/rtv/media/media_files/2025/02/08/UYKocODbyi9RE8AIhSPC.jpg)
Arvind Kejriwal
ఢిల్లీలో 2013 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈసారి ఢిల్లీ ప్రజలు తమ మనసును మార్చుకున్నారు. ఆప్కు ప్రత్యమ్నాయంగా బీజేపీకి అధికార బాధ్యతలు అప్పగించారు. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏంటంటే ఆప్ అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, అలాగే సీనియర్ నేత సత్యేంద్ర జైన్.. ఈ ముగ్గురు కీలక నేతలు ఓడిపోయారు.
చాలాకాలంగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలల్లో గెలిచేందుకు బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తూ వస్తోంది. కానీ అవి ఫలించలేదు. చివరికీ ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ఆ పార్టీకి కలిసొచ్చాయి. మొత్తానికి 27 ఏళ్ల తర్వాత బీజేపీ అధికారంలో వచ్చింది. ప్రస్తుతం ఢిల్లీ ఎన్నికల ఫలితాలు దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అరవింద్ కేజ్రీవాల్ కూడా ఆప్ ఓటమిపై స్పందించారు. గెలిచిన బీజేపీ నేతలకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే బీజేపీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు.
ప్రజల తరఫున తమ పొరాటం ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో ఆప్ ఓటమితో పాటు ముఖ్యంగా కేజ్రీవాల్ ఓడిపోవడం పార్టీకి పెద్ద ఎదురుదెబ్బే తగిలింది. దీంతో అరవింద్ కేజ్రీవాల్ మరిన్ని సవాళ్లు ఎదుర్కోనున్నట్లు కనిపిస్తోంది. ఇప్పుడు అవేంటో తెలుసుకుందాం.
వెంటాడుతున్న లిక్కర్ స్కామ్ కేసు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొన్న అరవింద్ కేజ్రీవాల్ను 2024 మార్చి 21న ఎన్ఫోర్స్ డైరెక్టరేట్ (ED) అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కొన్ని నెలల పాటు ఆయన విచారణలో భాగంగా తీహార్ జైల్లోనే గడిపారు. చివరికి అదే ఏడాది సెప్టెంబర్లో సుప్రీంకోర్టు కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. అయితే ఇప్పటికీ లిక్కర్ కేసులో కేజ్రీవాల్ నిందితుడిగానే ఉన్నారు. కాబట్టి ఆయన మళ్లీ ఎప్పుడైనా అరెస్టు కావొచ్చనే ప్రచారం నడుస్తోంది. ఇక కేంద్రంలో, ఢిల్లీలో బీజేపీదే అధికారం కాబట్టి ఆయన్ని ఈ కేసులో మరింత ఇబ్బంది పెట్టే అవకాశాలున్నాయి.
పార్టీ నాయకత్వం మారుస్తారా ?
2012 అక్టోబర్ 2న ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. కానీ కేజ్రీవాల్ ఒక్కరే ఈ పార్టీని స్థాపించలేదు. ఆయనతో పాటు షాజియా లిమి, యోగేంద్ర యాదవ్, ప్రముఖ సుప్రీంకోర్టు లాయర్ ప్రశాంత్ భూషణ్, ఆనంద్ కుమార్ లాంటి వారు కలిసి ఈ పార్టీని ప్రారంభించారు. అయితే అప్పటినుంచి ఆఫ్ అధినేతగా కేజ్రీవాలే ముందుండి నడిపిస్తున్నారు. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్తో కలిసి ఆప్ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత 2015, 2020 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వరుసగా గెలిచింది. అప్పటి నుంచి కేజ్రీవాల్ సీఎంగా ఉంటూ వస్తున్నారు. ఈసారి ఎన్నికలకు ముందు లిక్కర్ స్కామ్ కేసు వల్ల కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కానీ తాజాగా జరిగిన ఎన్నికల్లో ఆప్ ఓడిపోవడం, ముఖ్యంగా కేజ్రీవాల్ ఓడిపోవడం సంచలనం రేపింది. మరీ ఇప్పుడు కేజ్రీవాలే ఆప్ జాతీయ కన్వీనర్గా ఉంటారా ? లేదా వాళ్లకి ఈ అవకాశం వస్తుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. పార్టీ నేతల నుంచి ఒత్తిడి వస్తే.. ఆయన స్థానంలో వేరే వారికి కూడా అవకాశం దక్కొచ్చనే ఊహాగాణాలు వినిపిస్తున్నాయి.
పంజాబ్లో కూడా దెబ్బే
పంజాబ్లో 2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ గెలిచిన సంగతి తెలిసిందే. కేజ్రీవాల్ ప్రభావంతోనే అక్కడ ఆప్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఢిల్లీలో పార్టీతో పాటు అరవింద్ కేజ్రీవాల్ కూడా ఓడిపోవడం పెద్ద మైనస్. దీంతో పంజాబ్లో రాబోయే రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో ఆప్ ప్రభావం తగ్గిపోవచ్చు.
ఫలించని కేజ్రీవాల్ లక్ష్యం
ఎన్నో ఏళ్ల నుంచి దేశంలో బీజేపీ, కాంగ్రెస్ బలమైన జాతీయ పార్టీలుగా కొనసాగుతున్నాయి. కేంద్రంలో అధికారంలోకి వస్తే బీజేపీ లేదా కాంగ్రెస్.. ఈ రెండు పార్టీలే ఎక్కువగా దేశాన్ని పాలించాయి. ఈ రెండు పార్టీలకు బలమైన ప్రత్యమ్నాయంగా ఇంకా ఏ పార్టీ రాలేదు. అయితే పంజాబ్లో ఆప్ గెలవడంతో కేజ్రీవాల్ ఆశలు చిగురించాయి. బీజేపీ, కాంగ్రెస్కు ప్రత్యమ్నాయంగా ఆప్ను మార్చాలని కేజ్రీవాల్ లక్ష్యం పెట్టుకున్నారు. ఇందుకోసం ఇండియా కూటమిలో కూడా జతకట్టారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్తో కలిసి పోటీ చేశారు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం విడిపోయారు. చివరికీ ఈ ఎన్నికల్లో ఆప్ పరాజయం పొందింది. దీంతో ఆప్ను మరో ప్రత్యమ్నాయ జాతీయ పార్టీగా మర్చాలన్న ఆశలు ఆవిరైపోయాయి.
కొత్త కేసులు రావొచ్చేమో
కేజ్రీవాల్ ఇప్పటికే లిక్కర్ కేసును ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అలాగే ఢిల్లీ వాటర్ స్కామ్, ఇతర కుంభకోణాలపై కూడా అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఇప్పుడు మళ్లీ కేజ్రీవాల్పై ఇంకా ఏవైనా కొత్త కేసులు పెడతారా అనే అనుమానం కూడా వస్తోంది. ఇప్పటికే బీజేపీ.. ఆప్ అవినీతిపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. దీంతో రాబోయే రోజుల్లో కేజ్రీవాల్ ఇతర కేసుల్లో ఇరుక్కుంటారా అనేది కూడా ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.