/rtv/media/media_files/2025/09/10/tgsrtc-yatradanam-2025-09-10-07-26-33.jpg)
TGSRTC Yatradanam
తెలంగాణ(Telangana) లో రేవంత్ సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా సరికొత్త సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సామాజిక బాధ్యతలో భాగంగా ‘యాత్రాదానం’ అనే వినూత్న కార్యక్రమం చేపట్టింది. వ్యక్తుల పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, పండుగలు, ఇతర శుభకార్యాలు, తదితర ప్రత్యేకమైన, ఆనందదాయకమైన రోజుల్లో అనాథలు, నిరాశ్రయులైన వృద్దులు, దివ్యాంగులు, నిరుపేద విద్యార్థులను ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు, పర్యాటక ప్రాంతాలకు, విహారయాత్రలకు తీసుకెళ్లడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. ఎవరైతే ఇలాంటివి చేయాలనుకుంటారో వారు.. తగిన మొత్తాన్ని TGSRTC సంస్థకు విరాళంగా అందజేస్తే.. వారికి టీజీఎస్ఆర్టీసీ బస్సు సదుపాయం కల్పిస్తుంది.
Also Read : నేపాల్ లాంటి తిరుగుబాటు మనకూ తప్పదు.. రవిప్రకాష్ ట్వీట్ వైరల్!
TGSRTC Yatradanam
తాజాగా ఈ ‘యాత్రాదానం’(Yatradanam) కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ లోని మినిస్టర్స్ క్వార్టర్స్ లో మంగళవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్(vc-sajjanar) తో ఆర్టీసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ ‘యాత్రదానం’ కార్యక్రమ నిర్వహణ పేరుతో ప్రత్యేక నిధిని సంస్థ ఏర్పాటు చేసింది.
*టీజీఎస్ఆర్టీసీ వినూత్న సేవా కార్యక్రమం- ‘యాత్రాదానం’*
— TGSRTC (@TGSRTCHQ) September 9, 2025
*ప్రత్యేకమైన, ఆనందదాయకమైన రోజుల్లో యాత్రలను దానం చేసే సదుపాయం*
*యాత్రాదానం పోస్టర్ ని ఆవిష్కరించిన మంత్రి పొన్నం ప్రభాకర్*
సామాజిక బాధ్యతలో భాగంగా ‘యాత్రాదానం’ అనే వినూత్న కార్యక్రమానికి టీజీఎస్ఆర్టీసీ శ్రీకారం… pic.twitter.com/DUNkTNje1y
Also Read : తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు!
ఇందులో వ్యక్తులతో పాటు ప్రజా ప్రతినిధులు, కార్పొరేట్ సంస్థలు, ఎన్ఆర్ఐలు, అసోసియేషన్స్, ఎన్జీవోలు స్పాన్సర్ చేసి.. అనాథలు, నిరాశ్రయులైన వృద్దులు, దివ్యాంగులు, నిరుపేద విద్యార్థులను ప్రసిద్ధ దేవాలయాలకు, పర్యాటక ప్రాంతాలకు, విహారయాత్రలకు తీసుకెళ్లొచ్చు. సంతోషకరమైన రోజుల్లో ఈ కార్యక్రమం ద్వారా ఇతరుల్లోనూ ఆనందం కలిగించవచ్చు. ఈ కార్యక్రమాన్ని ఎవరైనా అంటే.. వ్యక్తులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు కూడా ఉపయోగించుకోవచ్చు.
దీనికోసం టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీలను కూడా రూపొందించింది. ఈ ప్యాకేజీలో రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, పర్యాటక స్థలాలను కవర్ చేయనున్నారు. ఇందులో భాగంగా దాతలు చెల్లించే విరాళం మేరకు.. కిలోమీటర్ల ఆధారంగా ఏసీ, సూపర్ లగ్జరీ, డీలక్స్, ఎక్స్ ప్రెస్ బస్సులను విహారయాత్రలకు సంస్థ ఏర్పాటు చేస్తుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. టూర్ ప్రారంభానికి వారం రోజుల ముందు బస్సులను బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.
దీనికోసం దాతలు సమీపంలో ఉన్న ఆర్టీసీ డిపో అధికారులను సంప్రదించాలి. అనంతరం యాత్రాదానం కింద బస్సులను బుకింగ్ చేసుకోవాలి. ఇతర సమాచారం కోసం ఆర్టీసీ హెల్ప్ లైన్ నంబర్లు 040 69440000 / 040 23450033 కాల్ చేసి టూర్ ప్యాకేజీల వివరాలను తెలుసుకోవచ్చు.