/rtv/media/media_files/2025/09/02/kavita-and-kcr-2025-09-02-15-30-26.jpg)
Kavita and KCR
మాజీ సీఎం కేసీఆర్.. ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవలి కాలంలో ఆమె పార్టీకి నష్టం కలిగించేలా ప్రవర్తిస్తున్న నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ కీలక నాయకురాలైన కవితను సస్పెండ్ చేయడం తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. గతేడాది లిక్కర్ స్కామ్ వ్యవహారంలో కవిత జైలుకెళ్లి బెయిల్పై విడుదలైన సంగతి తెలిసిందే. అప్పటినుంచి ఆమె ప్రవర్తనలో మార్పులు వచ్చాయి. సొంత పార్టీపైనే విమర్శలు చేస్తూ వస్తున్నారు. కేసీఆర్ ఆమెను ప్రధానంగా ఐదు కారణాల వల్ల పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది.
Also Read: గణేష్ నిమజ్జనం లో రెచ్చిపోయిన పోలీసులు.. పిడిగుద్దులు గుద్దుతూ
5 కారణాలు ఇవే
కేసీఆర్ చుట్టూ దెయ్యాలు
ఇటీవల కేసీఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వరంగల్లో భారీ బహిరంగ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సభ తర్వాత కవిత.. కేసీఆర్కు ఓ లేఖను రాశారు. సభలో ఆయన కొన్ని పాయింట్లు మిస్ చేశారంటూ తెలిపారు. పార్టీ తీరునే ప్రశ్నించేలా ఆ లేఖ ఉంది. కానీ ఆ లేఖ లీక్ అవ్వడంతో దుమారం రేపింది. ఈ నేపథ్యంలోనే దీనిపై కవిత స్పందించారు. కేసీఆర్ దేవుడని.. ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయంటూ తీవ్రంగా విమర్శలు చేశారు. దీంతో పార్టీ అగ్రనేతలు ఆమెపై సీరియన్ అయ్యారు.
బీఆర్ఎస్ బీజేపీలో విలీనం వివాదం
గతంలో బీఆర్ఎస్, బీజేపీలో వీలినం కాబోతుందనే వార్తలు రాష్ట్రంలో సంచలనం రేపాయి. దీనిపై కవిత కూడా స్పందించారు. తాను జైల్లో ఉన్నప్పుడు పార్టీని బీఆర్ఎస్లో విలీనం చేస్తారనే ప్రతిపాదన తీసుకొచ్చారని.. కానీ నేను ఇందుకు ఒప్పుకోలేదని తెలిపారు. ఆమె చేసిన వ్యాఖ్యలు అప్పట్లో దుమారం రేపాయి. పార్టీ అంతర్గత విషయాలను కవిత ఇలా బహిరంగంగా చెప్పడంతో ఆమెపై తీవ్రంగా విమర్శలు వచ్చాయి. మరోవైపు కేటీఆర్, హరీశ్ రావు లాంటి నాయకులు తాము పార్టీని విలీనం చేసేది లేదని క్లారిటీ ఇచ్చారు.
Also read: కేసు కొట్టివేయాలని హైకోర్టులో సీఎం రేవంత్, కేటీఆర్ పిటిషన్
కేసీఆర్ని తప్ప ఎవరి నాయకత్వాన్ని ఒప్పుకోను
కవిత బీఆర్ఎస్ తీరును ప్రశ్నిస్తున్న క్రమంలో తాను కేసీఆర్ నాయకత్వాన్ని తప్పా మరెవరి నాయకత్వాన్ని ఒప్పుకోనని పరోక్షంగా వ్యాఖ్యానించారు. దీంతో హరీశ్ రావు, కేటీఆర్ వంటి అగ్రనేతలపై కవిత పూర్తిగా అసంతృప్తితో ఉన్నట్లు తేటతెల్లమైంది.
జగదీశ్ రెడ్డి లిల్లీఫుట్
ఇటీవల మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో కవిత గురించి ప్రస్తావిస్తూ ఆమెను మేము సీరియస్గా తీసుకోవడం లేదని వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన కవిత జగదీశ్ రెడ్డిని ఓ లిల్లీఫుట్ నాయకుడంటూ వ్యాఖ్యానించారు.
కాళేశ్వరం స్కామ్లో హరీశ్ రావు, సంతోష్ రావు
కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారాన్ని సీబీఐకి అప్పగిస్తున్నామని సీఎం రేవంత్ అసెంబ్లీలో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కవిత మరోసారి మీడియా ముందుకు వచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో కేసీఆర్కు అవినీతి మరకలు అంటించింది హరీశ్ రావు, జోగిన్పల్లి సంతోష్, మేఘా కృష్ణారెడ్డి అంటూ వ్యాఖ్యానించారు. ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. గతంలో కేటీఆర్పై ఇప్పుడు ఏకంగా హరీష్ రావునే టార్గెట్ చేయడంతో పార్టీ శ్రేణులు కూడా ఆమెపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. కవితను పార్టీ నుంచి తొలగించాలని సోషల్ మీడియాలో డిమాండ్ చేశారు. మొత్తానికి ఈ ఐదు కారణాలను పార్టీ అధిష్ఠానం బలంగా పరిగణలోకి తీసుకుంది. ఈ క్రమంలోనే మాజీ సీఎం కేసీఆర్ కవితను సస్పెండ్ చేసినట్లు పార్టీ అధికారికంగా నోటీసు విడుదల చేసింది.
Also Read: కేసీఆర్, హరీష్ రావుకు బిగ్ రిలీఫ్..CBI విచారణకు బ్రేక్