/rtv/media/media_files/2025/09/01/rtc-drivers-banned-from-using-cell-phones-2025-09-01-07-42-47.jpg)
RTC drivers banned from using cell phones
RTC Drivers : ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేసే దిశగా తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. బస్సు ప్రమాదాలను తగ్గించేందుకు యాజమాన్యం పలు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా డ్రైవింగ్ సమయంలో బస్సు డ్రైవర్లు సెల్ఫోన్ల వాడకాన్ని నిషేధించింది. ఈ నిషేధం ఈ రోజునుంచే అమల్లోకి రానుంది. సోమవారం నుంచి ఈ నెల 30 వరకు ఆర్టీసీ బస్సు డ్రైవర్లు సెల్ ఫోన్లను వాడడం నిషేధిస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. పైలెట్ ప్రాజెక్టు కింద రాష్ట్రంలోని 11 డిపోల్లో దీనిని అమలు చేయనున్నారు. రాష్ట్రంలో మొత్తం 97 ఆర్టీసీ డిపోలు ఉండగా.. పైలెట్ ప్రాజెక్టు కింద 11 డిపోలను దీనికోసం ఎంచుకున్నారు.
ఇది కూడా చూడండి:Missing Case: 3 రోజుల క్రితం అదృశ్యమైన మహిళ.. కట్ చేస్తే నదిలో మృతదేహాం
ముఖ్యంగా డ్రైవర్లు బస్సు నడుపుతున్న సమయంలో సెల్ఫోన్లు వినియోగించడాన్ని పూర్తిగా నిషేధించాలని ఆర్టీసీ నిర్ణయించింది. రోడ్డు ప్రమాదాలను నివారించడమే లక్ష్యంగా ఈ కొత్త నిబంధనను సెప్టెంబర్ 1 నుంచి పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నట్లు పేర్కొంది. డ్రైవింగ్లో ఉన్నప్పుడు కొందరు డ్రైవర్లు సెల్ఫోన్లు వాడుతున్నట్లు ఆర్టీసీ విజిలెన్స్ విభాగం జరిపిన తనిఖీల్లో తేలింది. ఇది ప్రయాణికుల భద్రతకు తీవ్ర ముప్పుగా పరిణమిస్తుందని యాజమాన్యం భావించింది. దీంతో ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. తొలిదశలో సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు ఎంపిక చేసిన 11 డిపోల పరిధిలో ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తారు. గ్రేటర్ హైదరాబాద్ జోన్లోని ఫరూఖ్నగర్, కూకట్పల్లి డిపోలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.
ఈ కొత్త నిబంధన ప్రకారం డ్రైవర్లు విధులకు హాజరైన వెంటనే తమ సెల్ఫోన్లను డిపోలో ఏర్పాటు చేసిన ప్రత్యేక లాకర్లలో భద్రపరుచుకోవలసి ఉంటుంది. డ్యూటీ పూర్తయిన తర్వాతే వారు తమ ఫోన్లను తిరిగి తీసుకోవాలి. ఒకవేళ డ్రైవర్లకు ఏదైనా అత్యవసర సమాచారం ఇవ్వాల్సి వస్తే వారి కుటుంబ సభ్యులు లేదా అధికారులు సంబంధిత బస్సు కండక్టర్ను సంప్రదించడానికి అవకాశం ఇచ్చారు. కండక్టర్ ద్వారా ఆ సమాచారాన్ని డ్రైవర్కు చేరవేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పైలట్ ప్రాజెక్టు ఫలితాలను బట్టి, భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోలలోనూ ఈ విధానాన్ని అమలు చేసే అంశాన్ని ఆర్టీసీ అధికారులు పరిశీలించనున్నారు.
ఆర్టీసీ కార్పొరేషన్ పరిధిలోని 11 రీజియన్ల నుంచి ఒక్కో డిపోను పైలట్ ప్రాజెక్ట్ కింద దీనికోసం ఎంపిక చేశారు. ఫలితాల మేరకు దశల వారీగా అన్ని డిపోల్లో అమలు చేయనున్నారు. డ్రైవరు విధుల్లో చేరేముందు తన సెల్ఫోన్ను స్విచ్ఛాప్ చేసి డిపోలోని సెక్యూరిటీ అధికారి (కార్యాలయం) వద్ద డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.
కాగా తొలిసారి ఈ విధానాన్ని అమలు చేయడానికి ఎంపిక చేసిన డివిజన్లలో ఫరూక్నగర్ (హైదరాబాద్), కూకట్పల్లి (సికింద్రాబాద్), కొల్లాపూర్ (మహబూబ్నగర్), సంగారెడ్డి (మెదక్), మిర్యాలగూడ (నల్గొండ), వికారాబాద్ (రంగారెడ్డి), ఉట్నూర్ (ఆదిలాబాద్), జగిత్యాల (కరీంనగర్), ఖమ్మం (ఖమ్మం), కామారెడ్డి (నిజామాబాద్), పరకాల (వరంగల్) ఉన్నాయి.
ఇది కూడా చూడండి:Crime: తల్లి వివాహేతర సంబంధం.. ఇనుపరాడ్డుతో కొట్టి చంపిన కొడుకు