Nalgonda: నల్గొండ జిల్లాలో లక్ష ఎకరాలకు నీరు అదించాలనే కాంగ్రెస్ నాయకుడు కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి కల ఎట్టకేలకు నెరవేరనుంది. ప్రజాపాలన ఉత్సవాల్లో భాగంగా నేడు నల్గొండ జిల్లాలో పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి బ్రాహ్మణవెల్లెంల ఉదయ సముద్రం ఎత్తిపోతల ప్రాజెక్టుతోపాటు మెడికల్ కళాశాల భవనం, పలు అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ముఖ్యంగా 18ఏళ్ల క్రితం సగం చేసి వదిలేసిన బ్రహ్మణవెల్లెంలోని ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను శరవేగంగా పూర్తి చేయించారు వెంకట్ రెడ్డి. మొదటిదశలో అనుకున్నమేర పనులు పూర్తవడంతో సీఎం పర్యటనలో ఆయన ద్వారా కాల్వలకు నీటి విడుదల చేయించాలని భావించారు. ఇందులో భాగంగానే అన్ని అనుకున్నట్లు జరగడంతో కాల్వల ద్వారా నీటిని విడుదల చేయనున్నారు. దీంతో నార్కట్పల్లి, నల్లగొండ, చిట్యాల, మునుగోడు, రామన్నపేట, శాలిగౌరారం, కట్టంగూరు మండలాలకు లబ్ధి చేకూరనుంది.
రేవంత్కు కృతజ్ఞతలు..
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన వెంకట్ రెడ్డి.. బ్రాహ్మణవెల్లెంల ఉదయ సముద్రం ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తి కావడంతో తన చిరకాల స్వప్నం నెరవేరిందన్నారు. అందుకు ఈ ప్రాంత రైతుల తరుపున సీఎం రేవంత్కి కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు. కరువు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలన్న ఉద్దేశంతో ప్రారంభించిన బ్రాహ్మణవెల్లెంల ఉదయసముద్రం ఎత్తిపోతల పొజెక్టును అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ శంఖుస్థాపన చేశారు. మళ్లీ17 ఏళ్ల తర్వత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇందిరమ్మ రాజ్యంలో ప్రాజెక్టు పూర్తి చేసుకున్నామని ఆనందం వ్యక్తం చేశారు. నా కల నిజం చేసిన సీఎం రేవంత్ రెడ్డి ధన్యవాదాలు అంటూ ఎమోషనల్ అయ్యారు.
లక్ష ఎకరాలకు సాగునీరు..
అలాగే అతి త్వరలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రేపు బ్రాహ్మణ వెల్లంల ప్రారంభం చేయడం సంతోషంగా ఉందన్నారు. పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ నేతలు ఉమ్మడి నల్లగొండ జిల్లాను, జిల్లాలోని ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎస్ఎల్బీసీ కూడా నిర్లక్ష్యానికి గురైందని తెలిపారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేకపోతే బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు లేదని కీలక ప్రకటన చేశారు.
ఇది కూడా చదవండి : ఇంటర్నెట్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. రూ.300కే కనెక్షన్!
ఈ ప్రాజెక్టుతో లక్ష ఎకరాలకు సాగునీరు, త్రాగునీరు అందనుంది. వెంకట్ రెడ్డి నల్లగొండ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో సుమారు 17 ఏళ్ల క్రితం బ్రాహ్మణవెల్లెంల ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వీటి పనులు 80శాతం మేర పూర్తయ్యాయి. ఆ తరువాత ప్రభుత్వం మారడం, గత పదేళ్లలో ఈ పథకం చివరి దశలో పనుల్లో వేగంపెంచినా ఆశించిన ప్రయోజనం దక్కలేదు. నామమాత్రంగా పంపులు, మోటర్లు ప్రారంభించారేతప్ప పనులు ముందుకుసాగలేదు. తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో ఈ పథకం పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి. ప్రాజెక్టును సందర్శించడంతో పాటు, కాల్వల పనులను వేగవంతం చేసేలా కలెక్టర్, సాగునీటి పారుదలశాఖాధికారులకు ఆదేశాలు జారీ చేయడంతోపాటు నిధులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నా్మని వెంకట్ రెడ్డి చెప్పారు.
