/rtv/media/media_files/2025/09/08/writer-nellutla-ramadevi-2025-09-08-07-12-29.jpg)
Writer Nellutla Ramadevi
Kaloji Literary Award 2025 : ప్రముఖ కవయిత్రి, రచయిత్రి, కాలమిస్టు నెల్లుట్ల రమాదేవి ఈ ఏడాదికి గాను రాష్ర్ట ప్రభుత్వం అందజేసే ప్రతిష్ఠాత్మక కాళోజీ పురస్కరానికి ఎంపికయ్యారు. మంగళవారం (9వ తేదీన) కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ రవీంద్రభారతీలో అవార్డును ప్రదానం చేయనున్నారు. ప్రజాకవి, పద్మ విభూషణ్ కాళోజీ నారాయణరావు పేరిట తెలంగాణ ప్రభుత్వం భాషా, సాంసృతిక శాఖ ద్వారా ఏటా ప్రతిష్ఠాత్మకంగా సాహితీ పురస్కారాన్ని ప్రదానం చేస్తున్న విషయం తెలిసిందే.
2025వ సంవత్సరానికి కాళోజీ పురస్కారం ఎంపిక కోసం ప్రభుత్వం అందెశ్రీ అధ్యక్షతన జ్యూరీ కమిటీని ఏర్పాటుచేసింది. ఆ కమిటీ ప్రముఖ కవయిత్రి, రచయిత్రి, కాలమిస్ట్ నెల్లుట్ల రమాదేవిని కాళోజీ సాహితీ పురసారానికి ఎంపిక చేసినట్టు ఆదివారం ప్రకటించింది. తెలంగాణ భాషా దినోత్సవం లో భాగంగా మంగళవారం రవీంద్రభారతిలో నిర్వహించనున్న కాళోజీ జయంతి వేడుకల్లో అవార్డును ప్రదానం చేయనున్నారు. రమాదేవిని సత్కరించడంతోపాటు అవార్డు కింద రూ.1,01,116 నగదు అందజేయనున్నారు. అవార్డుకు ఎంపికైన రమాదేవికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అభినందనలు తెలిపారు.
నెల్లుట్ల రమాదేవి స్వస్థలం జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలం శివునిపల్లి గ్రామానికి చెందిన నెల్లుట్ల రమాదేవితల్లిదండ్రులు శకుంతలాదేవి, రామచందర్రావు. భర్త దివంగత వేముల దేవేందర్. రమాదేవి దంపతులకు ఇద్దరు కుమారులు. ఈమె ఆంధ్రా బ్యాంకులో పనిచేసి సీనియర్ మేనేజర్గా ఉద్యోగవిరమణ పొందారు. చిన్నతనం నుంచే సాహిత్యంపై మక్కువతో అనేక రచనలు చేశారు. రమ కలం పేరుతో కార్టూనిస్ట్గా, రచయిత్రిగా పేరు పొందారు. మనసు భాష (కవిత్వం)- 2011, రమణీయం(కార్టూన్లు)-2011, మనసు మనసుకూ మధ్య (కథలు)-2011, చినుకులు (నానీలు)-2021, తల్లి వేరు (కథలు)-2021, డీ కామేశ్వరి కథలపై మోనోగ్రాఫ్-2023, అశ్రువర్ణం (కవిత్వం)-2024, రమాయణం-1 (కాలమ్స్)-2024 ప్రచురించారు.. ‘రమ’ కలం పేరుతో కార్టూన్లు కూడా వేస్తారు. 2004లో సుశీలా నారాయణరెడ్డి పురస్కారం, 2015లో పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ కీర్తి పురస్కారంతో పాటు పలు అవార్డులు రమాదేవిని వరించాయి.
ఇంకా అపురూప అవార్డు, తెలంగాణ ప్రభుత్వ ఉత్తమ రచయిత్రి (వరంగల్ జిల్లా), ప్రతిభా పురసారం, జాతీయ సాహిత్య పరిషత్తు, సిద్దిపేట ఐతా భారతి చంద్రయ్య సంప్రదాయ కథా సాహితీ పురస్కారం, గిడుగు రామ్మూర్తి పంతులు ఫౌండేషన్ అవార్డు, గుర్రం జాషువా ఫౌండేషన్ పురస్కారం, వెంకటసుబ్బు స్మారక అవార్డు, పర్చా రంగారావు స్మారక అవార్డు, తిరుమల స్వరాజ్యలక్ష్మి సాహితీ పురసారం, రాగతి పండరి స్మారక పురస్కారం, ప్రొఫెసర్ వాసిరెడ్డి భాస్కర్రావు స్మారక పురస్కారం, ఎక్స్రే పత్రిక ఉత్తమ కవితా పురస్కారం, డాక్టర్ రాణీ పులోమజాదేవి స్మారక గౌరవ పురస్కారం, డాక్టర్ సినారె సాహిత్య పురస్కారాలతోపాటు కార్టూన్లు, కవిత్వం, కథలకూ పలు అవార్డులను అందుకున్నారు.
ఇది కూడా చూడండి: BREAKING: పార్టీలో గొడవలు.. పదవికి రాజీనామా చేసిన ప్రధాని!