/rtv/media/media_files/2025/11/21/fire-accident-at-cop30-climate-summit-2025-11-21-10-39-04.jpg)
Brazil : బ్రెజిల్లోని బెలెమ్లో నిర్వహిస్తున్న కాప్-30 సదస్సులో (COP30 Climate Summit) అగ్ని ప్రమాదం(fire accident) చోటు చేసుకుంది. ఈ ఘటనలో 21 మంది గాయపడ్డారు. మైక్రోవేవ్లో మంటలు రేగడంతో ఈ ప్రమాదం సంభవించిందని అగ్నిమాపక అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా బ్రెజిల్ కేంద్రంగా నిర్వహిస్తున్న కాప్-30 సదస్సులో వాతావరణ సంక్షోభం పరిష్కారానికి అంతర్జాతీయ ప్రయత్నాల బలోపేతానికి ఒప్పందం కుదుర్చుకోవడంపై చర్చలు జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడం కొంత ఆందోళనకు దారి తీసింది. అయితే సంబంధిత అధికారులు అప్రమత్తమవ్వడంతో భారీ ప్రమాదం తప్పింది.
Fire At COP Conference
🚨BREAKING: A fire erupted inside the "COP30 CLIMATE SUMMIT" venue in Belém, Brazi forcing a panicked evacuation for thousands of delegates pic.twitter.com/522h6nhFkL
— michelle selaty (@michelle_selaty) November 20, 2025
ఈ సదస్సుకు సంబంధించిన సమావేశాలతో పాటు సంప్రదింపులు, వివిధ దేశాలు నెలకొల్పిన పెవిలియన్లు, మీడియా సెంటర్ వంటి కీలక ప్రదేశాలు ఉన్న ‘బ్లూ జోన్’లో ఈ మంటలు చెలరేగడం ఆందోళన రేకెత్తించింది. ఈ ఘటనలో 21 మంది గాయపడగా.. మంటల తీవ్రతతో సదస్సుకు హాజరైన వేలాది మంది ప్రాణభయంతో పరుగులు తీశారు. ఈ క్రమంలో అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించించింది. కొంత సమయం శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు బ్రెజిలియన్ ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. అయితే, ఎవరెవరు గాయపడ్డారనే వివరాలను మాత్రం వారు వెల్లడించలేదు. గాయపడినవారిలో 12 మంది ఇప్పటికే డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. అగ్నిప్రమాద సమయంలో ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ కూడా అక్కడే ఉన్నారు. యూఎన్ భద్రతా రక్షణ అధికారులు వెంటనే స్పందించి గుటెర్రస్తో పాటు మిగిలినవారిని అందరిని కూడా బయటకు తరలించారు.
Also Read: హైడ్రా కమిషనర్ రంగనాథ్కు షాక్.. బండి సంజయ్ విజయం
ఇక ఈ ప్రమాదానికి గల కారణాలను గుర్తంచేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అయితే, మైక్రోవేవ్ లేదా విద్యుత్ పరికరం కాలిపోవడం కారణం అయి ఉండవచ్చని అగ్నిమాపక అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. వాతావరణ ఆర్థికసాయం, శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించడం అనే అంశంపై జరుగుతున్న ఈ సదస్సులో హాజరైన దేశాల మధ్య ఒప్పందం కుదరాల్సి ఉండగా, ప్రమాదం నేపథ్యంలో ఒప్పందానికి సంబంధించిన కీలక చర్చలకు అంతరాయం కలిగింది. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం సదస్సు తిరిగి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. కాగా, ఈ సదస్సుకు భారత పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్ కూడా హాజరయ్యారు. ప్రమాద సమయంలో భారత ప్రతినిధి బృందంతో కలిసి ఆయన కూడా బ్లూజోన్ లోనే ఉన్నారు. అయితే ఘటన నేపథ్యంలో వారంతా సురక్షితంగా ఉన్నారని, మంటలు వ్యాపించిన వెంటనే బయటకు వచ్చేశారని మంత్రిత్వశాఖ ప్రతినిధి స్పష్టం చేశారు.
Also Read: 12 ఏళ్ల బాలికను రేప్ చేసిన భూతవైద్యుడు.. తల్లిదండ్రులు ఉండగానే - ఛీఛీ
Follow Us