/rtv/media/media_files/2025/08/03/cyber-crime-2025-08-03-10-59-37.jpg)
CYBER CRIME
Crime : సైబర్ మోసాలు పెరుగుతున్నప్పటికీ కొంతమంది అత్యాశకు పోయి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. సాధారణ వ్యక్తులతో పాటు ఉన్నత ఉద్యోగులు సైతం సైబర్ వలకు చిక్కుతున్నారు. తాజాగా బ్రాండెడ్ వస్తువులకు రేటింగ్ ఇస్తే కమిషన్ ఇస్తామంటూ సైబర్ నేరగాళ్లు ఓ ఐటీ ఉద్యోగికి ఆశ చూపారు. అది నిజమని నమ్మిన సదరు ఉద్యోగి నిండా మునిగాడు. ఆయన నుంచి రూ. 54.67 లక్షలు కాజేశారు సైబర్ నేరగాళ్లు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Nani Heroine: నానికి కలిసొచ్చిన హీరోయిన్.. ఈసారి 'జూలియట్' గా మళ్ళీ రొమాన్స్!
బాలానగర్ హెచ్సీఎల్లో ఉద్యోగిగా పనిచేస్తున్న సందిప్రెడ్డి సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలోని ప్రణీత్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఈ నెల 15న ఆయన ఫోన్లో ఉన్న టెలిగ్రామ్కు ఒక మెసేజ్ వచ్చింది. ఆయన ఆ లింక్ తెరిచి చూడగా బ్రాండెడ్ వస్తువులకు రేటింగ్ ఇస్తే కమిషన్ ఇస్తామని అందులో ఉంది. దీంతో సందీప్రెడ్డి లింక్లో ఉన్న విధంగా ఆన్లైన్ ఖాతా తెరిచాడు. ఆ ఖాతాలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు అని ఉండటంతో ప్రారంభంలో రూ. 5 వేలు వేశాడు. ఆయన వేసిన ఎమౌంట్కు రూ.12,500 లాభం వచ్చినట్లు చూపడంతో పూర్తిగా నమ్మాడు. మరోసారి రూ.59,800 వేస్తే మరిన్ని లాభాలు అని ఉండటంతో అలాగే చేశాడు. అలా 7,14,180 రూపాయల వరకు జమ చేశాడు. తనకు వస్తున్న లాభాలను వెనక్కి తీసుకోవాలని ప్రయత్నిస్తే క్రెడిట్ స్కోరు(Credit score) లేదని చూపడంతో దానికోసం రూ.5 లక్షలు కట్టమన్నారు. అలాగే చేశాడు.
Also Read : ఈవారం ఓటీటీలో సందడే సందడి.. వార్2, మిరాయ్ సహా మొత్తం ఎన్నంటే?
ఆ తర్వాత వీఐపీ చానల్ ఓపెన్ చేయాలంటూ ఒకసారి రూ.6 లక్షలు, డబ్బులు విత్డ్రా చార్జీలు పేరుతో మరోసారి రూ.12.5 లక్షలు అని మొత్తంగా రూ. 54,67,488 ఖాతాలో జమ చేయించుకున్నారు. అయినా ఆయన డబ్బు తిరిగి రాలేదు. చివరగా మరో రూ.8 లక్షలు కడితే మొత్తం డ్రా చేసుకోవచ్చని ఆశ చూపడంతో సందీప్రెడ్డికి అనుమానం వచ్చింది. తను మోసపోయానని గుర్తించి పటాన్చెరు పోలీస్లను ఆశ్రయించారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సైబర్ క్రైమ్కు సమాచారం ఇవ్వడంతో వారు ఆ మొత్తాన్ని రికవరీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.