గత కొన్నేళ్లుగా చర్చనీయాంశమవుతున్న జమిలి ఎన్నికల బిల్లు ఎట్టకేలకు పార్లమెంటులోకి వచ్చింది. ఇందుకోసం ప్రతిపాదించిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లు-2024, కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు-2024ను కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టారు. అయితే ఈ రెండు బిల్లులకు 269 మంది ఎంపీలు అనుకూలంగా ఓటు వేశారు. మరో 198 మంది ఎంపీలు ఈ బిల్లులకు వ్యతిరేకంగా ఓటేశారు. కొత్త పార్లమెంటు భవనంలో తొలిసారిగా ఎలక్ట్రానిక్ విధానంలో ఈ ఓటింగ్ జరిగింది.
ఈ రెండు బిల్లులను జాయింట్ పార్లమెంటరీ కమిటీ(JPC)కి పంపనున్నారు. అయితే ఈ బిల్లులు ప్రవేశపెట్టడానికి ముందు అధికార, విపక్ష ఎంపీల మధ్య వాగ్వాదం జరిగింది. కాంగ్రెస్, సమాజ్వాదీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీల ఎంపీలు ఈ బిల్లులను వ్యతిరేకించారు. దేశంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం అనేది ప్రజాస్వామ్య మౌలిక వ్యవస్థపై దాడి చేయడమేనని కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారి అన్నారు. ఈ బిల్లులను ఉపసంహరించుకోవాలంటూ డిమాండ్ చేశారు.
Also read: రాష్ట్రపతి రాకతో ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ రూట్లలో వెళ్లొద్దు
జమిలి ఎన్నికల అనేవి దేశంలో నియంతృత్వ పాలన వైపు నడిపేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నమని సమాజ్వాదీ పార్టీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్ విమర్శించారు. విపక్ష నేతల విమర్శలపై కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ స్పందించారు. జమిలి ఎన్నికల అంశం కొత్తదేమి కాదని.. 1983 నుంచే ఈ ఎన్నికలు జరపాలనే డిమాండ్ ఉందని పేర్కొన్నారు. ఇది రాజ్యాంగ స్వరూపానికి, రాష్ట్ర హక్కులకు, సమాఖ్య స్పూర్తికి భంగం కాదని స్పష్టం చేశారు. జర్మనీ, స్వీడన్ లాంటి దేశాల్లో కూడా ఇలాంటి జమిలి ఎన్నికలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
ఇదిలాఉండగా.. 2029లో జమిలి ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం యోచిస్తోంది. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతానికి స్థానిక సంస్థల ఎన్నికల అంశాన్ని కేంద్రం పక్కన పెట్టింది. అయితే 2034 నాటికి స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జమిలి పరిధిలోకి రానున్నాయని అధికారక వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు జమిలి ఎన్నికలకు ఉన్న అడ్డంకులను కూడా కేంద్రం పరిశీలిస్తోంది. ఇతర రాజకీయ పార్టీలను ఒప్పించి.. రాజ్యంగ సవరణలు జరిగేలా చూడడంపై కేంద్రం ఫోకస్ పెట్టింది.
Also Read: కేటీఆర్ నేను బాగా క్లోజ్.. దివ్వెల మాధురి సంచలన వ్యాఖ్యలు!
అలాగే జనాభా లెక్కల సేకరణ, నియోజకవర్గాల పునర్విభజనను కూడా 2029లోపు పూర్తి చేయాలని మోదీ సర్కార్ భావిస్తోంది. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది(2025)లో జనాభా లెక్కల సేకరణ, 2027 నాటికి నియోజకవర్గాల పునర్విభజన, అలాగే మహిళ రిజర్వేషన్ బిల్లును అమలు చేసే ప్రక్రియను పూర్తిచేయాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: లోక్సభలో జమిలి ఎన్నికల బిల్లు.. ప్రవేశపెట్టిన న్యాయశాఖ మంత్రి
Also Read: తానుపారిపోవాలని అనుకోలేదు.. మొదటిసారి స్పందించిన అసద్