అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రస్తుతం పశ్చిమాసియా దేశాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఖతార్లోని దోహలో జరిగిన ఓ సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్లో ఆపిల్ ఐఫోన్ల ఉత్పత్తిని విస్తరించేందుకు ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయడం తనకు నచ్చలేదన్నారు. ఈ విషయాన్ని యాపిల్ సీఈవో టిమ్కుక్తో చెప్పినట్లు పేర్కొన్నారు. ఇండియా తమ అవసరాలు, ప్రజల గురించి చూసుకోగలదని అన్నారు.
ఇక రాబోయే రోజుల్లో యాపిల్ తన ఉత్పత్తిని అమెరికా కేంద్రంగా విస్తరించనున్నట్లు కూడా ఇటీవల ట్రంప్ చెప్పిన విషయం తెలిసిందే. ట్రంప్ మొదటినుంచి కంపెనీలకు అమెరికాలోనే ఉత్పత్తి చేయాలని చెబుతూవస్తున్నారు. వాస్తవానికి చైనాతో పోల్చి చూస్తే భారత్లో ఉత్పత్తి ఖర్చు 5 నుంచి 10 శాతం ఎక్కువగా ఉంది. అయినాకూడా యాపిల్ చైనాపై అమెరికా విధించిన సుంకాలు పరిగణలోకి తీసుకొని ఉత్పత్తిని ఇండియాలో విస్తరించేందుకు మొగ్గు చూపుతోంది.
Also Read: ట్రంప్ ఫ్యామిలీతో పాకిస్థాన్ వ్యాపారం.. అసలేం జరుగుతోంది?
2026 చివరి నాటికి మెజారిటీ యాపిల్ ఉత్పత్తులను భారత్ కేంద్రంగా చేపట్టాలని గత నెలలో రాయిటర్స్ నివేదించిన విషయం తెలిసిందే. అయితే ఏటా అమెరికాలో దాదాపు యాపిల్ ఐఫోన్స సేల్స్ 6 కోట్ల యూనిట్లుగా ఉంది. ఇందులో 80 శాతం చైనాలో జరుగుతోంది. ఇప్పుడు దీన్ని అమెరికాకు తరలించాలని ట్రంప్ భావిస్తున్నారు. ఇప్పటికే యాపిల్ సంస్థ ఇండియా ప్లాంట్లలో ఉత్పత్తిని టారిఫ్స్ కారణంగా పెంచిన విషయం తెలిసిందే. ఈ ఏడాది మార్చిలో ఏకంగా రూ.17 వేల కోట్ల విలువైన 600 టన్నుల బరువైన ఐఫోన్లు ఇండియా నుంచే షిప్పింగ్ చేశారు.
Also Read: సుప్రీంకోర్టుకు రాష్ట్రపతి ముర్ము 14 ప్రశ్నలు.. సంచలన లేఖ!
ప్రస్తుతం భారత్లో ఫాక్స్కాన్, టాటా సంస్థలు యాపిల్ ఉత్పత్తులను తయారుచేస్తున్నాయి. 2024లో యాపిల్ తన మొత్తం అమ్మకాల్లో 18 నుంచి 20 శాతం (4 నుంచి 4.5 కోట్లు) ఐఫోన్లను భారత్లోనే తయారు చేశారు. అయితే ప్రస్తుతం అమెరికా సుంకాలు ఉన్న నేపథ్యంలో ఐఫోన్లతో పాటు ఇతర యాపిల్ ప్రొడక్ట్స్ను భారత్తో పాటు వియత్నాం నుంచి తెప్పిస్తోందని కొన్నిరోజుల క్రితమే టిమ్కుక్ ఇన్వెస్టర్లకు చెప్పారు. అమెరికా బయట ఇతర దేశాల్లో అమ్మే యాపిల్ ఉత్పత్తులు మాత్రం చైనా నుంచి షిప్పింగ్ అవుతాయని తెలిపారు. ప్రస్తుతం అమెరికాలో అమ్ముడుపోతున్న ఐఫోన్లు, మ్యాక్స్, ఆపిల్ వాచ్ లు, ఐపాడ్స్ అనేవి ఇండియా, వియత్నాం నుంచే వస్తున్నట్లు స్పష్టం చేశారు.
apple | rtv-news