంద్రబాబు నాయుడు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గత 30 ఏళ్లుగా ఏపీలో కీలక రాజకీయ నేతగా కొనసాగుతున్నారు. 2014 ఎన్నికల్లో బీజేపీతో జతకట్టిన టీడీపీ.. 2019లో విడపోయిన సంగతి తెలిసిందే. కానీ ఆ ఎన్నికల్లో వైసీపీ పార్టీ అధికారంలోకి రావడంతో జగన్ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. దీంతో టీడీపీ బలహీన విపక్ష పార్టీగా మిగిలిపోయింది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు అమరావతిని రాజధానిగా చేసేందుకు మొదలుపెట్టిన పనులు కూడా అర్థాంతరంగా ఆగిపోయాయి.
మరోవైపు 2023 సెప్టెంబర్లో చంద్రబాబు నాయుడు స్కిల్ స్కామ్ కేసులో అరెస్టయ్యారు. 53 రోజుల పాటు రాజమండ్రి జైల్లో ఉన్నారు. ఈ ఘటన రాష్ట్ర ప్రజల్లో చంద్రబాబుపై సానుభూతిని, సీఎం జగన్పై వ్యతిరేకతను తీసుకొచ్చినట్లయ్యింది. అలాగే ఆ సమయంలో జనసేన పార్టీ టీడీపీతో పొత్తు కుదుర్చుకుంది. ఈ అంశమే ఏపీ రాజకీయాలను మలుపుతిప్పింది. బీజేపీ కూడా టీడీపీ, జనసేనతో కలిసి 2024లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసింది. వైసీపీ ఒంటరిగానే బరిలోకి దిగింది. చివరికి వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమై ఘోరమైన ఓటమిని చవిచూసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు. గత ఐదేళ్లు విపక్ష నేతగా ఉండి, జైళ్లో కాలం గడిపిన చంద్రబాబు ఈ ఏడాదిలో సీఎం కావడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అంతేకాదు టీడీపీ పార్టీ ఎన్డీయే కూటమిలో ఉండటం వల్ల ఈ పార్టీలో ఇద్దరు ఎంపీలకు కేంద్ర మంత్రి పదవులు కూడా దక్కాయి.
హేమంత్ సోరెన్
జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఈ ఏడాది నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. కానీ ఆయన ఎన్నో అడ్డంకులు ఎదుర్కోవాల్సి వచ్చింది. 2024 ప్రారంభంలో సోరెన్.. మైనింగ్, భూకుంభకోణాలపై తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొన్నారు. చివరికి ఈ ఏడాది జనవరిలో మనీలాండరింగ్ కేసులో అరెస్టయ్యారు. దీంతో ఆయన తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే ఇటీవల జరిగిన జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం పార్టీ కాంగ్రెస్తో కలిసి పోటీ చేసింది. ఇక్కడి ఎన్నికల్లో కూడా హేమంత్ సోరెన్కు ప్రజల నుంచి సానుభూతి వచ్చింది.
ఈ ఏడాది నవంబర్లో జరిగిన ఎన్నికల్లో జేఎంఎం పార్టీ కాంగ్రెస్, ఆర్జేడీ, సీపీఐ (M)లతో కలిసి పోటీ చేసింది. 81 స్థానాలకు జరిగిన ఈ ఎన్నికల్లో జేఎంఎం 34 స్థానాల్లో గెలిచింది. తన కూటమితో కలుపుకుంటే మొత్తం 56 స్థానాలు వచ్చాయి. మరోవైపు ఎన్డీయే కూటమి కేవలం24 స్థానాలకే పరిమితం అయ్యింది. చివరికి హేమంత్ సోరెన్ నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
Also Read: సంభాల్లో మరో అద్భుతం.. తాజాగా బయటపడ్డ మృత్యుబావి
రాహుల్ గాంధీ
నాలుగేళ్ల క్రితం రాహుల్ గాంధీ రాజకీయ జీవితం అంతంత మాత్రంగానే ఉంది. 2019 ఎన్నికల్లో ఎన్డీయే కూటమి చేతిలో యూపీఏ కూటమి దారుణంగా ఓడిపోయింది. కేవలం 52 సీట్లకే హస్తం పార్టీ పరిమితమయ్యింది. అంతేకాదు తమ పార్టీకి కంచుకోట అయిన అమితి నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ సీటు కోల్పోయింది. ఆ తర్వాత రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడి పదవి నుంచి తప్పుకున్నారు. మరోవైపు బీజేపీ కూడా రాహుల్గాంధీని రాజకీయాలను సీరియస్గా తీసుకొని నేతగా ముద్రవేసింది.
అయితే 2024 లోక్సభ ఎన్నికలకు ముందు.. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేసిన సంగతి తెలిసిందే. ఈ యాత్రతో రాహుల్ గ్రాఫ్ రాజకీయంగా పెరిగిపోయింది. 2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 99 స్థానాల్లో గెలిచింది. అలాగే ఎన్డీయే కూటమి కూడా 293 సీట్లతోనే కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. ఇండియా కూటమి 232 స్థానాల్లో గెలిచింది. చివరికి రాహుల్ గాంధీకి విపక్ష నేతగా బాధ్యతలు తీసుకునే అవకాశం వచ్చింది. రాజకీయంగా ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్న రాహుల్ గాంధీ ప్రస్తుతం కేంద్రంలో ప్రధాన విపక్ష నేతగా కొనసాగుతున్నారు.
చిరాగ్ పస్వాన్
లోక్జన్శక్తి పార్టీ (రామ్ విలాస్) నేత చిరాగ్ పస్వాన్ ప్రస్తుతం బిహార్లో కీలక రాజకీయ నేతగా ఉన్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయేతో కలిసి ఐదు స్థానాల్లో పోటీ చేసిన ఈ పార్టీ ఐదు స్థానాల్లో గెలిచింది. చిరాగ్ పస్వాన్ నేతృత్వంలో ఈ విజయం సాధ్యకావడంతో బీజేపీ హైకమాండ్ కూడా ఫిదా అయిపోయింది. చివరికి చిరాగ్ పస్వాన్కు మోదీ సర్కార్.. కేంద్ర మంత్రి పదవిని అప్పగించింది. దీంతో ఓ కీలక దళిత నేతగా చిరాగ్ పస్వాన్ స్థాయి రాజకీయంగా మరింత బలపడింది.