Anthropic AI Tool: ఏఐ రంగంలో మరో సంచలనం.. ఆంత్రోపిక్ టూల్‌తో సాఫ్ట్‌వేర్‌ మార్కెట్లు ఢమాల్

ఏఐ రంగంలో అగ్రగ్రామి సంస్థ అయిన ఆంత్రోపిక్‌.. తాజాగా సరికొత్త ఏఐ టూల్‌ను విడుదల చేసింది. క్లాడ్ కోవర్క్ పేరుతో విడుదల చేసిన ఈ టూల్‌ కేవలం సమాధానాలు ఇవ్వడమే కాకుండా.. ఓ మనిషిలాగే సంక్లిష్టమైన, వృత్తిపరమైన పనులను పూర్తి చేయగలదు. 

New Update
What is Anthropic’s new legal AI tool and why investors are dumping software stocks

What is Anthropic’s new legal AI tool and why investors are dumping software stocks

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. ఎప్పటికప్పుడూ కొత్త కొత్త టూల్స్ పుట్టుకొస్తున్నాయి. ప్రస్తుతం అనేక రంగాల్లో ఏఐని వాడేస్తున్నారు. ముఖ్యంగా ఐటీ రంగంలో ఏఐ వల్ల చాలా కంపెనీలు లేఆఫ్స్‌ ప్రకటిస్తున్నాయి. ఇలాంటి తరుణంలోనే తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏఐ రంగంలో అగ్రగ్రామి సంస్థ అయిన ఆంత్రోపిక్‌.. తాజాగా సరికొత్త ఏఐ టూల్‌ను విడుదల చేసింది. క్లాడ్ కోవర్క్ పేరుతో విడుదల చేసిన ఈ టూల్‌ కేవలం సమాధానాలు ఇవ్వడమే కాకుండా.. ఓ మనిషిలాగే సంక్లిష్టమైన, వృత్తిపరమైన పనులను పూర్తి చేయగలదు. 

Also Read: ట్రంప్ టారిఫ్‌ల తగ్గింపు.. 15 నిమిషాల్లోనే రూ. 13 లక్షల కోట్ల లాభం

ఆంత్రోపిక్ సంస్థ తన 'Claude' AI అసిస్టెంట్‌లో భాగంగా 'క్లాడ్ కోవర్క్' అనే కొత్త ఏజెంటిక్ టూల్‌ను, దానికి సంబంధించిన 11 ప్లగిన్‌లను విడుదల చేసింది. ఈ టూల్ వేల పేజీల న్యాయపరమైన డ్యాకుమెంట్లను నిమిషాల్లో స్కాన్ చేసి అందులోని లోపాలను గుర్తించగలదు. కంపెనీల మధ్య జరిగే సంక్లిష్టమైన ఒప్పందాలను రివ్యూ చేసి చట్టపరమైన రిస్క్‌ల గురించి హెచ్చరికలు జారీ చేయగలదు. గతంలో జూనియర్ లాయర్లు లేదా పారా లీగల్స్ చేసే పనులను ఇది 95 శాతం కచ్చితత్వంతో తక్కువ ధరకే పూర్తి చేస్తోంది. ఇది కేవలం లీగల్ విషయాలు మాత్రమే కాకుండా సేల్స్, మార్కెటింగ్, ఫైనాన్షియల్ అనాలిసిస్ లాంటి పనులను కూడా చేస్తోంది.

 సాఫ్ట్‌వేర్ షేర్లను విక్రయిస్తున్న ఇన్వెస్టర్లు

గతంలో కంపెనీలు తమ లీగల్ డాక్యుమెంట్ల కోసం లేదా డేటా అనాలిసిస్ కోసం థామ్సన్ రాయిటర్స్, లెక్సిస్‌నెక్సిస్, వోల్టర్స్ క్లువేర్ లాంటి ఖరీదైన సాఫ్ట్‌వేర్ సబ్‌స్క్రిప్షన్లను తీసుకునేవి. ఇవి చేసే పనులను ఆంథ్రోపిక్‌ ఏఐ టూల్‌ తక్కువ ధరకే చేస్తుండటంతో పాత సాఫ్ట్‌వేర్ కంపెనీల అవసరం తగ్గిపోతుందని ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఆ సాఫ్ట్‌వేర్ కంపెనీలు సబ్‌స్క్రిప్షన్ల నుంచే ఆదాయం పొందుతాయి. అయితే ఇప్పుడు ఏఐ రంగంలోకి దిగడంతో వాటి లాభాలు పడిపోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత ఐటీ కంపెనీలైన టీసీఎస్, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీలు అందించే 'లీగల్ ప్రాసెస్ అవుట్‌సోర్సింగ్' (LPO) సేవలకు కూడా భవిష్యత్తులో గిరాకీ తగ్గే ప్రమాదం ఉందని చెబుతున్నారు. అందుకే ఇన్వెస్టర్లు తమ సాఫ్ట్‌వేర్ షేర్లను విక్రయించేందుకు మొగ్గుచూపుతున్నారు. ఈ ఒక్క వార్త వల్ల ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్‌వేర్ రంగంలో సుమారు $285 బిలియన్ల (దాదాపు రూ.24 లక్షల కోట్లు) సంపద ఆవిరైపోవడం సంచలనం రేపుతోంది.

Also Read: మంచు దుప్పటి కప్పుకున్న నయాగారా జలపాతం.. ఇలా ఎందుకు మారిపోయిందో తెలుసా ?

సాఫ్ట్‌వేర్‌ మార్కెట్‌లో గందరగోళం నెలకొనడంతో ఆంత్రోపిక్ కూడా దీనిపై స్పందించింది. తమ లక్ష్యం మానవ మేధస్సును భర్తీ చేయడం కాదని.. దానికి తోడుగా ఉండటమని తెలిపింది. ఈ టూల్స్‌ నిపుణుల ఉత్పాదకతను పెంచుతాయని.. వృత్తిని దెబ్బతీయవని పేర్కొంది. ఇదిలాఉండగా మైక్రోసాఫ్ట్, గూగుల్ లాంటి బడా సంస్థల ఏఐ టూల్స్ కంటే ఆంత్రోపిక్ ఏజెంట్లు వేగంగా పనులు పూర్తి చేస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.