Fire Accident
Fire Accident: నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలో ఉన్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది. మొదటి యూనిట్లోని బాయిలర్ వద్ద ఆయిల్ లీక్ కావడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అదే సమయంలో అక్కడ వెల్డింగ్ పనులు జరుగుతుండటంతో లీకైన ఆయిల్కు మంటలు అంటుకున్నాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగి యూనిట్ మొత్తానికి వ్యాపించాయి. దీంతో భారీగా మంటలు ఎగసిపడి పరిసర ప్రాంతాల్లో ఆందోళన ఏర్పడింది. కార్మికులు వెంటనే అప్రమత్తమై భద్రతా చర్యలు చేపట్టారు. ప్లాంట్ సిబ్బంది వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ప్రమాదంపై అలర్ట్ అయిన అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
భారీగా అలుముకున్న పొగ..
అగ్నిప్రమాదం జరిగిన సమయంలో అక్కడ పనిచేస్తున్న సిబ్బంది సురక్షితంగా బయటపడినట్లు తెలుస్తోంది. ఘటన స్థలంలో భారీ మంటలకు ఊపిరి తిప్పుకోలేని స్థాయిలో పొగ అలుముకున్నాయి. వెంటనే పవర్ ప్లాంట్లోని మొదటి యూనిట్ కార్యకలాపాలను నిలిపివేశారు. మంటలు ఎక్కువగా వ్యాపించకుండా అదుపు చేసే పనిలో ఉద్యోగులు, ఫైర్ సిబ్బంది పడ్డారు. పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేస్తున్నారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. ఆయిల్ లీకేజ్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అయితే పూర్తి వివరాలు అధికారిక విచారణ అనంతరం మాత్రమే వెల్లడయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: రోజంతా ACలో గడిపితే ఊబకాయం వచ్చే ప్రమాదం
ఈ ప్రమాదం నేపథ్యంలో ప్లాంట్ భద్రతలపై అధికారులతో పరిస్థితిని సమీక్షించి మరింత జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించారు. అదేవిధంగా.. మిగిలిన యూనిట్లను పరిశీలించి ఏవైనా లోపాలుంటే వెంటనే సరిచూడాలని ఆదేశించారు. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగలేదు. అయితే ఆస్తి నష్టం వివరాలు ఇంకా ఖరారవ్వలేదు. మంటల ప్రభావంతో యూనిట్లోని కొన్ని యంత్రాలు, సరఫరా పరికరాలు దెబ్బతిన్నట్లు సమాచారం. ప్లాంట్ నిర్వాహకులు పరిస్థితిని సమతుల్యం చేయడానికి తగిన చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా నియంత్రణలో ఉంది. భద్రతా పరంగా మరింత జాగ్రత్తలు తీసుకోవాలని స్థానిక అధికారులు సూచించారు.
ఇది కూడా చదవండి: రాత్రిపూట కాళ్లలో ఈ లక్షణాలు కనిపిస్తే గుండెపోటుకు సంకేతం
( crime news | latest-news | telugu-news )