ఆపరేషన్ సిందూర్ తర్వాత ప్రధాని మోదీ మొదటిసారిగా జాతినుద్దేశించి ప్రసంగించారు. భారత్కు వ్యతిరేకంగా పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తోందని ధ్వజమెత్తారు. ఆపరేషన్ సిందూర్తో పాక్కు ఒక కొత్త తరహాలో జవాబు చెప్పామన్నారు. ఉగ్రవాదులు దాడి చేస్తే ఇకనుంచి ఇదే తరహాలో స్పందిస్తాని తేల్చిచెప్పారు. ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తూ పాక్ తోకజాడిస్తే అంతం చేస్తామని హెచ్చరించారు. '' మన భద్రతా బలగాలకు నా సెల్యూట్. పహల్గాం ఘటన చాలా దారుణమైనది. కుటంబ సభ్యుల ముందే కాల్చి చంపేశారు. దేశంలో సామరస్యాన్ని దెబ్బతీసేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించారు. భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ఒక పేరు మాత్రమే. మన భావోద్వేగానికి ప్రతిరూపం. ఈ ఆపరేషన్లో మన బలగాలు ఎంతో ధైర్యాన్ని ప్రదర్శించాయి.
Also Read: పాకిస్తాన్ వాడింది చైనా మిస్సైల్స్, టర్కీ డ్రోన్లు.. సాక్ష్యాలు ఇవే!
పాక్ గుండెల్లో బాంబు పేల్చాం
ఉగ్రవాదులను మట్టిలో కలిపేందుకు సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం. ఆపరేషన్ సిందూర్ న్యాయం కోసం చేసిన ఓ ప్రతిజ్ఞ. ఏడో తేది ఈ ప్రతిజ్ఞ నెరవేరడం ప్రపంచమంతా చూసింది. భారత సైన్యం పాకిస్థాన్లో ఉన్న ఉగ్రస్థావరాలపై దాడులు చేసింది. వందమంది ఉగ్రవాదులను మట్టుపెట్టాం. భారత్కు వ్యతిరేకంగా పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తోంది. ఒకే ఒక్క దాడితో పాకిస్థాన్ బెంబెలెత్తిపోయింది.పాకిస్థాన్ మిసైల్స్ మన రక్షణ వ్యవస్థ ముందు తేలిపోయాయి. ఉగ్రవాదులను అంతం చేయాల్సిన పాకిస్థాన్ మనపై ఎదురుదాడులు చేసింది. పాఠశాలలు, ఆస్పత్రులు, గురుద్వార్లను లక్ష్యంగా చేసుకుంది. కానీ మనం పాక్ గుండెల్లో బాంబు పేల్చాం.
ఉగ్రవాదుల వెనుక పాక్ ఆర్మీ
పాకిస్థాన్లో ఉన్న ఎయిర్బేస్లకు తీవ్రంగా నష్టం చేశాం.మన దాడితో పాక్ ఆత్మరక్షణలో పడిపోయింది. ఆపరేషన్ సిందూర్ కేవలం నిలిపివేశాం. పాక్ చర్యలను బట్టి మన స్పందన ఉంటుంది. త్రివిధ దళాలు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉన్నాయి. సర్జికల్ స్ట్రైక్, ఎయిర్ స్ట్రైక్ తర్వాత ఆపరేషన్ సిందూర్ చేపట్టాం. అణు బ్లాక్ మెయిల్ను భారత్ సహించదు. అణ్వాయుధాలు అడ్డుపెట్టుకొని ఉగ్రవాదానికి పాల్పడుతామంటే చూస్తూ ఊరుకోం. చనిపోయిన ఉగ్రవాదులను చూసి పాకిస్థాన్ ఆర్మీ ఆఫీసర్లు కన్నీరు పెట్టుకున్నారు. దీన్నిబట్టి చూస్తే ఉగ్రవాదుల వెనుక పాక్ ఆర్మీ అధికారులు ఉన్నట్లు అర్థమవుతోంది. బహవల్పూర్, మురిద్కే వంటి ఉగ్రవాద కేంద్రాలు చాలా కాలంగా ప్రపంచ ఉగ్రవాదానికి నిలయాలుగా పనిచేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగిన అనేక ప్రధాన ఉగ్రవాద దాడులు ఈ ప్రదేశాల నుంచే జరిగాయి.
Also Read: యుద్ధంపై భారత్, పాక్కు నేనిచ్చిన వార్నింగ్ ఇదే.. ట్రంప్ సంచలనం!
అలా చేస్తే పాక్ అంతం
ఆపరేషన్ సిందూర్తో పాక్కు ఒక కొత్త తరహాలో జవాబు చెప్పాం. ఉగ్రవాదులు దాడి చేస్తే ఇకనుంచి ఇదే తరహాలో స్పందిస్తాం. ఉగ్రవాదం ఏరోజుకైనా పాకిస్థాన్ నాశనం చేస్తుంది. ఈరోజు బుద్ధ పూర్ణిమ. బుద్ధుడు మనకు శాంతిమార్గాన్ని చూపించాడు. అదే మనకు ఆదర్శం. ఉగ్రవాదాన్ని మట్టుబెడితేనే పాకిస్థాన్కు మనుగడ ఉంటుంది. ఉగ్రవాద, వాణిజ్యం కలిసి కొనసాగలేవు. ఉగ్రవాదం ఉన్నంతవరకు పాక్తో చర్చలు ఉండవు. ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తూ పాక్ తోకజాడిస్తే అంతం చేస్తాం. పాకిస్థాన్తో చర్చలుంటే అది కేవలం పీఓకే మీదే ఉంటాయి. ఇది యుద్ధాల యుగం కాదు, అలాగే ఉగ్రవాదుల యుగం కూడా కాదు. ప్రభుత్వం మద్దతుతో నడుస్తున్న ఉగ్రవాదానికి పాకిస్థాన్ ఫుల్స్టాప్ పెట్టాల్సిందే. లేకపోతే పాక్ అంతమవుతుందని తీవ్రంగా హెచ్చరిస్తున్నాను. మన ఐక్యమత్యమే మనకు బలమని'' ప్రధాని మోదీ అన్నారు.
pm modi | telugu-news | national | operation Sindoor