HYD Metro: వామ్మో మెట్రో.. అడుగు పెట్టాలంటే అర కి.మీ లైన్.. షాకింగ్ వీడియోలు!

పండుగ సెలవుల తర్వాత హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. దీంతో మెట్రో స్టేషన్లకు జనం పోటెత్తారు. ఎల్బీ నగర్ వంటి స్టేషన్లలో ఎస్కలేటర్లు పనిచేయక, ప్లాట్‌ఫారంకు చేరడానికి గంటల సమయం పట్టి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

New Update
HYD METRO

HYD METRO

గత వారం రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షం(rain) దంచి కొడుతోంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లు జలమయమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో కరెంట్ స్తంభించిపోయింది. ఉద్యోగాలకు వెళ్లాల్సిన వారు కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్‌తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు పండుగ సెలవుల అనంతరం హైదరాబాద్ నగరానికి తిరిగి వచ్చిన లక్షలాది మంది ప్రజల కారణంగా ట్రాఫిక్ వ్యవస్థ మరోసారి అస్తవ్యస్తంగా మారింది. రోడ్లపై వాహనాల రద్దీతో ఎక్కడికక్కడ స్తంభించిన ట్రాఫిక్‌తో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Hyderabad Metro

Also Read :  TGSRTC: RTIతో RTC బస్సుల్లో భారీ మార్పు.. ఏం అడిగాడు భయ్యా?

అంతులేని క్యూలైన్లు

ముఖ్యంగా ప్రధాన రహదారులు, జంక్షన్ల వద్ద పరిస్థితి దారుణంగా మారింది. ఈ ట్రాఫిక్ నరకం నుంచి తప్పించుకునేందుకు అధిక సంఖ్యలో ప్రయాణికులు మెట్రో రైళ్లను ఆశ్రయించడంతో.. మెట్రో స్టేషన్లలోనూ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సాధారణంగా రద్దీగా ఉండే మెట్రో స్టేషన్లు కూడా దసరా పండుగ సెలవుల తర్వాత మరింతగా కిక్కిరిసిపోయాయి. నగర శివారు ప్రాంతాలు, ప్రధాన బస్ స్టేషన్లకు దగ్గరగా ఉన్న మెట్రో స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ తారాస్థాయికి చేరింది. 

ఇందులో మరీ ముఖ్యంగా ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ వద్ద పరిస్థితి ఆందోళనకరంగా మారింది. గ్రామాలు, సొంత ఊర్ల నుంచి నగరానికి చేరుకున్న వేలాది మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు మెట్రోను ఎంచుకోవడంతో టికెట్ కౌంటర్లు, సెక్యూరిటీ చెకింగ్ పాయింట్ల వద్ద భారీ క్యూలైన్లు ఏర్పడ్డాయి. అదే సమయంలో ప్లాట్‌ఫారంకు చేరుకోవడానికి గంటల సమయం పడుతోందని ప్రయాణికులు వాపోతున్నారు. సాధారణంగా ఐదు నుంచి పది నిమిషాల్లో ముగిసే ప్రక్రియ.. సోమవారం ఉదయం పూట దాదాపు గంటకు పైగా పట్టింది. 

Also Read :  నేడే జూబ్లీహిల్స్ ఎన్నికల షెడ్యూల్.. 4 గంటలకు ఈసీ ప్రెస్ మీట్!

పని చేయని ఎస్కలేటర్లు, లిఫ్టులు

ఒకవైపు ప్రయాణికుల తాకిడి పెరగగా.. మరోవైపు కొన్ని ప్రధాన స్టేషన్లలో ఎస్కలేటర్లు, లిఫ్టులు పనిచేయకపోవడం ఈ సమస్యను మరింత తీవ్రతరం చేసింది. ఎల్బీ నగర్, ఉప్పల్, మియాపూర్ వంటి ముఖ్యమైన స్టేషన్లలో కొన్ని ఎస్కలేటర్లు మొరాయించాయి. భారీ లగేజీతో ఉన్న వృద్ధులు, మహిళలు, చిన్నారులు మెట్ల మార్గాన్ని ఉపయోగించాల్సి రావడంతో నానా అవస్థలు పడ్డారు. అప్పటికే రద్దీగా ఉన్న మెట్ల మార్గాల్లో తోపులాటలు కూడా చోటుచేసుకున్నాయి. ప్లాట్‌ఫారంకు చేరుకోవడమే ఒక పెద్ద యుద్ధంగా మారిందని పలువురు ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. అత్యవసర సమయంలో ఇలా ఎస్కలేటర్లు పనిచేయకపోవడం మెట్రో నిర్వహణ లోపాన్ని స్పష్టంగా తెలియజేస్తోందని ఆరోపించారు.

ఊపిరి సలపని రద్దీ

ప్లాట్‌ఫారాలపై గంటల తరబడి వేచి చూసిన ప్రయాణికులు, రైలు వచ్చిన తర్వాత అందులో ఎక్కేందుకు మరోసారి పోరాడాల్సి వచ్చింది. మెట్రో రైళ్లు పూర్తిగా ప్రయాణికులతో నిండిపోయి, ఊపిరి సలపనంత రద్దీగా కనిపించాయి. కాలు పెట్టడానికి కూడా చోటు లేకపోవడంతో, కొన్ని స్టేషన్లలో ప్రయాణికులు లోపలికి వెళ్లలేక అక్కడే ఆగిపోవాల్సి వచ్చింది. దీంతో మెట్రో రైలు సర్వీసుల సంఖ్యను పెంచాలని, రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు రైళ్లను నడపాలని ప్రయాణికులు మెట్రో అధికారులను డిమాండ్ చేస్తున్నారు.

ట్రాఫిక్ వ్యవస్థపై దృష్టి పెట్టాల్సిన అవసరం

పండుగ సెలవులు ముగిసిన తర్వాత ప్రతి సంవత్సరం నగరంలో ఇదే పరిస్థితి కనిపిస్తున్నప్పటికీ, ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడంలో అధికారులు విఫలమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రోడ్లపై పోలీసుల పర్యవేక్షణ పెంచాలని, సిగ్నలింగ్ వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు. ట్రాఫిక్ సమస్య, మెట్రో స్టేషన్లలో రద్దీ కారణంగా ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతుండగా, సంబంధిత అధికారులు ఈ సమస్యలను పరిష్కరించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 

Advertisment
తాజా కథనాలు