/rtv/media/media_files/2025/12/27/fotojet-19-2025-12-27-16-32-17.jpg)
Co-working space at the station
Work from the railway station: మన రైల్వేస్టేషన్లు స్మార్ట్ అవుతున్నాయి. ఇక మీదట హడావుడిగా ఊరెళ్లాల్సి వస్తే..చేస్తున్న పనిని మధ్యలో వదిలేసి వెళ్లాల్సిన అవసరం లేదు. మనం ట్రైన్ కోసం వేచి చూసే క్రమంలో రైలు రావడానికి మరింత సమయం ఉంటే అక్కడే మన ఆఫీసు పనిని పూర్తి చేసుకునే అవకాశం ఉంది.. అవును ఇపుడు మన రైల్వే స్టేషన్లు స్మార్ట్గా మారుతున్నాయి. సింపుల్గా స్టేషన్లోనే కో-వర్కింగ్ స్పేస్ సౌకర్యం కల్పిస్తున్నారు. దీంతో ఆఫీసు వర్క్ చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది. రైల్వే స్టేషన్లలోనే ఆఫీసు తరహాలో సకల ఏర్పాట్లతో ఉన్న ఓ టేబుల్పై ల్యాప్టాప్ పెట్టుకుని, పని పూర్తి చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. రైలు వచ్చే సమయంలోగా ఆఫీసు పని పూర్తి చేసుకుని సమయానికి ఊరికి వెళ్లిపోయాయే అవకాశం దీనివల్ల కలుగుతుంది.. ఇదేదో బాగుంది కదా..! ‘స్మార్ట్’గా మారుతున్న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఈ సౌకర్యం త్వరలోనే అందుబాటులోకి రానుంది. స్టేషన్లో సాంకేతికతను, సౌకర్యాలను ఒకే వేదికపై అందించేలా డిజిటల్ లాంజ్, కో-వర్కింగ్ స్పేస్లను ఏర్పాటు చేయనున్నారు.
సమయం ఆదా..సౌకర్యం సద్వినియోగం
కాగా, మానాశ్రయాన్ని తలపించేలా దేశంలోని పలు రైల్వేస్టేషన్లను అత్యాధునిక సదుపాయాలతో ఆధునీకరిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ను కూడా ఆధునీకరిస్తున్నారు. దీనికోసం సుమారు రూ.750 కోట్ల అంచనా వ్యయంతో పనులు ప్రారంభించారు. ఈ పనులు ఇప్పటికే 60 శాతానికి పైగా పూర్తయ్యాయి.
కాగా రైల్వే ప్రయాణీకులకు ఆధునిక సదుపాయాలను అందించడమేకాకుండా.. ప్రయాణికుల విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు వీలుగా స్టేషన్లో మరిన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. వాటిలో భాగంగానే డిజిటల్ లాంజ్లు, కో-వర్కింగ్ స్పేస్లను ఏర్పాటు చేసి.. సాఫ్ట్వేర్ ఉద్యోగులు, వ్యాపార వేత్తలు, విద్యార్థులకు పని వాతావరణాన్ని కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా రైల్వేశాఖ ముంబై స్టేషన్లో ఇప్పటికే ఈ తరహా సదుపాయాలు అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే.
ఇంతకు ఏమేమీ ఉంటాయంటే?
రైల్వేస్టేషన్లో ఏర్పాటు చేసే డిజటల్ లాంజ్, కో-వర్కింగ్ స్పేస్లో అత్యాధునిక సదుపాయాలు ఉంటాయని అధికారులు చెప్తున్నారు. హైస్పీడ్ వైఫై, చార్జింగ్ పాయింట్లు, ప్రింటింగ్/స్కానింగ్ సౌకర్యాలు, వీడియో కాన్ఫరెన్సింగ్ సదుపాయాలు, ఎయిర్-కండిషన్ వసతి కలిగిన సైలెంట్ వర్క్పాడ్లు తదితర సౌకర్యాలు ఉంటాయి. ఇవేకాక ఆఫీసు తరహాలో టేబుల్, సౌకర్యవంతమైన కుర్చీలు, టీ, కాఫీ సదుపాయాలు, ఆధునిక టాయిలెట్లు, వాష్రూములు సైతం ఏర్పాటు చేస్తారు.ఒకవేళ సమయానికి భోజనం చేసి రాకుంటే భోజనం లేదా అల్పాహారం వంటి సౌకర్యాలూ కూడా ఉంటాయి. అయితే వీటన్నటికీ కొంత చార్జ్ చేస్తారు.
ఏర్పాట్లను బట్టి చార్జీలు
రైలు కోసం వేచి ఉండే సమయంలో లేదా రెండు రైళ్లు మారాల్సి వచ్చిన సమయంలో ఉండే గ్యాప్ లో ఈ సదుపాయాలను సద్వినియోగించుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్ను పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) విధానంలో అమలు చేసే అవకాశం ఉందని.. ఈ ఏర్పాట్లతో రైల్వేకు అదనపు ఆదాయం కూడా సమకూరుతుందని రైల్వే అధికారులు చెప్పారు. కాగా ముంబై సెంట్రల్ రైల్వేస్టేషన్లో ఏర్పాటు చేసిన డిజిటల్ లాంజ్.. రోజూ ఉదయం 7 నుంచి రాత్రి 11 గంటల వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. అక్కడ మొదటి గంటకు రూ.200, తర్వాత ప్రతి అదనపు గంటకు రూ.150 చొప్పున చెల్లించి.. డిజిటల్ లాంజ్, కో-వర్కింగ్ స్పేస్ సదుపాయాన్ని వినియోగించుకోవడానికి అవకాశం ఉంది. ఇక సికింద్రాబాద్ స్టేషన్లోనూ ఏర్పాట్లను బట్టి చార్జీలను నిర్ణయించే అవకాశం ఉందని రైల్వే అధికారులు తెలిపారు.
Follow Us