/rtv/media/media_files/2025/08/02/iit-bombay-student-dies-by-suicide-after-jumping-from-hostel-terrace-2025-08-02-20-35-35.jpg)
IIT Bombay student dies by suicide after jumping from hostel terrace
శనివారం ఐఐటీ ముంబైలో విషాదం చోటుచేసుకుంది. అక్కడ చదువుకుంటూ హాస్టల్ ఉంటున్న ఓ 26 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. హస్టల్ భవనంపై ఎనిమిదో అంతస్తు నుంచి బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతి చెందిన విద్యార్థి ఢిల్లీకి చెందిన రోహిత్ సిన్హాగా గుర్తించారు. అతడు బీటెక్ నాలుగో సంవత్సరం చదవుతున్నాడని పేర్కొన్నారు. అతని తల్లిదండ్రలకు సమాచారం అందించామని.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీకి చెందిన రోహిత్ సిన్హా ఐఐటీ బాంబేలో చదువుతున్నాడు. అతను మెటలర్జికల్ ఇంజినీరింగ్, మెటీరియల్స్ సైన్స్ కోర్సు ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. శనివారం తెల్లవారుజున 2.30 గంటల సమయంలో అతడు హాస్టల్ బిల్డింగ్ టెర్రస్ పైకి ఎక్కాడు. అక్కడి నుంచి కిందకు దూకేశాడు. తీవ్రంగా గాయపడ్డ రోహిత్ను ఆస్పత్రికి తరలించారు. కానీ అతడు అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. అయితే ఆ విద్యార్థి గదిలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు చెప్పారు. అయితే రోహిత్ టెర్రస్ పైనుంచి కిందకు దూకిన సమయంలో హాస్టల్ ఉంటున్న మరో విద్యార్థి అక్కడే ఫోన్లో మాట్లాడుతున్నట్లు సమాచారం అందినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Also Read: 'వారానికి 80 గంటలు పనిచేయాలి'.. మరో వ్యాపారవేత్త కీలక ప్రకటన
రోహిత్ ఆత్మహత్యతో ఐఐటీ బాంబేలో విషాదం నెలకొంది. ఐఐటీ లాంటి ప్రతిష్ఠాత్మక సంస్థల్లో గతంలో కూడా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం కలకలం రేపుతోంది. 2019లో ఐఐటీ మద్రాస్లో ఫాతిమా లతీఫ్ అనే విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. అప్పట్లో ఆమె ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర దుమారం రేపింది. కులం, మతం పేరుతో వేధింపులకు గురవ్వడంతో ఆమె సూసైడ్ చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అలాగే ఐఐటీ ఖరగ్పూర్లో కూడా పలు ఆత్మహత్య కేసులు వెలుగుచూశాయి. ఇటీవల ఓ విద్యార్థి హాస్టల్ గదిలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబ సమస్యలు, ఒత్తిడి కారణాల వల్ల ఆ విద్యార్థి సూసైడ్ చేసుకున్నట్లు తెలిసింది. అంతేకాదు ఐఐటీ ఢిల్లీలో కూడా విద్యార్థుల సూసైడ్ ఘటనలు చోటుచేసుకున్నాయి. ఒత్తిడి, మానసిక సమస్యల వల్లే వారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి.
కోటాలో ఆత్మహత్యలు
ఐఐటీ, నీట్ లాంటి ఎంట్రన్స్ పరీక్షల కోసం చాలామంది విద్యార్థులు రాజస్థాన్లోని కోటా పట్టణానికి వెళ్తుంటారు. గత కొన్నేళ్లుగా అక్కడ కూడా వరుసగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం కలకలం రేపింది. 2023లోనే ఏకంగా 26 మంది విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారు. అక్కడ కూడా విద్యార్థులు తీవ్రమైన ఒత్తిడి కారణంగా ఆత్మహత్యలు చేసుకున్నట్లు సూసైడ్ నోట్లు కూడా లభించాయి. అయితే విద్యార్థులు ఇలా చదువులపై ఒత్తిడి వల్ల ఆత్మహత్యలుకు పాల్పడటం ప్రధాన సమస్యగా మారింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం, విద్యా సంస్థలు కౌన్సిలింగ్ సెంటర్లు, హెల్ప్లైన్లు ఏర్పాటు చేస్తున్నప్పటికీ ఆత్మహత్యలు ఆగడకపోవడం ఆందోళన కలిగిస్తోంది. తల్లిదండ్రులు విద్యార్థులను చదువు విషయంలో ఎక్కువగా ఒత్తిడి చేయొద్దని నిపుణులు సూచిస్తున్నారు.