/rtv/media/media_files/2025/07/29/layoffs-2025-07-29-17-48-58.jpg)
Layoffs
ఐటీ జాబ్ చేస్తే లైఫ్ బాగుంటుందని చాలామంది అనుకుంటారు. కానీ అది వాస్తవం కాదు. దీనికి కారణం బడా టెక్ కంపెనీలే ఈ మధ్య భారీగా లేఆఫ్లు ప్రకటిస్తున్నాయి. ఏఐ వినియోగం పెరగడం, గ్లోబల్ మార్కెట్లో ఆర్థిక అస్థిరత, లాభాల్లో క్షీణత, కంపెనీలు ఖర్చులు తగ్గించుకోనేందుకు యత్నించడం లాంటి పరిస్థితుల వల్ల ఐటీ ఉద్యోగాలు పోతున్నాయి. 2019లో ఐటీలో ఈ కోతలు మొదలయ్యాయి. ఇప్పటికీ అవి కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది చూసుకుంటే వందలాది కంపెనీలు లక్షలాది మంది ఐటీ ఉద్యోగులను తొలగించాయి.
గూగుల్, మైక్రోసాఫ్ట్, టీసీఎస్, ఇంటెల్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా లాంటి బడా కంపెనీలు వేలాది సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. అంతేకాదు శాలరీ హైక్ను కూడా ఆపేశాయి. దీంతో ఐటీ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. 2025 మధ్యలోనే దేశంలోని చాలావరకు ఐటీ కంపెనీలు లేఆఫ్ల విధానాన్ని కొనసాగిస్తున్నాయి. ఇంతకీ ఆ కంపెనీలేంటో వాటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Also Read : 12వేల మందికి TCS బిగ్ షాక్.. ఉగ్యోగులను తట్టాబుట్టా సర్దుకోమ్మన్న కంపెనీ
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)
టీసీఎస్ తమ మొత్తం ఉద్యోగుల్లో 2 శాతం మందిని వచ్చే ఏడాది నాటికి తొలగించనుంది. అంటే 12,000 నుంచి 12, 200 ఉద్యోగాలపై ఈ ప్రభావం పడనుంది. ముఖ్యంగా మధ్య స్థాయి, సీనియర్ స్థాయి ఉద్యోగులపై ఈ వేటు పడే ఛాన్స్ ఉంది. ఈ విషయాన్ని ఇటీవలే టీసీఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కే కృతివేశన్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అంతేకాదు ఆర్థిక సంవత్సరం 2025-26కి సంబంధించి శాలరీ హైక్స్ను కూడా టీసీఎస్ ఇంకా ప్రకటించలేదు. ఏఐ ఆటోమేషన్, లాభాల్లో క్షీణత కారణాల వల్ల కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.
మైక్రోసాఫ్ట్
మైక్రోసాఫ్ట్ ఈ ఏడాది భారీగా లేఆఫ్స్ ప్రకటించింది. మే నెలలో 6 వేల ఉద్యోగాలు తొలగించగా.. జులై నాటికి 9 వేల ఉద్యోగాలకు ఉద్వాసన పలికింది. మొత్తంగా ఈ ఏడాది మైక్రోసాఫ్ట్ 15 వేల ఉద్యోగాలు తొలగించనుంది. Xbox, గేమింగ్ విభాగాల్లో ఎక్కువగా ఉద్యోగాలు పోనున్నాయని తెలుస్తోంది. ఇక 2023లో ఈ కంపెనీ 10 వేలమందిని తొలగించిన సంగతి తెలిసిందే.
ఇంటెల్
ఇంటెల్ సంస్థ తమ ఉద్యోగుల్లో 15 శాతం మందిని తొలగించాలని యోచిస్తున్నాయి. తమ ఉద్యోగుల్లో 96 వేల నుంచి 75 వేల ఉద్యోగాల వరకు తగ్గించనుంది. దీనివల్ల 24 వేల ఉద్యోగాలు పోనున్నాయి. ఇందులో ఎగ్జిక్యూటివ్, చిప్ డిజైన్, క్లౌడ్ ఆర్కిటెక్చర్ వంటి ఉద్యోగులు ఎక్కువగా ప్రభావితం కానున్నారు. తక్కువ మంది ఉద్యోగులతో వేగంగా పనిచేయడమే తమ లక్ష్యమని ఇంటెల్ కొత్త సీఈవో లిప్బు టాన్ అన్నారు.
IBM
ఐబీఎమ్లో కూడా పెద్ద సంఖ్యలో లేఆఫ్స్ ప్రకటించారు. దాదాపు 8 వేల మందిని తొలగించినట్లు తెలుస్తోంది. వీళ్లలో ఎక్కువగా హెచ్ఆర్ (HR) విభాగానికే చెందినవారు ఉన్నారు. ఐబీఎమ్లో ఇటీవల HR సిబ్బందిలో కొంత భాగాన్ని ఏఐతో భర్తీ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఏకంగా 200 మంది స్థానాలను కేవలం ఏఐతోనే భర్తీ చేశారు.
Also Read : ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ CEE ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి
ఇదే బాటలో అమెజాన్, మెటా, గూగుల్
అలాగే అమెజాన్, మెటా, గూగుల్ వంటి బడా కంపెనీలు కూడా లేఆఫ్స్ బాటలో పడ్డాయి. 2022 నుంచి ఇప్పటిదాకా అమెజాన్లో 27 వేల ఉద్యోగాలు పోయాయి. ఈ ఏడాది జూన్లో 100 మంది ఉద్యోగులను తొలగించింది. ఇక రాబోయే రోజుల్లో మరిన్ని ఉద్యోగాలు తొలగించేందుకు రెడీ అవుతోంది. ఖర్చులు తగ్గించేందుకు రాబోయే రోజుల్లో దాదాపు 14 వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 2025 ప్రారంభంలో మెటా కంపెనీ 3 వేల మందికి పైగా ఉద్వాసన పలికింది. అలాగే గూగుల్ సంస్థ.. క్లౌడ్, పీపుల్ ఆపరేషన్స్, సేల్స్ తదితర డిపార్ట్మెంట్లలో పనిచేసే వందలాది ఉద్యోగులకు లేఆఫ్స్ ఇచ్చింది. ఏఐ వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది.
ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహింద్రాలో లేఆఫ్స్
ఇక ఇన్ఫోసిస్లో కూడా సైలెంట్గా లేఆఫ్లు ఇచ్చేస్తోంది. అలాగే శాలరీ హైక్ను కూడా వచ్చే 2025-26 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి (జనవరి-మార్చి 2026)కి వాయిదా వేసింది. విప్రో కూడా ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతోంది. అలాగే శాలరీ హైక్ను 2025-26 ఆర్థిక ఏడాది మూడో త్రైమాసికానికి వాయిదా వేసింది. ఆర్థిక ఒత్తిడి, ఖర్చుల ప్రభావం వల్లే ఈ నిర్ణయం తీసుకుంది. ఇక టెక్ మహీంద్రాలో ముఖ్యంగా టెలికాం, బీపీవో స్థాయిల్లో ఉద్యోగులను తొలగించనుంది. అంతేకాదు శాలరీ హైక్పై కూడా క్లారిటీ లేదు. HCL టెక్ కంపెనీలో ఈ ఏడాది ప్రారంభంలో 350కి పైగా ఉద్యోగులను తొలగించింది. ఏఐ వినియోగం, ఖర్చులు తగ్గించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
rtv-news | telugu-news | IT Jobs | national news in Telugu | it layoffs 2025 | latest-telugu-news