/rtv/media/media_files/2025/09/15/ap-mega-dsc-2025-2025-09-15-19-07-42.jpg)
నేడు మెగా డీఎస్సీ(mega dsc) మెరిట్ లిస్ట్ ను ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర పాఠశాల విద్య శాఖ కార్యదర్శి కోన శశిధర్ కీలక ప్రకటన చేశారు. ఈ లిస్ట్కు వెయిటింగ్ లిస్ట్ కానీ సెకండ్ లిస్ట్ కానీ ఉండదని స్పష్టం చేశారు. ఎంతో పారదర్శకంగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియను కేవలం 150 రోజుల్లో పూర్తిచేశామన్నారు. రాష్ట్ర చరిత్రలోనే ఇది అతిపెద్ద, అత్యంత పారదర్శక ఉపాధ్యాయ నియామక ప్రక్రియ అని తెలిపారు. వందకు పైన కేసులు పెట్టినా ఏ ఆటంకం లేకుండా, విమర్శలకు తావు లేకుండా DSCని నిర్వహించామన్నారు. డ్రాఫ్ట్ కీ పై లక్ష 40 వేల అభ్యంతరాలు వచ్చినా అన్నింటికీ సమర్ధంగా జవాబు ఇచ్చామన్నారు. గవర్నమెంట్ ఆర్డర్ నంబర్ 77, తేదీ ఆగస్టు 2, 2023 కింద వర్టికల్, మొట్ట మొదటిసారిగా హారిజాంటల్ రిజర్వేషన్లను అమలు చేశామని చెప్పారు.
మొదటిసారిగా SC సబ్ క్లాసిఫికేషన్ను రాష్ట్రంలో గవర్నమెంట్ ఆర్డర్ నంబర్ 46, తేదీ ఏప్రిల్ 19, 2025 కింద ప్రవేశపెట్టామని వివరించారు. అదనంగా గవర్నమెంట్ ఆర్డర్ నంబర్ 47 ప్రకారం మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్కు 3% రిజర్వేషన్ అమలు చేశామని తెలిపారు. ఈ నియామకాలు ప్రభుత్వ, పంచాయతీరాజ్, మునిసిపల్ పాఠశాలలు, అలాగే ట్రైబల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ కింద ఉన్న పాఠశాలలకు విస్తరించామని చెప్పారు. 87% అభ్యర్థులకు వారి మొదటి ప్రాధాన్యత పరీక్షా కేంద్రాన్ని కేటాయించామన్నారు.
Also Read : టెన్త్, ఇంటర్ అర్హతతో రైల్వేలో ఉద్యోగాలకు నోటిఫికేషన్.. జీతం ఎంతంటే?
ఆ ఖాళీలు తదుపరి నోటిఫికేషన్లో..
కంప్యూటర్ ఆధారిత పరీక్షలు జూన్ 6 నుండి జులై 2, 2025 వరకు రెండు షిఫ్టుల్లో పటిష్టమైన భద్రతా చర్యలతో నిర్వహించామన్నారు. ప్రాథమిక సమాధానాల కీ జులై 5న విడుదల చేసి, జులై 12 వరకు అభ్యంతరాలు స్వీకరించి, నిపుణుల సమీక్ష తర్వాత ఆగస్టు 1న ఫైనల్ కీ విడుదల చేశామన్నారు. సూక్ష్మ వెరిఫికేషన్ ప్రక్రియ తర్వాత 15,941 అభ్యర్థులతో ఫైనల్ సెలెక్షన్ లిస్టులను తయారు చేశామన్నారు. మిగిలిన 406 ఖాళీలు సంబంధిత కమ్యూనిటీలో అర్హత పొందిన అభ్యర్థుల అందుబాటులేకపోవడంతో భర్తీ కాలేదన్నారు. ఈ ఖాళీలను తదుపరి DSC నోటిఫికేషన్లో భర్తీ చేస్తామని వివరించారు.
ఈ సెలెక్షన్ లిస్టులు జిల్లా విద్యా కార్యాలయాలు, జిల్లా కలెక్టరేట్లు, అధికారిక మెగా DSC వెబ్సైట్ (www.apdsc.apcfss.in)లో అందుబాటులో ఉన్నాయన్నారు. సెలెక్ట్ అయిన 15,941 మందిలో 7,955 మహిళలు మరియు 7,986 పురుషులు ఉన్నారని, అంటే 49.9% మహిళలు, 50.1% పురుషులు అని వివరించారు. మహిళలు దాదాపు 50% సాధించడం హర్షనీయమన్నారు. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ లిస్ట్కు వెయిటింగ్ లిస్ట్ కానీ సెకండ్ లిస్ట్ కానీ ఉండదని స్పష్టం చేశారు.
మెగా DSC 2025(Mega DSC 2025) పారదర్శకత, సమైక్యత, న్యాయబద్ధతలో కొత్త ప్రమాణాలను నిర్దేశించిందన్నారు. పదహారు వేలకు మించిన కొత్త ఉపాధ్యాయులు వర్క్ఫోర్స్లో చేరడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంలో మన పిల్లల భవిష్యత్తును రూపొందించడంలో చారిత్రాత్మక అడుగు వేస్తోందని అన్నారు. అభ్యర్థుల సౌకర్యార్థం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామన్నారు. అభ్యర్థులు 8125046997, 9398810958, 7995649286, 7995789286 ఫోన్ నంబర్లను సంప్రదించి సహాయం పొందొచ్చన్నారు.
Also Read : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. నెలకు రూ.78 వేల జీతంతో ఆర్బీఐలో అదిరిపోయే ఉద్యోగాలు