revanth reddy:మోదీ, కేసీఆర్ ది ఫెవికాల్ బంధం- రేవంత్ రెడ్డి

మోదీ, కేసీఆర్ ది ఫెవికాల్ బంధం అని ఆరోపించారు టీ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. బీజేపీ, బీఆరెస్ ఒక్కటే... అవిభక్త కవలలన్నారు. బీఆరెస్, బీజేపీ బంధాన్ని నిన్న నిజామాబాద్ సాక్షిగా మోదీ బయటపెట్టారని చెప్పారు. ఈరోజు జరిగిన ప్రెస్ మీట్ లో రెండు పార్టీలను దుయ్యబట్టారు.

New Update
revanth reddy:మోదీ, కేసీఆర్ ది ఫెవికాల్ బంధం- రేవంత్ రెడ్డి

ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి కేసీఆర్ ను గెలిపించేందుకే మోదీ పర్యటనలు అంటూ ఆరోపించారు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. బీఆరెస్ అంటే బీజేపీ రిస్తేదార్ సమితి అని మా నాయకుడు రాహుల్ గాంధీ ఎప్పుడో చెప్పారని అన్నారు. వారిది గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బయటకు కనిపించేది అంతా నాణానికి ఒకవైపు మాత్రమే..తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అంటూ రేవంత్ రెడ్డి హితబోధ చేశారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ తో బీఆరెస్ పొత్తు ఉంటుందని ఆ పార్టీ ఎంపీలే నాకు చెప్పారు. 9 బీఆరెస్, 7 బీజేపీ కి, 1 ఎంఐఎం కు అని పంపకాలు చేసుకున్నారు. బండారం బయటపడిందనే కాంగ్రెస్ మీద బీజేపీ, బీఆరెస్ ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. వాళ్లిద్దరూ కాంగ్రెస్ ను ఉమ్మడి శత్రువుగా భావిస్తున్నారు.మోదీ చెప్పింది నిజమో కాదో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేస్తున్నా అన్నారు రేవంత్.

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని సర్వేలు చెబుతున్నాయనన్నారు రేవంత్ రెడ్డి. పదేళ్ళలో విభజన హామీల్లో ఏ ఒక్క హామీని ప్రధాని మోదీ నెరవేర్చే ప్రయత్నం చేయలేదు. పైగా తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను అపహాస్యం చేశారు. కానీ రెండు పార్టీల మధ్య పొత్తు ఉండడం వల్లనే కేసీఆర్ మోదీని ఏమీ అనడం లేదు. ఢిల్లీ లిక్కర్ స్కాం లో కవితను అరెస్టు చేయొద్దని కేసీఆర్ అడిగిన విషయాన్ని కూడా మోదీ నిన్న సభలో చెప్పాల్సిందని ఎద్దేవా చేశారు. బీఆరెస్ అదేశాలతోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చారు. కేసీఆర్ అవినీతిపై ఎందుకు ఈడీ, సీబీఐ , ఐటీ విచారణ చేయడం లేదు. కేసీఆర్ కు నీళ్లు అంటే.. కవిత కన్నీళ్లు గుర్తొస్తాయి. నిధులు అంటే దోపిడీ సొమ్ము, నియామకాలు అంటే కొడుకును సీఎం చేయడం గుర్తొస్తాయి. కేసీఆర్ కొల్లగొట్టిన సొమ్ములతోనే మోదీని ఆయన దర్బారులో సన్మానం చేశారు. మరి ఎన్నికల కోసం పంపిన కనిపించని వేల కోట్ల సంగతి ఏంటి? బీఆరెస్ దోపిడీపై తక్షణమే చర్యలు తీసుకోవాలి అంటూ రేవంత్ డిమాండ్ చేశారు. బీఆరెస్ దోపిడీలో బీజేపీ కి వాటాలు వెళుతున్నాయి. అందుకే కేసీఆర్ పై మోదీ చర్యలు తీసుకోవడం లేదు.ఈ నిజాన్ని నిన్న నిజామాబాద్ సాక్షిగా మోదీ ఒప్పుకున్నారన్నారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ అధిష్టానం నరేంద్రమోదీ అని స్పష్టత వచ్చిందని ఆరోపించారు. కుమ్మక్కయిన రెండు పార్టీల విషయంలో తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని రేవంత్ సూచించారు.

అలాగే ఎంఐఎం పార్టీ బీఆరెస్ కు మద్దతు ఇవ్వడం మీద కూడా పునరాలోచించుకోవాలని సలహా ఇచ్చారు టీపీసీసీ అధ్యక్షుడు. బీఆర్ఎస్ పార్టీకి అసద్ ఎలా మద్దతు ఇస్తారని ప్రశ్నించారు. ఎంఐఎం ఎవరివైపు నిలబడుతుందో మరొక్కసారి ఆలోచించుకోవాలని అన్నారు. బీజేపీతో దోస్తీ కడుతున్న బీఆరెస్ తోనా?బీజేపీ, బీఆరెస్ ను ఓడించాలంటున్న కాంగ్రెస్ తోనా? అంటూ ఎంఐఎంను ప్రశ్నించారు.

Advertisment
తాజా కథనాలు