Medaram Jathara : గుడి, విగ్రహాలు లేని అతిపెద్ద గిరిజన జాతర..సమ్మక్క సారలమ్మ ప్రాశస్త్యం

తెలంగాణరాష్ట్రం ములుగుజిల్లాలో జరిగే అతిపెద్ద ఆదివాసిల జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర.ఈ జాతర ప్రతి రెండేండ్ల కొకసారి జరుగుతుంది. ఈ ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు జరుగుతుంది. తెలంగాణ నుండే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కోటిన్నరకు పైగా భక్తులు తరలివస్తారు.

New Update
FotoJet - 2026-01-17T195758.695

Medaram Jathara

Medaram Jathara : తెలంగాణ రాష్ట్రంలో ములుగు జిల్లాలో జరిగే అతిపెద్ద, విశిష్ట ఆదివాసిల జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. ఈ జాతర ప్రతి రెండు సంవత్సరాల  కొకసారి జరుగుతుంది. ఈ సంవత్సరం జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల నుంచి సుమారు కోటిన్నరకు పైగా భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించు కుంటారు. ఇది ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతరగా పేరొందింది. 

అందుబాటులో ఉన్న సమాచారం అనుసరించి, ఈ జాతర యొక్క ప్రాశస్త్య మేమనగా 12వ శతాబ్దంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల ప్రాంతంలోని పొలవాసను పాలించే ఆదివాసి దొర మేడరాజు ఏకైక కుమార్తె సమ్మక్కను ఆయన మేనల్లుడైన మేడారం పాలకుడు పగిడిద్దరాజు కిచ్చి వివాహం చేశారు. ఈ దంపతులకు సారలమ్మ, జంపన్న ఇద్దరు సంతానం. కాకతీయులకు ప్రతీ సంవత్సరం చెల్లించే కప్పం కట్టలేదన్న కారణంతో కాకతీయ ప్రభువు మొదటి ప్రతాపరుద్రుడు పొలవాసపై దండెత్తుతాడు.  ఆయన దాడికి తట్టుకోలేక మేడరాజు మేడారం పోయి అజ్ఞాత వాసం గడుపుతుంటాడు. మేడారాన్ని పాలించే పగిడిద్దరాజు కూడా  కాకతీయుల సామంతునిగా ఉంటూ కరువు కాటకాల కారణంగా కప్పం కట్టలేక పోతాడు. కప్పం కట్టకపోవడం, మేడరాజుకు ఆశ్రయం కల్పించడం, కోయ ఆదివాసీల సార్వభౌమునికి వ్యతిరేకంగా తిరుగుబాటు భావాజాలాన్ని నూరిపోసి రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్నాడనే కారణాలతో పగిడిద్దరాజుపై ఆగ్రహం చెందిన ప్రతాపరుద్రుడు అతడిని అణచివేయడానికి తన ప్రధానమంత్రి యుగంధరుడితో మాఘ శుద్ధ పౌర్ణమి రోజున మేడారంపై దండెత్తుతాడు.

 సాంప్రదాయ ఆయుధాలు ధరించి పోరాడిన పగిడిద్దరాజు, నమ్మక్క, సారక్క, జంపన్న, గోవిందరాజులు విరోచితంగా పోరాటం చేసినప్పటికీ  సుశిక్షుతులైన అపార కాకతీయ సేనల ధాటికి తట్టుకోలేక పగిడిద్దరాజు, సారలమ్మ,  నాగులమ్మ, గోవిందరాజులు యుద్ధంలో మరణిస్తారు. పరాజయ వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక సంపెంగ వాగులో దూకి ఆత్యహత్యకు పాల్పడతాడు. అప్పటి నుంచి సంపెంగవాగు జంపన్న వాగుగా ప్రసిద్ధి చెందింది.
        
ఇక సమ్మక్క యుద్ధ భూమిలో కాకలు తీరిన కాకతీయుల సైన్యాన్ని ముప్ప తిప్పలు పెడుతుంది. ఆదివాసి మహిళ యుద్ధ నైపుణ్యానికి ప్రతాపరుద్రుడు ఆశ్చర్యచకితుడు అవుతాడు. చివరికి సమ్మక్కను కాకతీయుల సైన్యం వెనుక వైపు నుండి బరిసెతో పొడుస్తారు. శత్రువుల చేతిలో దెబ్బతిన్న సమ్మక్క రక్తపు ధారలతోనే యుద్ధ భూమి నుంచి నిష్క్రమించి చిలుకల గుట్టవైపు వెళుతూ మార్గమధ్యములోనే అదృశ్యమవుతుంది. సమ్మక్కను వెతుక్కుంటూ వెళ్ళిన అనుచరులకు ఆమె జాడ కనిపించలేదు. కానీ ఆ ప్రాంతంలో ఒక పుట్ట దగ్గర పసుపు, కుంకుమలు గల కుంకుమ భరణ లభిస్తుంది. దాన్ని సమ్మక్కగా భావించి అప్పటి నుంచి ప్రతి రెండేళ్లకు ఒకసారి మాఘ శుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క - సారలమ్మ జాతరను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు.

ఈసారి 2026 లో జనవరి 28 నుండి 31 వ తేదీ వరకు మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర జరుగుతుంది. జాతర మొదటి రోజైన  28-01-2026 నాడు కన్నేపల్లి నుంచి సారలమ్మను గద్దెకు తీసుకు వస్తారు.  అదే రోజు కొండాయి నుండి గోవిందరాజులును,  పూనుగుండ్ల నుండి  పడిగిద్దరాజులను గద్దెలపై ప్రతిష్టింప చేస్తారు. రెండవ రోజున 29-01-2026 సమ్మక్కను చిలుకల గుట్ట నుండి పూజార్లు తీసుకోని వచ్చి గద్దెపై ప్రతిష్టింప చేస్తారు. మూడో రోజున శుక్రవారం పూర్తి మొక్కుల చెల్లింపు, నాలుగవ రోజు సాయంత్రం దేవ దేవతలను తిరిగి వన ప్రవేశం చేస్తారు. వంశపారంపర్యంగా వస్తున్న ఆదివాసులే పూజార్లు కావడం ఈ జాతర పూర్తిగా ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం నిర్వహించడం ప్రత్యేకత. తమ కోర్కెలు తీర్చమని భక్తులు అమ్మవార్లకు బంగారం (బెల్లము) నైవేధ్యంగా సమర్పించుకుంటారు.

Advertisment
తాజా కథనాలు