/rtv/media/media_files/2025/08/16/mla-satish-sail-2025-08-16-08-02-24.jpg)
MLA Satish Sail
MLA Satish Sails : అక్రమంగా ఇనుప ఖనిజాన్ని తవ్వి, విదేశాలకు తరలిస్తున్నారనే ఆరోపణలతో గతంలో ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు లో శిక్ష పడిన ఉత్తరకన్నడ జిల్లా కారవార కాంగ్రెస్ ఎమ్మెల్యే సతీశ్ శైల్కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే అక్రమ నగదు లావాదేవీలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సతీశ్ శైల్ ఇంటిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఎమ్మెల్యే అవినీతి బండారం బయటపడింది. కోట్లల్లో నగదు, కిలోల కొద్ది బంగారం బయట పడింది. గతంలో ఐరన్ ఓర్ అక్రమ తరలింపు కేసులో ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు సతీశ్ శైల్కు ఏడేళ్ల జైలు, రూ.9 కోట్ల జరిమానా విధించింది. అయితే దానిపై ఆయన హైకోర్టును ఆశ్రయించడంతో ఆ తర్వాత ఆ శిక్షను కర్ణాటక హైకోర్టు నిలిపివేసింది. అయితే ఈ కేసు విషయంలో విచారణ జరుపుతున్న ఈడీ తాజాగా ఆయన నివాసం, కార్యాలయాలపై దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో 1.68 కోట్ల రూపాయల నగదు, 6.750 కిలోల బంగారు ఆభరణాలు, బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నట్టు ఈడీ తెలిపింది.
రెండురోజుల పాటు ఏకధాటిగా నిర్వహించిన ఈ దాడుల్లో భారీగా నగదు, బంగారం గుర్తించినట్టు ఈడీ ‘ఎక్స్’ ద్వారా ప్రకటించింది. ఢిల్లీ, గోవా, ముంబై, బెంగళూరు తదితర ప్రాంతాలకు చెందిన ఈడీ అధికారులు ఈ దాడిలో పాల్గొన్నారు. మరోవైపు రూ. 14.13 కోట్ల నగదు ఉన్న బ్యాంకు ఖాతాను ఫ్రీజ్ చేశారు. ఈ కేసుకు సంబంధించి పలు కార్యాలయాలపైనా దాడులు నిర్వహించారు. సతీశ్ ఇనుప ఖనిజాన్ని అక్రమంగా తరలించారని ఆరోపణలున్నాయి. దానిపై ప్రజాప్రతినిధుల న్యాయస్థానం ఏడేళ్ల కారాగార శిక్షను విధించింది. అయితే ఉన్నత న్యాయస్థానం శిక్షను రద్దు చేయడంతో కొద్ది నెలల కిందట జైలు నుంచి బయటకు వచ్చారు.
ఈ క్రమంలోనే ఎమ్మెల్యేకు చెందిన శ్రీ మల్లికార్జున షిప్పింగ్ సంస్థతో పాటు, ఆశాపుర మినెకెమ్, శ్రీలాల్ మహల్, స్వస్తిక్ సీటల్స్, ఐఎల్సీ ఇండస్ట్రీస్, శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర మినరల్స్ తదితర సంస్థలపై ఈడీ అధికారులు దాడులు నిర్వహించారు. సతీశ్ కు చెందిన కంపెనీ ద్వారా రూ.86.78 కోట్ల ముడి ఖనిజాన్ని అక్రమంగా తరలించారని ఈడీ ఆరోపించింది. ఎటువంటి అనుమతులు తీసుకోకుండా మైనింగ్ నిర్వహించారని అటవీ అధికారులు వేల టన్నులకు పైగా ఖనిజాన్ని జప్తు చేశారు. అయితే దీనిపై హైకోర్టుకు వెళ్లగా.. సరైన పత్రాలు ఉంటే ఎగుమతి చేసుకోవచ్చని చెప్పింది. దీని అలుసుగా తీసుకున్న సతీశ్ శైల్ జప్తు చేసిన ఐరన్ ఓర్ నుంచి 11 వేల టన్నులు అక్రమంగా తరలించారు. ఈ కేసులో ఈడీ అరెస్ట్ చేయగా హైకోర్టు శిక్షను రద్దు చేసింది. అయితే ఈడీ మాత్రం ఈ కేసును మరోసారి కోర్టులో సవాలు చేసేందుకు సిద్ధమైంది. ఒకవేళ ఆయన దోషిగా తేలితే ఆయన శాసనసభ్యత్వం రద్ధయ్యే అవకాశం ఉంది.
Also Read: TS: పదవులు మీకే..పైసలు మీకే..కోమటి రెడ్డి రాజగోపాల రెడ్డి సంచలన వ్యాఖ్యలు