ఇది కూడా చదవండి: పేరుకేమో స్పా సెంటర్.. కానీ లోపల చేసే పని..
ఏఎమ్మార్పీ ప్రాజెక్టులో అంతర్భాగంగా చేపట్టిన బ్రాహ్మణవెల్లెంల-ఉదయసముద్రం ఎత్తిపోతల పథకం కింద నల్లగొండ, నకిరేకల్, మునుగోడు, తుంగతుర్తి నియోజకవర్గాల్లోని లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుంది. నల్లగొండ సమీపంలోని పానగల్లోని ఉదయ సముద్రం రిజర్వాయర్ నుంచి అండర్ టన్నెల్ ద్వారా నార్కట్పల్లి మండలం బ్రాహ్మణవెల్లెంల వద్ద నిర్మించిన రిజర్వాయర్కు నీటిని తరలించి, అక్కడి నుంచి కుడి, ఎడమకాల్వల ద్వారా లక్ష ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చేలా పథకాన్ని రూపొందించారు.
మొదటి దశలో ఈ ప్రాజెక్టు కింద కుడి ప్రధాన కాల్వ రెండో డిస్ట్రిబ్యూటరీ పరిధిలో 18వేల ఎకరాలకు, ఎడమ ప్రధాన కాల్వ డిస్ట్రిబ్యూటరీ-2 పరిధిలో 31,390 ఎకరాలు మొత్తం 49వేల పైచిలుకు ఎకరాలకు నీరివ్వాలని నిర్ణయించారు. ప్రధాన కాల్వ కింద డిస్ట్రిబ్యూటరీ-1, కుడిప్రధాన కాల్వ కింద డిస్ట్రిబ్యూటరీ-2 పనులు పూర్తిచేసేందుకు పనులుచేపట్టారు. 18.575కిలోమీటర్ల ఎడమ ప్రధాన కాల్వలో పెండింగ్ పనులు, దీని పరిధిలోని డిస్ట్రిబ్యూటరీ-1లో 18కిలోమీటర్ల కాల్వ పనుల్లో పెండింగ్లో ఉన్న సుమారు 12కిలోమీటర్ల కాల్వ తవ్వకం పనులు పూర్తి చేశారు. అదేవిధంగా కుడి ప్రధాన కాల్వ 25 కిలోమీటర్లలో పెండింగ్ పనులకు అవసరమైన భూసేకరణ, దీని పరిధిలో నిర్మాణంలో ఉన్న డిస్ట్రిబ్యూటరీ-2 కింద 22కిలోమీటర్ల కాల్వ నిమిత్తం అవసరమైన భూసేకరణతోపాటు కాల్వల నిర్మాణం పూర్తి చేసినట్లు మంత్రి వెల్లడించారు.
ఇది కూడా చదవండి: America: కొడుకుకే కాదు..మరికొందరికి కూడా..!
సీఎం పర్యటన సందర్భంగా నల్లగొండ జిల్లా కేంద్రంలో రూ.110కోట్లతో చేపట్టిన అండర్గ్రౌండ్ డ్రైనేజీ పనులకు, రూ.100కోట్లతో లతీఫసాహెబ్ గుట్ట, బ్రహ్మంగారి గుట్టపైకి ఘాట్రోడ్ల నిర్మాణాలకు కూడా సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ప్రజాపాలన ఉత్సవాల్లోనే యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని సైతం ప్రారంభిస్తారని అనుకున్నప్పటికీ పలు కారణాల వల్ల పెండింగ్ లో ఉంచారు.