/rtv/media/media_files/2025/10/16/mahaboobnagar-district-lalkota-high-school-frog-in-midday-meals-2025-10-16-11-55-20.jpg)
Frog Carcass in School Lunch in Mahabubnagar Lalkota High School
తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో(Telangana Government Schools) విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం నాణ్యతపై ఈ మధ్య కాలంలో వరుస సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో విద్యార్థులు తమ ఆహారంలో జీవరాశులను గుర్తించడం తీవ్ర చర్చనీయాంశమైంది. గతంలో మహబూబ్నగర్ జిల్లాలోని బాదేపల్లి పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో జెర్రి ప్రత్యక్షమైంది. అలాగే నారాయణపేట జిల్లాలోని మాగనూరు పాఠశాలలో కూడా వరుసగా పురుగులు ఉన్న భోజనాన్ని వడ్డించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు(food poison in telangana). ఈ ఘటనలతో ప్రభుత్వం అప్రమత్తమై, ఆహార నాణ్యతపై ప్రత్యేక తనిఖీలు (స్పెషల్ డ్రైవ్స్), పర్యవేక్షక కమిటీలను ఏర్పాటు చేస్తోంది. అయినా తరచూ ఎక్కడో చోట ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటిదే మరొకటి తెలంగాణలో చోటుచేసుకుంది.
Also Read : బిగ్ ట్విస్ట్ ఇచ్చిన కొండా సురేఖ.. సంచలన నిర్ణయం!
Mahabubnagar Lalkota High School
మహబూబ్నగర్ జిల్లాలోని సీసీకుంట మండలం లాల్కోట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం మధ్యాహ్న భోజనంలో చనిపోయిన కప్ప కనిపించటం కలకలం రేపింది. సుమారు 270 మంది విద్యార్థులకు భోజనం అందించే క్రమంలో ఈ ఘటన వెలుగు చూసింది. బుధవారం మధ్యాహ్నం విద్యార్థులకు అన్నం, పప్పు వడ్డిస్తున్న సమయంలో పప్పులో కప్ప కళేబరం కనిపించిందని కొందరు విద్యార్థులు గుర్తించారు.
ఇది చూసిన విద్యార్థులు వెంటనే భోజనం చేయకుండా అక్కడి నుంచి వెళ్లిపోయి తమ తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అప్పటికే కొందరు విద్యార్థులు భోజనం చేసినట్లు సమాచారం. ఈ విషయం వెంటనే గ్రామంలో చర్చనీయాంశమైంది. ఘటన తీవ్రత దృష్ట్యా భోజనంలో కప్ప కనిపించిన విషయం బయటకు పొక్కకుండా పాఠశాల హెడ్మాస్టర్, ఉపాధ్యాయులు జాగ్రత్త పడ్డారని సమాచారం. ఇక విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు మధ్యాహ్న భోజనం నిర్వాహకులపై, పాఠశాల యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని మండిపడ్డారు.
ఈ ఘటనపై జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) ప్రవీణ్ కుమార్ను మీడియా వివరణ కోరగా.. లాల్కోట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో కప్ప వచ్చినట్లు ఫిర్యాదు అందిన మాట వాస్తవమేనని ఆయన ధృవీకరించారు. కచ్చితమైన వివరాలు తెలుసుకోవడం కోసం గురువారం పాఠశాలకు వెళ్లి పూర్తి విచారణ చేపడతామని డీఈఓ తెలిపారు.
అదేవిధంగా ఎంఈఓ మురళీకృష్ణను వివరణ కోరగా.. కప్ప ఉందన్న రూమర్స్ మాత్రమే ఉన్నాయని, కప్ప కనిపించినట్లు ఎక్కడా ఆధారాలు లేవని ఆయన తెలిపారు. అయినప్పటికీ పూర్తి సమాచారం తెలుసుకొని విచారణ చేపట్టనున్నట్లు ఎంఈఓ పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సరఫరా చేసే మధ్యాహ్న భోజనం నాణ్యత విషయంలో అధికారులు, నిర్వాహకులు మరింత అప్రమత్తంగా ఉండాలని ఈ ఘటన మరోసారి హెచ్చరించింది.
Also Read : కొండా మురళీ సంచలన ప్రకటన!