మహారాష్ట్రలో కీలక పరిణామం.. షిండే ఇంటికి చేరుకున్న ఫడ్నవీస్

డిసెంబర్ 5న మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం కొలువుతీరనుంది. సీఎంగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ పేరు ఖరారైపోయింది. తాజాగా ఆయన.. షిండే నివాసానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి వారు కీలక చర్చలు జరపనున్నట్లు సమాచారం.

New Update
FADNAVIS  2
డిసెంబర్ 5న మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం కొలువుతీరనుంది. తదుపరి సీఎం ఎవరు అనేదానిపై సాగిన ఉత్కంఠకు తెర పడినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రిగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ పేరు ఖరారైపోయింది. అలాగే ఏక్‌నాథ్ షిండే, అజిత్‌ పవార్‌ డిప్యూటీ సీఎంలుగా బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమచారం. ఈ నేపథ్యంలో తాజాగా ఫడ్నవీస్.. షిండే నివాసానికి చేరుకున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి వారు కీలక చర్చలు జరపనున్నట్లు పేర్కొన్నాయి. 
ఏక్‌నాథ్ షిండే ఇంటికి ఫడ్నవీస్ వెళ్లడం ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది. షిండే సీఎం పదవి తనకు రాకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారని ఆయన అనుచరులు చెబుతున్నారు. అయినప్పటికీ కూడా ఇటీవలే షిండే.. తాను సీఎం పదవిపై ప్రదాని మోదీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ప్రకటించారు. ఈ క్రమంలోనే బీజేపీ హైకమాండ్ చివరికి దేవేంద్ర ఫడ్నవీస్‌కు సీఎం బాధ్యతలు అప్పగించిందని తెలుస్తోంది. 
ఇదిలాఉండగా.. డిసెంబర్ 4న బీజేపీ శాసనసభా పక్ష నేతల సమావేశం జరగనుంది. ఈ భేటీలో ఎమ్మెల్యేలు సీఎంను ఎన్నుకోనున్నారు. మొత్తానికి బుధవారం మహారాష్ట్ర సీఎం ఎవరు అనేది తేలిపోనుంది. ఎన్డీయే నేత రామ్‌దాస్‌ అథవాలే తాజాగా ఏక్‌నాథ్ షిండేతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. డిప్యూటీ సీఎం పదవికి అంగీకరించాలని ఆయన షిండేను నచ్చజెప్పినట్లు పలు కథనాలు వెల్లడించాయి. ఈ పదవి తీసుకునేందుకు షిండే కూడా సానుకూలత వ్యక్తం చేసినట్లు సమాచారం. మరోవైపు డిప్యూటీ సీఎంపై షిండే ఆసక్తి చూపించడం లేదనే ప్రచారం కూడా నడుస్తోంది. ఇలాంటి నేపథ్యంలో షిండేతో.. ఫడ్నవీస్‌ సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.  
 ఇదిలాఉండగా.. ఇటీవల అనారోగ్యం కారణంగా షిండే తన సొంతూరు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆదివారం ఆయన మళ్లీ ముంబయికి తిరిగి వచ్చారు. ఆరోగ్యం ఇంకా మెరుగుపడకపోవడంతో మంగళవారం షిండేను ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఠాణెలోని ఓ ఆసుపత్రిలో ఆయన చెకప్ చేయించుకున్నారు.
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు