దేశం ఒక విశిష్ట వ్యక్తిని కోల్పోయింది అని అన్నారు ప్రధాని మోదీ. శ్వాసకోశ సంబంధిత సమస్యతో బాధపడుతున్న మన్మోహన్ సింగ్ ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మన్మోహన్ సింగ్ మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ఎంతో నిరాడంబరంగా ఉండే ఆయన ఆర్థికవేత్తగా ఎదిగారు. దేశ ఆర్థిక విధానంపై ఎన్నో ఏళ్లుగా బలమైన ముద్రవేశారు. పార్లమెంట్లో ఆయన ప్రసంగాలు గొప్పగా ఉండేవి. ప్రధానిగా దేశ ప్రజల జీవితాలు మెరుగుపరిచేందుకు ఎంతో కృషి చేశారు అని ప్రధాని మోదీ మన్మోహన్ను గొప్పతనాన్ని తలుచుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. విద్య, పరిపాలనను సమానంగా విస్తరింపజేసిన అరుదైన రాజకీయ నాయకుల్లో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఒకరు. భారత ఆర్థిక వ్యవస్థను సంస్కరించడంలో కీలకపాత్ర పోషించారు. దేశానికి ఆయన చేసిన సేవ, ఆయన రాజకీయం జీవితం, వినయంతో కూడిన నడవడిక ఎప్పటికీ గుర్తుండిపోతాయి అని రాష్ట్రపతి ద్రౌది ముర్ము అన్నారు. ఆయన మృతి దేశానికి తీరని లోటని అన్నారు. రాహుల్ గాంధీ.. నా మార్గదర్శని కోల్పోయానని రాహుల్ గాంధీ అన్నారు. జ్ఞానం, సమగ్రతతో మన్మోహన్ సింగ్ దేశాన్ని నడిపించారు. ఆర్థికశాస్త్రంలో ఆయన లోతైన అవగాహన దేశానికి స్ఫూర్తి. మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అని చెప్పారు రాహుల్ గాంధీ. సీఎం చంద్రబాబు.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు సంతాప తెలియజేశారు. ఆయన మృతి దేశానికి తీరని లోటని అన్నారు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలిపారు చంద్రబాబు. సీఎం రేవంత్ రెడ్డి.. మన్మోహన్ సింగ్ గొప్ప ఆర్థికవేత్త, రాజకీయ నాయకుడు, మానవతావాది. ఆయన తీసుకున్న అసామాన్య నిర్ణయాల్లో మానవతా దృక్పథం కూడా ఒకటి. మన్మోహన్సింగ్.. అసలైన నవభారత నిర్మాత. భరతమాత ఓ గొప్ప కుమారుడిని కోల్పోయింది అంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలియజేశారు.