Iran -Israel: ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య వివాదం ఏంటి..ఎందుకు దాడులు చేసుకుంటున్నాయి?

ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. వాళ్ళ అణుస్థావరాలే లక్ష్యంగా క్షిపణులను ప్రయోగిస్తోంది. అసలెందుకు ఈ రెండు దేశాలు కొట్టుకుంటున్నాయి. ఒకప్పటి మిత్రులు ఇప్పుడు ఎందుకు బద్ధ శత్రువులయ్యాయి.

author-image
By Manogna alamuru
New Update
Israel-Iran : పశ్చిమాసియాలో కమ్ముకున్న యుద్ధ మేఘాలు.. ఎవరి బలం ఎంతంటే

ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇజ్రాయెల్...ఇరాన్ పై ముందస్తు దాడులను నిర్వహించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించినట్టుగానే ఇజ్రాయెల్ అటాక్స్ చేస్తోంది. అణు కేంద్రాలు, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. ఇరాన్ రాజధాని శుక్రవారం ఉదయం పేలుళ్ళు వినిపించాయని చెబుతున్నారు.  డజన్ల కొద్దీ దాడులు జరిగాయని తెలుస్తోంది. వీటి తర్వాత టెహ్రాన్ అంతర్జాతీయ విమానాశ్రయం అన్ని విమానాలను నిలిపివేసింది. దాంతో పాటూ ఇజ్రాయెల్, ఇరాన్, ఇరాక్ దేశాలు తమ వైమానిక ప్రాంతాన్ని మూసివేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇజ్రాయెల్ భీకర దాడుల్లో ఇరాన్ పారామిలటరీ రెవల్యూషనరీ గార్డ్ ఛీఫ్ సహా పలువురు కీలక వ్యక్తులు మరణించినట్లు తెలుస్తోంది. ఐఆర్జీసీ హెడ్ క్వార్టర్స్ పై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఈ దళం అధిపతి మేజర్ జనరల్ హొస్సేన్ సలామీ మృతి చెందారని చెబుతున్నారు. ఈయనతో పాటు రెవల్యూషనరీ గార్డ్‌లోని సెక్రటరీ జనరల్ అలీ అక్బర్ అహ్మదియన్, క్వాడ్స్ ఫోర్స్ హెడ్ ఎస్మాయిల్ కానీ, ఇరాన్ డిప్యూటీ ఛీప్ ఘోలమ్ అలీ రషీద్ ఇద్దరు అణు శాస్త్రవేత్తలు కూడా మరణించినట్లు తెలుస్తోంది. దీని తర్వాత ఇరాన్ ఇజ్రాయెల్ పై దాడులు చేయవచ్చని భావిస్తున్నారు. ఈ కారణంగా ఆ దేశంలో ప్రత్యేక అత్యవసర పరిస్థితిని కూడా ప్రకటించారు. 

అసలు రెండు దేశాల మధ్య యుద్ధం ఎప్పుడు మొదలైంది...

ఇరాన్, ఇజ్రాయెల్‌లు 1979 వరకు స్నేహంగానే ఉండేవి. రాచరికంలో ఉన్నంతరవకు ఈ రెండు దేశాలూ.. అమెరికా అన్నీ కలిసి మెలిసే ఉన్నాయి. కానీ 1979లో ఇరాన్‌లో పరిస్థితులు మారిపోయాయి. ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్‌గా మారిపోయింది. దాంతో ఇజ్రాయెల్, అమెరికాలు ఆ దేశానికి దూరం అయ్యాయి. సామ్రాజ్యవాదాన్నే తాము సపోర్ట్ చేస్తామంటూ ఇరాన్‌ను వ్యతిరేకించడం మొదలు పెట్టాయి. ఖొమైనీ సారథ్యంలోని కొత్త ప్రభుత్వం ఇజ్రాయెల్‌తో సంబంధాలను తెంపుకుంది. ఇజ్రాయెల్ పౌరుల పాస్‌పోర్టులను గుర్తించడం మానేసింది.టెహ్రాన్‌లోని ఇజ్రాయెలీ దౌత్య కార్యాలయాన్ని సీజ్ చేసి, దానిని ఇజ్రాయెల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రత్యేక పాలస్తీనా దేశం ఏర్పాటుకు పోరాడుతున్న పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ (పీఎ‌ల్ఓ)కు అప్పగించింది. 1990 వరకు కూడా ఇజ్రాయెల్‌కు ఇరాన్ మీద శ్రతుత్వం లేదు. కానీ కాలక్రమంలో ఇరాన్‌ను తన మనుగడకు ప్రమాదకారిగా ఇజ్రాయెల్ భావించడం మొదలుపెట్టింది.దీంతో వీరి మధ్య వైరం మాటల నుంచి చేతల దాకా వెళ్ళింది. ఇరాన్‌లో షియాలు మెజార్టీ కాగా, మిగిలిన అరబ్ దేశాలలో సున్నీలదే ఆధిపత్యం. దీంతో తాను ఏకాకిననే సత్యాన్ని ఇరాన్ ప్రభుత్వం గ్రహించింది. దీంతో ఏదో ఒకరోజు తన సొంత ప్రాంతంలోనే తన పై దాడి జరగవచ్చనే ఉద్దేశంతో ఇరాన్ హిజ్బుల్లాను పుట్టించింది.

షాడో వార్..

