Crime : భర్తకు 2 కోట్ల ఇన్సూరెన్స్‌..లేపేసి గుండెపోటు కథ..లవర్‌తో ఎంజాయ్‌ చేద్దామనుకుంటే...

నిజామాబాద్ జిల్లాలో భర్తను హత్య చేసిన ఘటనలో కొత్త ట్విస్ట్ వెలుగుచూసింది. సౌమ్య తన భర్త పల్లాటి రమేష్ పేరు మీద ఉన్న 2 కోట్లకు పైగా ఇన్స్యూరెన్స్ డబ్బుల కోసం.. ప్రియుడు దిలీప్తో కలిసి పక్కాగా ప్లాన్ చేసి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తెలిసింది.

New Update
FotoJet (90)

The wife killed her husband

Crime : నిజామాబాద్ జిల్లాలో భర్తను హత్య చేసిన ఘటనలో కొత్త ట్విస్ట్ వెలుగుచూసింది. సౌమ్య తన భర్త పల్లాటి రమేష్ పేరు మీద ఉన్న 2 కోట్లకు పైగా ఇన్స్యూరెన్స్ డబ్బుల కోసం.. ప్రియుడు దిలీప్తో కలిసి పక్కాగా ప్లాన్ చేసి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. వివాహేతర సంబంధానికి భర్త అడ్డు వస్తుండటం,  అలాగే భర్త పై ఉన్న ఇన్స్యూరెన్స్ డబ్బుల కోసమే రమేష్‌ను సౌమ్య హత్య చేయించినట్లు తేలింది. భర్త పేరు మీదున్న ఇన్స్యూరెన్స్ డబ్బుల కోసం నార్మల్ డెత్ గా నమ్మించడానికి రమేష్‌కు గుండె పోటు అని చిత్రీకరించే ప్రయత్నం చేసినట్లు పోలీసులు తేల్చారు. నిద్ర మాత్రలు ఇచ్చి భర్త గొంతు నులిమి హత్య చేసి అనంతరం హార్ట్ ఎటాక్గా నమ్మించినట్లు తేలింది. అయితే చనిపోయిన పల్లాటి రమేష్ తమ్ముడి ఫిర్యాదుతో శవానికి రీ పోస్టు మార్టం నిర్వహించగా అసలు నిజం వెలుగులోకి వచ్చింది. విచారణలో తన భర్తను ప్రియుడితో కలిసి చంపినట్లు సౌమ్య ఒప్పుకుంది.

వివరాల ప్రకారం..నిజామాబాద్‌ జిల్లా మాక్లూర్‌ ‌మండలం బోర్గాం(కే) గ్రామానికి చెందిన పల్లాటి రమేశ్‌(35), ప్రైవేట్‌ ‌కంపెనీలో జాబ్ చేస్తున్నాడు.. అతని భార్య సౌమ్య అలియాస్‌‌ అరుణలత ఓ ప్రైవేట్‌ ‌స్కూల్‌‌లో క్లర్క్‌ గా పని చేస్తుంది. వీరికి పిల్లలు లేరు. కాగా అదే స్కూల్లో పీఈటీగా చేసే నందిపేట మండలం బాద్గుణ గ్రామానికి చెందిన నాళేశ్వరం దిలీప్‌‌తో సౌమ్యకు రెండేండ్ల కింద వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో వారు తరుచుగా కలుచుకునేవారు. అయితే ఈ విషయం రమేశ్కు తెలియడంతో ‌భార్యను పలుమార్లు మందలించాడు. దీంతో భర్తను ఎలాగైన అడ్డుతొలగించు కోవాలని ప్రియుడు దిలీప్‌‌ను సౌమ్య కోరింది. దీంతో అతడు వరుసకు తమ్ముడైన మాదాపూర్‌ గ్రామానికి చెందిన ఎర్రోళ్ల అభిషేక్‌ సాయం కోరాడు.  

