/rtv/media/media_files/2025/12/31/fotojet-56-2025-12-31-09-52-13.jpg)
2025 Andhra Pradesh..Tragedies...Successes
Andhra Pradesh Recap 2025 : మరికొన్ని గంటల్లో 2025 సంవత్సరం పూర్తి కాబోతుంది. ఈ ఏడాదిలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నో విషాదాలు చోటు చేసుకున్నాయి. అదే సమయంలో విజయాలు(success) లేకపోలేదు. ప్రకృతి వైఫల్యాల నుంచి మానవ తప్పిదాల(big-tragedy) వరకు ఇలా ఎన్నోప్రమాదాలతో ఈ ఏడాది తీవ్ర విషాదాలను మిగిల్చింది. అలాగే పెట్టుబడుల రూపంలో 2025 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్కు భారీగా కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయి. ఈ క్రమంలో 2025 లో జరిగిన కొన్ని సంఘటనల సమహారం మీ కోసం... Rewind 2025
తిరుమలలో తొక్కిసలాట
2025లో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా మూడు ప్రధాన ఆలయాల్లో దుర్ఘటనలు జరిగాయి. ఈ ఏడాది తొలి నెల జనవరిలోనే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల కోసం జరిగిన తొక్కిసలాట సందర్భంగా సుమారు ఆరుగురు భక్తులు మరణించగా మరో 40 మందిదాకా గాయపడ్డారు. ఈ ఘటన యావత్ రాష్ట్రాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. (tirupati)
సింహాచలంలో కుప్పకూలిన గోడ
విశాఖపట్నం జిల్లా సింహాచలం ఆలయంలో చందనోత్సవం రోజున దేవస్థానంలో గోడ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు గాయపడ్డారు.ఈదురుగాలులతో కురిసిన భారీ వర్షానికి అక్కడ కొత్తగా నిర్మించిన గోడ క్యూలైన్లో ఉన్న భక్తులపై కూలిపోయింది.ఈ ప్రమాదం నుంచి నలుగురు మాత్రమే బయటపడగలిగారు. చనిపోయినవారిలో ఎనిమిది మంది చిన్న పిల్లలే.
అలాగే నవంబర్ 1వ తేదీన శ్రీకాకుళం జిల్లా కాసిబుగ్గాలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగిన.. మెట్ల రైలింగ్ కూలడం ద్వారా సుమారు 9 మంది భక్తులు మరణించారు. 20 మందికిపైగా గాయపడ్డారు. ఈ ప్రమాదాలు ఆలయాల్లో భక్తుల భద్రతపై తీవ్ర చర్చకు దారితీశాయి.
కర్నూలులో ప్రైవేట్ బస్సు దగ్ధం
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు కర్నూలు(kurnool) జిల్లాలోని కల్లూరు మండలం చిన్నటేకూరు సమీపంలో ప్రమాదానికి గురై మంటలు అంటుకుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ట్రావెల్స్ మోటార్సైకిల్ను ఢీకొట్టడంతో అగ్నిప్రమాదం జరిగి 20 మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు.ఈ ప్రమాదం ట్రావెల్స్ బస్సులో ప్రయాణికుల భద్రతపై తీవ్ర చర్చకు దారి తీసింది.
బస్సు లోయలో పడి
డిసెంబర్ 12న ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో భద్రాచలం నుంచి అన్నవరం వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు లోయలో పడింది. చింతూరు నుంచి మారేడుమిల్లి వెళ్లే ఘాట్ రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. ఘాట్ రోడ్డులో తులసిపాకల గ్రామానికి సమీపంలో అదుపు తప్పిన బస్సు లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 9 మంది ప్రయాణికులు మృతి చెందారు. ప్రమాద సమయంలో బస్సులో 38 మంది ఉన్నారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ఘోర ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. బస్సులో చిత్తూరు జిల్లాకు చెందిన యాత్రికులు ఉన్నారు. ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు.