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరిగే యుద్ధాన్ని ‘షాడో వార్’గా అభివర్ణిస్తుంటారు. ఎందుకంటే చాలా సందర్భాల్లో పరస్పరం దాడులకు దిగినప్పటికీ ఈ రెండు దేశాల ప్రభుత్వాలు మాత్రం ఆ విషయాన్ని ఎప్పుడూ అంగీకరించలేదు. 1992లో ఇరాన్‌కు సంబంధించిన ఇస్లామిక్ జిహాదీ గ్రూపు బ్యూనస్ ఎయిర్స్‌లోని ఇజ్రాయెలీ ఎంబసీని పేల్చివేసి, 29మంది మృతికి కారణమైంది. దానికి కొన్నిరోజుల ముందే హిజ్బొల్లా నేత అబ్బాస్ అల్ ముసావి హత్యకు గురయ్యారు. ఈ హత్య ఇజ్రాయెలీ ఇంటెలిజెన్స్ సర్వీసెస్‌కు ఆపాదించారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి ఇజ్రాయెల్ ఎప్పుడూ తహతహలాడుతూ ఉండేది. ఇరాన్ వద్ద అణుశక్తి ఉండకూడదనేది ఇజ్రాయెల్ కోరిక. ప్రజా అవసరాల కోసమే తాము అణు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామనే ఇరాన్ మాటలను ఇజ్రాయెల్ నమ్మడం లేదు. ఈక్రమంలో 2000 సంవత్సరంలో ఇరాన్ అణు సంపద మీద దాడి చేసింది ఇజ్రాయెల్. న్యూక్లియర్ ప్రాజెక్ట్ లో భాగస్వాములైన కీలక సైంటిస్టులపై దాడులకు ఇజ్రాయెలీ ఇంటలిజెన్స్‌దే బాధ్యత అని టెహ్రాన్ నిరసన వ్యక్తం చేసింది. 2020లో ఇరాన్ శాస్త్రవేత్త మొహసెన్ ఫక్రిజాదెహ్ హత్యకు గురవడానిక కూడా ఇజ్రాయెలే కారణమని ఇరాన్ నమ్ముతోంది. మరోవైపు తమ ప్రాంతాల్లో రాకెట్, డ్రోన్ల దాడులకు కారణం ఇరానేనని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. దాంతో పాటూ ఇజ్రాయెల్ సరిహద్దు దేశమైన సిరియాలో 2011లో మొదలైన అంతర్యుద్ధం కూడా ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఘర్షణలకు మరో కారణంగా నిలుస్తోంది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న షాడో వార్ 2021లో సముద్రంపైకి కూడా చేరింది. ఆ ఏడాది గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో తమ నౌకలపై జరిగిన దాడికి ఇరానే కారణమని ఇజ్రాయెల్ ఆరోపించగా, ఎర్రసముద్రంలో తమ నౌకలపై దాడులకు ఇజ్రాయెలే కారణమని ఇరాన్ ఆరోపించింది. తరువాత ఇజ్రాయెల్-హమాస్‌ల మధ్య జరుగుతున్న అంతర్యుద్ధం కూడా ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధానికి దారి తీసింది. 

ఇప్పుడు అణ్వాయుధాల భయం..

ప్రస్తుతం ఇరాన్ పై ఇజ్రాయెల్ పై దాడులు చేయడానికి కారణం మాత్రం అణు కార్యక్రమం అని చెబుతున్నారు. ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేస్తోంది. వాళ్ళ దగ్గర ఆ ఆయుధాలు వస్తే ఆ దేశం మరింత బలంగా తయారవుతుంది. ఇది ఇజ్రాయెల్ అస్తిత్వానికి ముప్పుగా పరిణమిస్తుంది. ఈ కారణంగా ఆ దేశం భయపడుతోంది. ఇరాన్ ఇప్పుడు తొమ్మిది అణు ఆయుధాలకు సరిపడా యురేనియంను కలిగి ఉంది.  ఇరాన్ అణు ఆయుధాలను తయారు చేయడానికి మునుపెన్నడూ లేని విధంగా చర్యలు తీసుకుంటోందని, దీన్ని ఆపకపోతే ఇజ్రాయెల్‌కు అది తక్షణ మరియు స్పష్టమైన ప్రమాదమని నెతన్యాహు అన్నారు. అందుకే దాడులు చేస్తున్నామని కూడా చెప్పారు. అయితే ఈ రెండు దేశాల మధ్యనా సంధి కుదిరేలా అమెరికా ప్రయత్నించింది.  అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ తో అణు ఒప్పందానికి చాలా ప్రయత్నించారు. ఆ దేశాన్ని భయపెట్టారు, బుజ్జగించారు అన్నీ చేశారు. కానీ ఇరాన్ మాత్రం అణు ఒప్పందానికి ఒప్పుకోలేదు. ఒకవేళ అదే కనుక జరిగి ఉంటే ఇజ్రాయెల్ దాడులను చేసి ఉండేది కాదనే వాదన కూడా ఉంది. ఇజ్రాయెల్ కు అమెరికా అన్ని రకాలుగా సహాయం చేస్తోంది కాబట్టి దాని మాటను వినే అవకాశం ఉంది. కానీ అణు ఒప్పందం ఎప్పుడు కుదరలేదో ఇజ్రాయెల్...అమెరికా మాటను పక్కన పెట్టేసింది. వద్దని చెబుతున్నా దాడులను చేస్తోంది.  

 

Also Read: Air India crashవిమాన ప్రమాదానికి 3 కారణాలివే.. అంతా బ్లాక్ బాక్స్‌లోనే.. ఎక్స్పర్ట్ సంచలనం!

Advertisment
Advertisment
తాజా కథనాలు