KTR: సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ సొమ్మును ఢిల్లీ పెద్దలకు దానం చేస్తున్నారన్నారు. ఓటుకు నోటు ఇప్పుడు సీటుకు రూటు కుంభకోణంగా మారిందన్నారు. మూటల ముఖ్యమంత్రిగా మారిన రేవంత్.. హెరాల్డ్ కేసుపై క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
టెన్షన్ డైవర్షన్ డ్రామాలు..
తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి స్కాంగ్రెస్ ఏటీఎంగా మారిందన్నారు. ఈడి లాంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా ఇదే చెబుతున్నాయని చెప్పారు. తెలంగాణ బ్యాగ్ మ్యాన్ రేవంత్ రెడ్డి పేరును ఈడి తన చార్జ్ షీట్ లో నమోదు చేసింది. తన పేరు ఈడి చార్జిషీట్లో రావడంతో రేవంత్ రెడ్డి టెన్షన్ డైవర్షన్ డ్రామాలు మొదలుపెట్టాడు. ప్రజల దృష్టిని మరల్చేందుకే ప్రతిరోజూ కొత్త నాటకాలు చేస్తున్నాడు. తన అవినీతిని చర్చించకుండా ప్రజల దృష్టిని మరల్చేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఈడి చార్జిషీట్ లో రేవంత్ రెడ్డి పేరు వచ్చిన తర్వాత అయినా కేంద్రం చర్యలు తీసుకుంటుందా లేదా? అని ప్రశ్నించారు.
సీఎం అవినీతి బండారం
అమృత్ స్కాం, ఆర్ఆర్ టాక్స్ స్కాం, సివిల్ సప్లై స్కాం వంటి వాటిలో ఇంతకుముందు వదిలేసినట్లుగా వదిలేస్తుందా అన్నది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారిందన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డి పేరు పెట్టడంతో.. సీఎం అవినీతి బండారం మొత్తం బయటపడిందన్నారు. యంగ్ ఇండియా సంస్థకు విరాళాలు ఇస్తే పదవులు ఇప్పిస్తానని రేవంత్ రెడ్డి ప్రలోభ పెట్టాడని ఈడీ నమోదు చేసిన చార్జిషీట్ తో సీఎం అవినీతి సామ్రాజ్యం బట్టబయలైందని చెప్పారు. అధికారం కోసం ముఖ్యమంత్రి కాకముందే కాంగ్రెస్ పార్టీ పెద్దలకు వందల కోట్లు కట్టబెట్టిన వ్యవహారం కుండబద్దలు కొట్టినట్టయింది. వందల కోట్లతో మొదలైన రేవంత్ అవినీతి బాగోతం గత ఏడాదిన్నరలో సీఎం పదవిని అడ్డం పెట్టుకుని ఏకంగా వేల కోట్లకు చేరిందని ఆరోపించారు.
Also Read: ఆపరేషన్ సింధూర్ లో 200 మందికి పైగా ఉగ్రవాదులు మృతి..న్యూ అప్డేట్స్ అవుట్
దివ్యమైన తెలంగాణని దివాళా తీసి వేల కోట్లు కొల్లగొట్టడం వల్లే ఈడీ కేసులో రేవంత్ రెడ్డి అడ్డంగా ఇరుక్కుపోయారని కేటీఆర్ ఆరోపించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి – పొంగులేటి తరహాలో చీకట్లో బీజేపీ పెద్దల కాళ్లు పట్టుకుంటాడా ? ఈడీ, కేవలం చార్జిషీటులో పేరు పెట్టడం వరకే పరిమితం అవుతుందా? లేక రేవంత్ రెడ్డిని విచారణను పిలిచి మొత్తం అవినీతి కుంభకోణాలను కక్కిస్తుందా ? అని ప్రశ్నించారు. రాష్ట్ర కాంగ్రెస్ లో రోజురోజుకూ పేట్రేగిపోతున్న అంతర్గత కుమ్ములాటలతో ఆ పార్టీ పూర్తిగా కావికలమైందన్నారు. పెరిగిపోతున్న తిరుగుబాట్లతో సీఎం కుర్చీ ఎప్పుడూ కూలిపోతుందో అనే భయం రేవంత్ రెడ్డిని అడుగడుగునా వెంటాడుతోంది. ఏం చేయాలో తెలియని దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్న కాంగ్రెస్, ముఖ్యమంత్రి.. అటెన్షన్ డైవర్షన్ కోసం రోజురోజుకూ చేస్తున్న చిల్లర చేష్టలు, కొత్త కుట్రలకు తెరపడినట్టే అన్నారు.
Also Read: దండకారణ్యంలో భీకర యుద్ధం.. అగ్రనేతలను చుట్టుముట్టిన 15వేల భద్రతా బలగాలు!
సీఎం రేవంత్ కు పిల్లనిచ్చిన మామ సూదిని పద్మారెడ్డియే స్వయంగా కాళేశ్వరంలో అవినీతి జరగలేదనడంతో ముఖ్యమంత్రికి, కాంగ్రెస్ పార్టీ ఫ్యూజులు ఒక్కసారిగా ఎగిరిపోయినై. కమీషన్లు లేనిదే ప్రభుత్వంలో ఒక్కటంటే ఒక్క ఫైలు కదలడం లేదని స్వయంగా కేబినెట్ మంత్రి కొండా సురేఖ కుండబద్దలు కొట్టడంతో కాంగ్రెస్ నిర్వాకాలన్నీ వరుసగా వెలుగుచూస్తున్నాయన్నారు. 30 శాతం పర్సెంటేజీలు ఇవ్వనిదే సొంత ప్రభుత్వంలో పనులు కావడం లేదని సాక్షాత్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆ పార్టీ బట్టలిప్పడంతో కాంగ్రెస్ నిజస్వరూపం బయటపడిందని చెప్పారు. నాలుగు కోట్ల ప్రజల ముందు ముఖ్యమంత్రి అవినీతి బాగోతం బట్టబయలు కావడంతో కుడితిలో పడిన ఎలుకలా కాంగ్రెస్ పార్టీ కొట్టుకుంటోంది. పచ్చని రాష్ట్రంలో చిచ్చుపెట్టడమే కాకుండా వేల కోట్ల ప్రజాధనాన్ని లూటీచేస్తూ, పేదల జీవితాలతో చెలగాటమాడుతున్న ముఖ్యమంత్రి పాపం పండింది. చివరికి ధర్మం గెలుస్తుందని కేటీఆర్ అన్నారు.
cm revanth | telangana | telugu-news | today telugu news