Also Read : Sankranthi Fest: సంక్రాంతికి ఊరెళ్లేవారికి గుడ్న్యూస్
ప్రకృతి వైఫరీత్యాలు
ఈ మానవ తప్పిదాలే కాకుండా ప్రకృతి విపత్తుల కారణంగా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రమాదాలు సంభవించాయి. గత అక్టోబర్ నెలలో 'మోంథా' తుఫాన్ ప్రభావంతో తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసి లక్షల మంది ప్రభావితులు అయ్యారు. అయితే ఈ విపత్త కారణంగా కొందరు మరణించినప్పటికీ.. మరణాల సంఖ్య అధికారికంగా వెలువడలేదు. మొత్తంగా 2025లో ఏపీ వ్యాప్తంగా జరిగిన రోడ్డు ప్రమాదాలు, ఆలయ తొక్కిసలాటల వల్ల 100 మందికిపైగా మరణించారు.
మావోయిస్టు అగ్రనేత నంబాల ఎన్కౌంటర్
నక్సల్ ఉద్యమంలో సీనియర్ నేత, సీపీఐ మావోయిస్టు ప్రధాన కార్యదర్శి నంబాల కేశవ్ రావు అలియాస్ బసవరాజు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్లో జరిగిన ఆపరేషన్లో భద్రతా బలగాల చేతుల్లో మృతి చెందారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు.తెలుగు రాష్ట్రాల్లో నక్సల్ ఉద్యమ మూలాలున్న శ్రీకాకుళం జిల్లాలోని కోటబొమ్మాళి మండలం జియ్యన్నపేట ఆయన స్వస్థలం.
అమరావతి పునర్నిర్మాణ పనులు...
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు.కృష్ణానది తీర ప్రాంతంలో విజయవాడ-గుంటూరు నగరాలకు మధ్య రాజధాని నిర్మించాలని ఏపీ అసెంబ్లీలో 2014 సెప్టెంబర్ 3న బిల్లు ఆమోదించారు.
విశాఖలో యోగా దినోత్సవం
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖ సాగర తీరంలో సుమారు 3 లక్షల మంది యోగాసనాలు వేశారు.'యోగా ఫర్ వన్ ఎర్త్, వన్ హెల్ప్' అనే థీమ్తో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు.
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
ఆంధ్రప్రదేశ్లోని ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం ప్రారంభమైంది. 'స్త్రీ శక్తి' పేరుతో ఈ పథకాన్ని ప్రభుత్వం అమలుచేస్తోంది.నాన్ స్టాప్, అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, గరుడ, ఇంద్ర ఏసీ బస్సులు, తిరుమల ఘాట్ రోడ్డులో వెళ్లే బస్సులకు ఈ పథకం వర్తించదని అధికారులు తెలిపారు.
విశాఖలో గూగుల్ డేటా సెంటర్
ఐటీ దిగ్గజ సంస్థ గూగుల్ సుమారు 15 బిలియన్ డాలర్ల (సుమారు రూ.1.35 లక్షల కోట్ల) పెట్టుబడితో ఏఐ డేటా సెంటర్ను ఏర్పాటు చేయనుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది.2026లో నిర్మాణ పనులు ప్రారంభించి, 2030 నాటికి డేటా సెంటర్ను సిద్ధం చేయాలని గూగుల్ భావిస్తోంది.దీని నిర్మాణానికి విశాఖ శివారులోని తర్లువాడలో 308 ఎకరాలు, అడవివరంలో 120 ఎకరాలు, అనకాపల్లి జిల్లాలోని రాంబిల్లిలో 160 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది.
Also Read : రైలు ప్రమాదంతో నిలిచిన పలు రైళ్లు... అనేక రైళ్లు ఆలస్యం.. హెల్ప్లైన్ ఏర్పాటు
పాఠాలు నేర్పిన 2025
2025 ఏడాది ఏపీకి అనేక చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. ఈ ప్రమాదాలు, ప్రకృతి విపత్తుల నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉన్నాయి. భద్రత ముఖ్యం: రహదారి నిబంధనలు పాటించడం, జాతరల్లో క్రమశిక్షణతో ఉండటం ప్రాణాధారం. ముందస్తు చర్యలు: ప్రభుత్వ యంత్రాంగం విపత్తు నిర్వహణలో (Disaster Management) మరిన్ని మెళకువలు పాటించాల్సిన అవసరం ఉందని ఈ ఏడాది సంఘటనలు నిరూపించాయి. మరో కొత్త ఏడాదిలోకి అడుగుపెడుతున్న వేళ, ఇలాంటి విషాదాలు మళ్ళీ జరగకూడదని, అంతా సురక్షితంగా ఉండాలని కోరుకుందాం!
Follow Us