/rtv/media/media_files/2026/01/07/high-court-2026-01-07-10-23-37.jpg)
High Court
తెలంగాణ హైకోర్టులో ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. భార్య వంట చేసే విషయానికి సంబంధించి న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. భార్యభర్తలిద్దరూ ఉద్యోగం చేస్తున్నప్పుడు భార్య వంట చేయకపోవడం, తల్లికి సహకరించడం లేదనే కారణంతో విడాకులు ఇవ్వడం కుదరదని స్పష్టం చేసింది. హైదరాబాద్లోని ఎల్బీనగర్కు చెందిన ఓ వ్యక్తి భార్య వల్ల హింసకు గురవుతున్నాని కింది కోర్టును ఆశ్రయించాడు. తామిద్దరం ఉద్యోగాలు చేస్తున్నామని.. భార్య వంట చేయడం లేదని, తల్లికి సహకరించడం లేదని పేర్కొన్నాడు. తమ వివాహాన్ని రద్దు చేసి విడాకులు మంజూరు చేయాలంటూ విజ్ఞప్తి చేశాడు.
Also Read: భారత్లో తొలిసారిగా పట్టాలెక్కనున్న హైడ్రోజన్ రైలు
కింది కోర్టు ఈ కేసును కొట్టివేయడంతో అతడు హైకోర్టును ఆశ్రయించాడు. తాజాగా దీనిపై జస్టిస్ మౌసమీ భట్టాచార్య, జస్టిస్ నగేశ్ భీమపాకలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. భర్త మధ్యాహ్నం 1 నుంచి రాత్రి 10 వరకు డ్యూటీలో ఉండగా.. భార్య ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు విధుల్లో ఉంటున్నారని తెలిపింది. ఇలాంటప్పుడు భార్య వంట చేయలేదనే కారణాన్ని క్రూరత్వంగా పరిగణించలేమని పేర్కొంది. పెళ్లి తర్వాత ఆమెకు అబార్షన్ కావడంతో తల్లిదండ్రుల వద్ద ఉండటం క్రూరత్వం కాదని చెప్పింది.
Also Read: గ్రీన్లాండ్ను దక్కించుకోవడమే టార్గెట్.. అవసరమైతే మిలటరీని దింపుతాం: ట్రంప్
అయితే వేరు కాపురం పెడితే క్రూరత్వం కిందకి వస్తుందని సుప్రీంకోర్టు చెప్పిందని.. కానీ ఇది కూడా పలు కేసుల్లో వాస్తవాల ఆధారంగానే వర్తిస్తుందని వెల్లడించింది. ఈ కేసులో చూసుకుంటే భార్య వేరే కాపురం ప్రతిపాదన చేయలేదని, ఆమె తరఫు న్యాయవాది మాత్రమే సలహా ఇచ్చారని తెలిపింది. అందువల్ల దీన్ని క్రూరత్వంగా పరిగణించలేమని చెప్పింది. విడాకులు మంజూరు చేయలేమంటూ పిటిషన్ను కొట్టివేసింది.
Follow Us