అందులో భాగంగా గత ఆగస్టు12న బైక్ పై వెళుతున్న రమేశ్‌ను అభిషేక్ కారుతో ఢీకొట్టి పారిపోయాడు.  అయితే ఈ ప్రమాదంలో రమేశ్​చేయి విరిగింది.  దీనిపై మాక్లూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టినట్టు కేసు నమోదు చేశారు. అనంతరం అభిషేక్‌‌ తన ఫ్రెండ్‌ ‌బంటు జితేందర్‌‌ను ‌దిలీప్‌‌కు పరిచయం చేశాడు. దీంతో జితేందర్‌ సుపారి గ్యాంగ్‌తో మర్డర్‌ ‌చేయిస్తానని చెప్పి ప్లాన్ చేశాడు. కిసాన్‌ ‌నగర్‌ ‌తండాకు చెందిన కేలోత్‌ ‌శ్రీరామ్‌‌ అలియాస్‌‌ బబ్లూ, రమావత్‌‌ రాకేశ్‌, దూదేకుల మోసిన్‌‌లతో  రూ.35 వేలకు డీల్‌‌ కుదుర్చు కున్నారు. దీనికోసం సౌమ్య తన బంగారు ఉంగరాన్ని దిలీప్‌కు ఇవ్వగా దాన్ని ఫైనాన్స్‌లో తాకట్టు పెట్టి ఆ డబ్బులు తెచ్చి సుఫారి గ్యాంగ్‌కు ఇచ్చాడు.

 అనంతరం గత డిసెంబర్19న రాత్రి రమేశ్ అన్నం తిన్న తర్వాత నిద్ర మాత్రలు కలిపిన మంచినీటిని సౌమ్య భర్త రమేష్‌కు ఇవ్వగా తాగిన అతడు గాఢ నిద్రలోకి వెళ్లాడు. వెంటనే ప్రియుడికి ఫోన్‌‌ చేసి చెప్పింది. అతను సుపారి గ్యాంగ్‌‌కు ఫోన్‌‌ చేయగా ‌వారు లిఫ్ట్‌ ‌చేయలేదు. దీంతో అభిషేక్‌‌ తో పాటు దిలీప్ బైక్‌‌పై సౌమ్య ఇంటికి వెళ్లారు. నిద్రపోయిన రమేశ్​‌మెడకు టవల్‌‌చుట్టి, ముఖంపై దిండు అదిమిపెట్టి ఊపిరాడకుండా చేసి చంపేశారు. అనంతరం బైక్‌‌పై వెళ్లిపోయారు.  

మరుసటి రోజు ఉదయం తన భర్త గుండెపోటుతో నిద్రలోనే చనిపోయాడని సౌమ్య బంధువులకు ఫోన్ చేసి చెప్పింది. అందరి సమక్షంలో అదేరోజు అంత్యక్రియలు పూర్తి చేసింది. అయితే.. ఉపాధి కోసం ఇజ్రాయెల్‌కు వెళ్లిన రమేశ్ తమ్ముడు కేదారికి అంత్యక్రియల వీడియోలు, ఫొటోలు పంపారు. వాటిలో అన్న మెడకు గాయాలు ఉండడం చూసి అనుమానించి బోర్గాం (కే)లోనే ఉండే తన భార్య అనూషతో కేదారి పోలీసులకు ఫిర్యాదు చేయించాడు.  కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గత డిసెంబర్‌ ‌24న తహసీల్దార్‌ ‌సమక్షంలో డెడ్‌‌బాడీని  వెలికి తీయించి పోస్టుమార్టం చేయించగా రమేష్‌ ది హత్య అని తేలింది. దీంతో సౌమ్యను విచారించగా పూర్తి వివరాలు వెల్లడించింది. దీంతో సౌమ్యతో పాటు ఆమె ప్రియుడు దిలీప్‌‌, అభిషేక్‌‌, బంటు జితేందర్‌‌, కేలోత్‌‌ శ్రీరామ్‌‌, రమావత్‌ ‌రాకేశ్ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Advertisment
తాజా కథనాలు