/rtv/media/media_files/2026/01/06/fotojet-92-2026-01-06-20-45-56.jpg)
APSRTC
APSRTC : సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే వారికోసం ఏపీఎస్ఆర్టీసీ గుడ్న్యూస్ చెప్పింది. ప్రయాణీకులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది. పండుగ రద్దీ దృష్ట్యా రోజూ నడిచే రెగ్యులర్ సర్వీసులకు అదనంగా 8,432 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు సంస్థ ప్రకటించింది. ఈసారి స్త్రీశక్తి పథకం దృష్ట్యా రాష్ట్రంలో పలు ప్రాంతాల మధ్య ప్రత్యేక బస్సుల ఏర్పాటులో ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆర్టీసీ వివరించింది. 71 శాతం బస్సులను రాష్ట్రంలోని పలు ప్రాంతాల మధ్య ప్రత్యేక సర్వీసులుగా నడపాలని నిర్ణయించినట్లు వెల్లడించింది. గ్రామాలు, మండలాలు, పట్టణాల మధ్య రద్దీ గణనీయంగా పెరిగిన దృష్ట్యా.. వీటి మధ్య 6 వేల ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపింది.
ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల్లోని హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తదితర ప్రాంతాలకు 2,432 ప్రత్యేక బస్సు సర్వీసులు నడిపేందుకు కేటాయించినట్లు ఆర్టీసీ తెలిపింది. పండుగ ముందు రోజుల్లో మొత్తం 3,857 ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు వెల్లడించింది. వీటిలో హైదరాబాద్కు 240, బెంగళూరుకు 102, చెన్నైకి 15 బస్సులు ఏర్పాటు చేయగా... రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు 3500 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. పండుగ తిరుగు ప్రయాణానికి మొత్తం 4,575 బస్సులు ఏర్పాటు చేసినట్లు వివరించింది. వాటిలో హైదరాబాద్కు 1800, బెంగళూరు 200, చెన్నై 75 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయగా.. వీటిలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల మధ్య నడిపేందుకు 2500 బస్సులు ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది.. ప్రత్యేక బస్సుల్లోనూ సాధారణ ఛార్జీలే వసూలు చేయనున్నట్లు ఏపీఎస్ ఆర్టీసీ ప్రకటించింది. దూర ప్రాంతాలకు నడిచే ప్రత్యేక బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ సదుపాయం కల్పించినట్లు ఆర్టీసీ యాజమాన్యం వివరించింది.
Follow Us