/rtv/media/media_files/2025/06/03/PtPPuoaum78cfqozzyOm.jpg)
Bhoobharati : తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు గాను నేటి నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నారు. అలాగే కొత్తగా తీసుకొచ్చిన భూ భారతి అమలులో భాగంగా రెవెన్యూ సదస్సులను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా భూభారతిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ సదస్సులలో రెవెన్యూ అధికారులు మానవీయ కోణంలో భూ సమస్యలను పరిష్కరించాలని సంబంధిత మంత్రిత్వ విభాగం ఆదేశించింది. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో రైతులు వారి ప్రమేయం లేకుండా భూ సమస్యల్లో చిక్కుకున్నారని, దీని ఫలితంగా భూ పరిపాలనలో విస్తృతమైన సమస్యలు తలెత్తాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆరోపించారు.
Also Read: HHVM Trailer: పవన్ ఫ్యాన్స్ రెడీ అవ్వండమ్మ.. ‘హరి హర వీరమల్లు’ ట్రైలర్ వచ్చేస్తుంది!
గత పరిపాలనలో వ్యవస్థాగత వైఫల్యాలు, దుర్వినియోగాన్ని సరిదిద్దడానికి తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కాగా గతంలో ఉన్న చట్టంలోని లోపాలను సరిచేసేందుకు వీలుగా ఏప్రిల్ 14న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా భూభారతి చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చినట్టుగా పొంగులేటి గుర్తు చేశారు. ఆ తర్వాత ఏప్రిల్ 17 నుంచి 4 మండలాల్లో మొదటి దశ, మే 5 నుంచి 28 మండలాల్లో రెండో దశలో రెవెన్యూ సదస్సులు నిర్వహించామన్నారు. మొదటి దశలో 72 రెవెన్యూ గ్రామాల్లో 13,000 కు పైగా దరఖాస్తులు, రెండో దశలో 421 రెవెన్యూ గ్రామాల్లో 42,000 దరఖాస్తులు వచ్చాయన్నారు. వాటిలో ఇప్పటివరకు దాదాపు 60 శాతం భూ సమస్యలు పరిష్కరించబడ్డాయని తెలిపారు. వీటిలో అధికంగా సాదాబైనామాకు సంబంధించిన దరఖాస్తులు ఉన్నాయని తెలిపారు.
ఇక మిగిలిన అన్ని మండలాల్లో సమస్యల పరిష్కారానికి గాను జూన్ 3 నుంచి 20 వరకు రాష్ట్రవ్యాప్తంగా ‘ప్రజల వద్దకే రెవెన్యూ’ పేరుతో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని అన్నారు. తహసీల్దార్ల నేతృత్వంలో రెవెన్యూ బృందాలు ప్రతి రెవెన్యూ గ్రామానికి వెళ్లి, దరఖాస్తులను స్వీకరిస్తాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిష్కరించడం ద్వారా భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం అందించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి పొంగులేటి చెప్పారు.
Also Read : రాజన్నగోశాలలో కోడెల మృత్యుఘోష
గత ప్రభుత్వంలో కొందరికే పరిమితమైన రెవెన్యూ సేవలను.. గ్రామ స్థాయిలో అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృతనిశ్చయంతో ముందుకు సాగుతోందన్నారు. జిల్లా కలెక్టర్లు మానవీయ కోణంలో భూ సమస్యలకు పరిష్కారం చూపాలని సూచించారు. ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటించి భూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రజల వద్దకు వెళ్లే రెవెన్యూ బృందం కూడా మానవతా దృక్పథంతో వ్యవహరించి ప్రజలకు అవసరమైన సేవలు అందించాలని మంత్రి సూచించారు.
భూభారతి చట్టం దేశానికి రోల్ మోడల్గా నిలుస్తుందని మంత్రి పొంగులేటి అన్నారు. బీఆర్ఎస్ తెచ్చిన ధరణికి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతికి నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉందన్నారు. ఆగస్టు 15 నాటికి సాధ్యమైనన్ని భూ సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. రాష్ట్రంలో 6వేల మంది లైసెన్స్డ్ సర్వేయర్లను విధుల్లోకి తీసుకున్నామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం 2.10లక్షల మందిని ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ పథకం కింద నాలుగేళ్లలో 20లక్షల మందికి ఇండ్లు అందిస్తామని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు లబ్ధిదారుల ఎంపిక అనేది నిరంతర ప్రక్రియ అని అందరికీ ఇండ్లు ఇవ్వడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పొంగులేటి తెలిపారు.
Also Read : యువతి ప్రైవేట్ పార్ట్స్పై స్క్రూ డ్రైవర్తో పొడిచి దారుణ హత్య
Also Read : ట్రంప్కు షాక్ ఇచ్చిన మోదీ.. అమెరికాపైనే ఇండియా సుంకాలు!!