/rtv/media/media_files/2025/08/04/nimisha-priya-2025-08-04-16-56-42.jpg)
Nimisha Priya
యెమెన్లోని హత్య కేసులో కేరళకు చెందిన నర్సు నిమిషాప్రియకు ఉరిశిక్షను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. జులై 16న ఆమెకు ఉరిశిక్ష అమలుచేయాలని అక్కడి అధికారులు నిర్ణయించారు. కానీ చివరి నిమిషంలో దాన్ని వాయిదా వేశారు. నిమిష ప్రియకు ఈ శిక్ష నుంచి తప్పించేందుకు మృతుడి కుటుంబం కూడా సానుకూలంగా ఉందనే వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ కేసులో మరో బిగ్ట్విస్ట్ చోటుచేసుకుంది. హత్యకు గురైన తలాల్ అబ్దో మహ్ది సోదరుడు అబ్దుల్ ఫత్తాహ్ తాజాగా యెమెన్ అధికారులకు లేఖ రాశారు. నిమిషప్రియకు వెంటనే ఉరిశిక్షను అమలు చేయాలని, దీనికోసం ఓ తేదీని ఖరారు చేయాలని డిమాండ్ చేశారు.
Also Read: కొడుకు కాలేజీ ఫీజు కట్టలేక.. నిరాశ చెంది తండ్రి ఏం చేశాడంటే?
ఇక వివరాల్లోకి వెళ్తే.. మళయాళ మీడియా సంస్థ చెప్పిన వివరాల ప్రకారం తలాల్ సోదరుడు ఫత్తాహ్.. యెమెన్ అటార్నీ జనరల్ జడ్జి అబ్దుల్ సలామ్ అల్ హౌతీకి లేఖను పంపించారు. అందులో తమ కుటుంబం నిమిషప్రియకు క్షమాభిక్ష ఇవ్వమని స్పష్టంగా వివరించారు. తమకు ఎలాంటి బ్లడ్ మనీ (పరిహారం) తీసుకునే ఉద్దేశం కూడా లేదని అన్నారు. నేరం చేసినందుకు ప్రతీకార శిక్షే విధించాలని స్పష్టం చేశారు. దీంతో నిమిషాప్రియ కేసు మరో మలుపు తిరిగింది. ఈ లేఖతో యెజెన్ అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనేదానిపై ఉత్కంఠ నెలకొంది. నిమిషప్రియ కుటుంబం కూడా ఆమెను కాపాడేందుకు అనేక ప్రయత్నాలు చేస్తోంది.
నిమిషా ప్రియా కేసు ఏంటి ?
నిమిషా ప్రియా స్వస్థలం కేరళలోని పళక్కాడ్. 2008లో ఆమె యెమెన్కు వెళ్లాడు. ఆ దేశ రాజధాని అయిన సనా నగరంలో ప్రభుత్వ ఆస్పత్రిలో కొంతకాలం నర్సుగా పనిచేశారు. ఆ తర్వాత మరింత ఆదాయం కోసం ఆ దేశ పౌరుడు తలాల్ అనే వ్యక్తితో కలిసి ఓ ప్రైవేట్ క్లినిక్ను స్థాపించారు. ఆ తర్వాత కొన్నిరోజులకి తలాల్ నిమిషాను మానసికంగా, శారీరకంగా వేధించాడని, పాస్పోర్టు లాక్కున్నాడని ఆమె తరఫు న్యాయవాదులు చెబుతున్నారు. అతడి నుంచి తప్పించుకునేందుకు నిమిషా.. తలాల్కు మత్తు మందు ఇచ్చింది. అయితే మోతాదుకు మించి మందు ఇవ్వడంతో అతడు మృతి చెందాడు. ఆ తర్వాత తలాల్ శరీర భాగాలు ఓ వాటర్ ట్యాంక్లో దొరికాయి. చివరికి పోలీసులు ఆమెను 2019లో అరెస్టు చేశారు.
Also Read: పహల్గామ్ ఉగ్రదాడి పక్కా పాక్ పనే.. POKలో టెర్రరిస్ట్ అంత్యక్రియలే ఆధారాలు
ఇటీవల యెమెన్ కోర్టు ఆమెకు జులై 16న ఉరిశిక్ష విధించింది. కానీ చివరి నిమిషంలో ఈ మరణశిక్షను యెమెన్ అధికారులు వాయిదా వేశారు. మరోవైపు నిమిషా ప్రియాను రక్షించేందుకు భారత విదేశాంగ సైతం అన్ని మార్గాల్లో ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం యెమెన్లో యుద్ధ పరిస్థితులు, భద్రతా అనిశ్చితి నెలకొంది. దీంతో ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ ప్రతినిధులకు అక్కడికి వెళ్లేందుకు అవకాశం రాలేదు. మరోవైపు భారత ప్రభుత్వం, కొంతమంది సామాజిక కార్యకర్తలు తలాల్ ఫ్యామిలీకి బ్లడ్ మనీ చెల్లించేందుకు యత్నించారు. కానీ ఆ కుటుంబం దీనిపై స్పందించలేదు. తాజాగా తలాల్ సోదరుడు నిమిషా ప్రియను ఉరితీయాలని లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరి ఆమెకు ఉరిశిక్ష అమలు చేస్తారా ? లేదా ? అనేదానిపై ఆందోళన నెలకొంది.