/rtv/media/media_files/2025/06/13/yDxZczaLJOKMmdxC9gTG.jpg)
Plane Crash
Plane Crash : గురువారం అహ్మదాబాద్లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో సుమారు 241 మంది ప్రయాణికులు మరణించారు.ఈ ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా మరణించారు. రూపానీ గతంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన 2016 - నుంచి 2021 సెప్టెంబరు12 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయనలాగే ఇప్పటివరకు ఇలా విమాన, హెలికాప్టర్ ప్రమాదాల్లో మరణించిన నేతల గురించి తెలుసుకుందాం.
బల్వంత్రాయ్ మెహతా
రాజకీయ నాయకులు విమాన, హెలికాప్టర్ ప్రమాదాల్లో మరణించడం అనేది గుజరాత్ నుంచే మొదలవ్వడం గమనార్హం. గుజరాత్ ఏర్పడిన తర్వాత రాష్ర్టానికి రెండవ ముఖ్యమంత్రిగా పనిచేసిన బల్వంత్రాయ్ మెహతా హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఆయన 1965 యుద్ధ సమయంలో మెహతా భారత్- పాకిస్తాన్ సరిహద్దు సమీపంలో అధికారిక పర్యటనలో పాల్గొన్నారు. ఆ సమయంలో పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన ఓ జెట్ పొరపాటున మెహతా ప్రయాణిస్తున్న హెలికాప్టర్ను ఢీకొట్టింది. దీంతో మెహతా అక్కడికక్కడే మరణించారు.
వైఎస్ రాజశేఖర రెడ్డి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా హెలికాప్టర్ ప్రమాదంలో మరణించాడు. ఈయన 2009 సెప్టెంబర్ 2 నల్లమల అడవుల్లోని పావురాల గుట్ట వద్ద జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు హెలికాప్టర్ లో వెళ్తుండగా వాతావరణం అనకూలించక ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆయనతో పాటు హెలికాప్టర్ లో ఉన్న వారు కూడా ప్రాణాలు కోల్పోయారు.
మాధవ్రావు సింధియా
విమాన ప్రమాదంలో మరణించిన ప్రముఖ రాజకీయ నాయకుల్లో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తండ్రి, మాధవరావు సింధియా కూడా ఒకరు. ఓ ర్యాలీలో పాల్గొనడానికి 2001 సెప్టెంబర్ 30న ఉత్తరప్రదేశ్కు చార్టర్ విమానంలో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. దీంతో ఉత్తరప్రదేశ్లోని మెయిన్పురి జిల్లాలో ఆయన మరణించారు. ఈ ప్రమాదంలో ఆయనతో పాటు విమానంలో ప్రయాణిస్తున్న మరికొంతమంది కూడా ప్రాణాలు కోల్పొయారు.
సంజయ్ గాంధీ
విమాన ప్రమాదాల్లో మరణించిన వారిలో ప్రముఖంగా వినపడే పేరు సంజయ్ గాంధీ. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ కుమారుడైన సంజయ్ గాంధీ1980 జూన్ 23న ఢిల్లీలో జరిగిన విమాన ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. సంజయ్ గాంధీ జెట్విమానంలో ఏరోబాటిక్ విన్యాసం చేస్తున్న సమయంలో విమానం నియంత్రణ కోల్పోయింది. అది ఢిల్లీలోని డిప్లొమాటిక్ ఎన్క్లేవ్లో కూలిపోయింది.ఈ ప్రమాదంలో సంజయ్ గాంధీతో పాటు మరో కెప్టెన్ సుభాష్ సక్సేనా కూడా మరణించాడు.
గుర్నామ్ సింగ్
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి గుర్నామ్ సింగ్ కూడా విమాన ప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకున్నారు. గుర్నామ్ సింగ్ పంజాబ్కు 6వ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 8 మార్చి 1967 నుండి 25 నవంబర్ 1967 వరకు, మళ్ళీ 17 ఫిబ్రవరి 1969 నుండి 27 మార్చి 1970 వరకు సీఎంగా పనిచేశారు. ఆయన 1973న మే 31న ఢిల్లీలో జరిగిన విమాన ప్రమాదంలో మరణించారు.
జిఎంసి బాలయోగి
నాటి లోక్సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన రాజకీయ నాయకుల్లో ముఖ్యులు. బాలయోగి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ గాలిలో ఉండగానే సాంకేతిక సమస్య కారణంగా ప్రమాదానికి గురైంది.దీంతో2002 మార్చి 3న ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
దోర్జీ ఖండు
హెలికాప్టర్ ప్రమాదాల్లో మరణించిన నాయకుల్లో మరో వ్యక్తి నాటి అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి డోర్జీ ఖండు. ఈయన 2011 ఏప్రిల్ 30న చైనా సరిహద్దుకు సమీపంలోని మారుమూల ప్రాంతంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఆయన రెండు సార్లు అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు.
ఓపీ జిందాల్
హర్యానా ప్రభుత్వంలో విద్యుత్ మంత్రిగా పనిచేసిన ఓపీ జిందాల్ కూడా హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఈయన 2005 మార్చి 31న ఉత్తరప్రదేశ్లోని సహరాన్పూర్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.