/rtv/media/media_files/2025/12/27/ghmc-2025-12-27-13-32-49.jpg)
GHMC
Musi River: హైదరాబాద్ మహానగరాన్ని మూడు కార్పొరేషన్లుగా విభజించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనికోసం నగరం చుట్టూ ఉన్న గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేసి నగరాన్ని మూడు కార్పొరేషన్లుగా విభజించాలని ప్రయత్నిస్తోంది. దీనికోసం హైదరాబాద్ మహానగరం మధ్య నుంచి ప్రవహిస్తున్న మూసీ నదిని బేస్గా చేసుకొని రాజధాని నగరాన్ని మూడు కార్పొరేషన్లుగా విభజించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జీహెచ్ఎంసీని గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ సికింద్రాబాద్, గ్రేటర్ సైబరాబాద్ పేర్లతో మొత్తం మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేయనుంది. నగరంలోని కార్పొరేషన్ డ్రైనేజ్ వ్యవస్థకు మూసీ కీలకం కాబట్టి మూడు కార్పొరేషన్ల పరిధిలోనూ మూసీకి ఇరువైపుల ప్రాంతాలు ఉంటాయి.
ఒక్కో కార్పోరేషన్ పరిధిలో 100 వార్డులు ఉంటాయి. ప్రతి కార్పొరేషన్లో 20 సర్కిళ్లు, 5 జోన్లు, ప్రతి జోన్కు నాలుగు సర్కిళ్లు ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మూడు కార్పొరేషన్లకు ముగ్గురు మేయర్లు ఉంటారు. ప్రతి కార్పొరేషన్కు కార్యదర్శి స్థాయి అధికారి కమిషనర్గా వ్యవహరించనున్నారు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి తుది నోటిఫికేషన్ జనవరిలో వెలువడే అవకాశం ఉంది. ఏప్రిల్, మే నెలల్లో ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) పరిధిలో పాతనగరం, సెంట్రల్ హైదరాబాద్ ఉండనున్నాయి. గ్రేటర్ సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీఎస్ఎంసీ) పరిధిలో ఉత్తర, ఈశాన్య హైదరాబాద్ ప్రాంతాలు కలుస్తాయి. గ్రేటర్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీసీఎంసీ)కి సంబంధించి పశ్చిమ, వాయవ్య ప్రాంతాలు కలవనున్నాయి.
Follow Us