/rtv/media/media_files/2025/02/12/EAUpTxPr4FJQNxhGRCmQ.webp)
Local Bodie Elections
గతేడాది అంటే 2024 ఫిబ్రవరి 1వ తేదీతో సర్పంచ్ల పదవి కాలం ముగిసినా ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించలేకపోయింది. ఈ క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. సెప్టెంబర్ 30వ తేదీ లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ఎన్నికల సంఘానికి, ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉండగా, ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో నల్గొండకు చెందిన సర్పంచ్లు పిటిషన్ వేశారు. ఈ విషయమై రిజర్వేషన్లు, వార్డు డివిజన్ ప్రక్రియ చేపట్టడానికి 25 రోజుల సమయం కావాలని ప్రభుత్వం కోర్డును కోరింది. అదే సమయంలో కనీసం 60 రోజుల సమయం కావాలని ఎన్నికల కమిషన్ కోరింది. ఇరువురి వాదనలు విన్న హైకోర్టు సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించాలని తీర్పునిచ్చింది.
రిజర్వేషన్ల పై కసరత్తు
స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడానికి ప్రభుత్వం సిద్దంగా ఉన్నప్పటికీ పార్టీ బీసీలకు ఇచ్చిన హమీని అమలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రిజర్వేషన్లు 50 శాతం దాటొద్దన్న సుప్రీంకోర్టు నిబంధనతో ప్రభుత్వం ఏం చేయాలన్న దానిపై దృష్టి సారించింది. కేంద్రం నుంచి బీసీలకు 42శాతం రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్ రాకపోతే పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇవ్వడానికి సిద్ధమవుతోంది. అంటే 42 శాతం మంది బీసీలకు టికెట్లు ఇచ్చే ఆలోచనలో కాంగ్రెస్ ఉంది.
రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు 12,633
2019 ఎన్నికల ప్రకారం రాష్ట్రంలో 12,848 గ్రామ పంచాయతీలున్నాయి. ఆ తర్వాత వాటిలో 71 గ్రామాలు ఫ్యూచర్ సిటీలో విలీనమైనందున మిగిలినవి 12,777 గ్రామ పంచాయతీలు. వీటిలో కొన్ని మున్సిపాలిటీల్లో విలీనం కాగా మిగిలినవి 12,633 గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలు జరుగనున్నాయి. గతంలో మహిళలకు 50% రిజర్వేషన్ అమలైనందున ఈసారి కూడా వారికి సగం సీట్లు దక్కనున్నాయి. గతంలో 2.02 కోట్ల జనాభా ప్రాతిపదికన స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలుచేశారు. ఇప్పుడు కొన్ని గ్రామాలు మున్సిపాలిటీల్లో విలీనమైనందున గ్రామీణ జనాభా 1.90 కోట్లకు చేరింది. దీని ప్రకారం ఈసారి బీసీలకు 20-22%, ఎస్సీలకు 18-20%, ఎస్టీలకు 8-10% సీట్లు కేటాయించే అవకాశం ఉన్నది. రొటేషన్ అమలుకు ప్రభుత్వం చట్టం చేసినందున గతంలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ స్థానాలు ఇప్పుడు మారుతాయి. ఎస్సీ సీటు బీసీ లేదా జనరల్కు కేటాయించే అవకాశం ఉంటుంది.
గ్రామపంచాయతీలతో పాటు 539 మండల ప్రజా పరిషత్ పాలకవర్గాల గడువు నిరుడు ఫిబ్రవరి 1తో ముగిసింది. 28 జిల్లా పరిషత్ పాలకవర్గాల గడువు 2024 జూలై 5వ తేదీతో ముగియగా.. ము లుగు, ఖమ్మం, భద్రాచలం, మహబూబాబాద్ జెడ్పీలతోపాటు ఆ 4 జిల్లాల్లోని మండల పరిషత్ పాలకవర్గాల గడువు 2024 ఆగస్టు 5తో ముగిసింది. వీటన్నింటికి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది.
మొదట గ్రామపంచాయతీ ఎన్నికలు
ఇక గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మునిసిపాలిటీ స్థానిక సంస్థల్లో ముందుగా గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో మొత్తం12,633 పంచాయతీలు ఉన్నాయి. వాటన్నింటికి ఎన్నికలు జరుగుతాయి. ఈ పంచాయతీలన్నింటిలో సుమారు 1,13,500కుపైగా వార్డులున్నాయి. కాగా కొన్ని గ్రామ పంచాయతీలు మునిసిపాలిటీల్లో కలిసే అవకాశం ఉంది. ఆ పంచాయతీల్లోని వార్డులుపోగా.. మిగతా వాటికి ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. మరోవైపు 5,817 ఎంపీటీసీ, 567 ఎంపీపీ, 567 జడ్పీటీసీ స్థానాలకు కూడా ఎన్నికలు నిర్వహించనున్నారు. జడ్పీటీసీ ఎన్నికలు ముగియగానే హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి మినహా మిగిలిన 31 జిల్లాల్లో జడ్పీ చైర్మన్లను ఎన్నుకోనున్నారు. ఈ ప్రక్రియనంత సెప్టెంబర్ 30 లోగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.