/rtv/media/media_files/2025/02/10/7b4l96AXcLDD4qXeVJEK.jpg)
hajj Photograph: (hajj )
HAJJ 2025: 2025లో హజ్ యాత్రకు సంబంధించి సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు యాత్రికులతో పాటు పిల్లలను తీసుకెళ్లడంపై నిషేధం విధించింది. సౌదీ అరేబియా హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ దీనికి సంబంధించిన ప్రకటన విడుదల చేసింది. తీవ్రమైన రద్దీ కారణంగా ప్రతి సంవత్సరం పిల్లలు ఎదుర్కొంటున్న ప్రమాదాల నుండి వారిని రక్షించడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. 'పిల్లల భద్రత, శ్రేయస్సు కోసం హజ్ యాత్ర సమయంలో ఎలాంటి హాని జరగకుండా ఉండటమే మా లక్ష్యం' అని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇంతకు ముందు ఎప్పుడూ హజ్ కు రానివారికి ఈ సంవత్సరం హజ్లో పాల్గొనడానికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది.
ఆన్లైన్ పోర్టల్ ద్వారా బుకింగ్..
ఈ మేరకు 2025 సంవత్సరంలో జరిగే హజ్ సీజన్ కోసం అధికారిక రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. సౌదీ పౌరులు నివాసితులు.. నుసుక్ యాప్ లేదా అధికారిక ఆన్లైన్ పోర్టల్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు. తమ వివరాలతోపాటు తమవెంట వచ్చే స్నేహితుల డిటెయిల్స్ కూడా ఇందులో జోడించాలి. యాప్ ద్వారా ప్రారంభమైన హజ్ ప్యాకేజీల అమ్మకాలకు ముందుగానే సిద్ధంగా ఉండాలని మంత్రిత్వ శాఖ నొక్కి చెప్పింది. యాత్రికులు తమకు నచ్చిన ప్యాకేజీని ఎంచుకోవచ్చు. దేశీయ యాత్రికులు తమ హజ్ ప్యాకేజీని మూడు వాయిదాలలో చెల్లించవచ్చు అని తెలిపింది.
భారతీయులకు నిబంధనలు మారాయి..
సౌదీ అరేబియా తన వీసా విధానంలో పెద్ద మార్పు చేసింది. భారతదేశంతో సహా 14 దేశాల నుండి వచ్చే వ్యక్తులకు సింగిల్ ఎంట్రీ వీసా పరిమితం చేశారు. ఈ మార్పులు ఫిబ్రవరి 1, 2025 నుండి అమల్లోకి వస్తాయని తెలిపింది. చట్టవిరుద్ధంగా హజ్ యాత్రకు వచ్చే వారిని ఆపడమే ఈ మార్పు ఉద్దేశ్యమని, వాస్తవానికి, సౌదీ అరేబియాకు బహుళ ప్రవేశ వీసా ఉన్న వ్యక్తులు హజ్ సమయంలో దేశానికి చేరుకుంటారట. రిజిస్ట్రేషన్ లేకుండా హజ్కు ప్రయాణిస్తున్నారట. దీని కారణంగా హజ్ సమయంలో యాత్రా స్థలాల వద్ద భారీ రద్దీ ఉంటుందని పేర్కొంది.
ఈ దేశాలు ప్రభావితమవుతాయి..
సౌదీ అరేబియా కొత్త వీసా నియమం అల్జీరియా, బంగ్లాదేశ్, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండియా, ఇండోనేషియా, ఇరాక్, జోర్డాన్, మొరాకో, నైజీరియా, పాకిస్తాన్, సూడాన్, ట్యునీషియా యెమెన్ దేశాల ప్రజలను ప్రభావితం చేస్తుంది. ఈ దేశాల నుంచి పర్యాటకం, వ్యాపారం, కుటుంబ సందర్శనల కోసం సౌదీ ప్రభుత్వం ఒక సంవత్సరం బహుళ ప్రవేశ వీసాలను నిరవధికంగా నిలిపివేసింది. కొత్త నిబంధన ప్రకారం, ప్రభావిత దేశాల ప్రజలు 30 రోజుల పాటు చెల్లుబాటు అయ్యే సింగిల్ ఎంట్రీ వీసాకు మాత్రమే దరఖాస్తు చేసుకోగలరని సూచించింది.