/rtv/media/media_files/2025/06/11/8j0pIM3xYaNE5si1pdlF.jpg)
Everything we know about the Los Angeles protests
అక్రమ వలసదారుల ఏరివేతపై అమెరికా సర్కార్ చర్యలపై లాస్ ఏంజెల్స్ అట్టుడుకుతోంది. నాలుగో రోజు కూడా అక్కడ పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. లాస్ ఏంజెల్స్కు మరో 2 వేల మంది నేషనల్ గార్డ్స్ను తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఇప్పటికే 700 మంది నేషనల్ గార్డ్స్కు సాయంగా 700 మంది మెరైన్లను అమెరికా సర్కార్ మోహరించింది. మొత్తానికి ట్రంప్ ఆదేశాలతో లాస్ ఏంజెల్స్లో మోహరిస్తున్న నేషనల్ గార్డ్స్ సంఖ్య 4 వేలకు చేరనుంది.
మరోవైపు ట్రంప్ ఆదేశాలపై కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం 300 మందిని మాత్రమే ఇప్పటిదాకా వివిధ ప్రాంతాల్లో మోహరించారని, మిగతా వాళ్లందరూ కూడా ఫెడరల్ బిల్డింగ్స్లో ఖాళీగా ఉన్నారని పేర్కొన్నారు. అనేకసార్లు యుద్ధాల్లో సేవలందించిన మెరైన్లను, ట్రంప్ కోసం సొంత దేశస్తులకే వ్యతిరేకంగా పనిచేయడం కరెక్ట్ కాదన్నారు. నేషనల్ గార్డ్స్కు సరైన ఆహారం, నీరు లాంటి సదుపాయాలు కూడా కల్పించలేదని విమర్శలు చేశారు. అలాగే నేషనల్ గార్డ్స్ను మోహరించాలని ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై కాలిఫోర్నియా అటార్నీ జనరల్ రాబ్ బోంటా కోర్టును ఆశ్రయించాడు.
నిరసనలు ఎందుకు పెరిగాయి
ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటినుంచి అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అమెరికాలో అక్రమంగా ఉంటున్న మెక్సికో, భారత్తో పాటు వివిధ దేశాలకు చెందిన వాళ్లను ప్రత్యేక విమానాల్లో స్వదేశాలకు పంపించిన సంగతి తెలిసిందే. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలపై, ముఖ్యంగా వలసదారులను దేశం నుంచి వెళ్లగొట్టే విధానంపై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. అయితే ఇటీవల లాస్ ఏంజెల్స్లో అక్రమ వలసదారులపై ట్రంప్ చర్యలకు వ్యతిరేకంగా నిరసనలు రాజుకున్నాయి.
Also Read: ఇండియాలో తగ్గుతున్న జనాభా..పెరుగుతున్న అవగాహన
గత శుక్రవారం లాస్ ఏంజెల్స్లోని లాటినో ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ICE) అధికారులు సోదాలు నిర్వహించారు. వెస్ట్లేక్ డిస్ట్రిక్ట్తో పాటు పారామౌంట్లో ఈ కార్యకలాపాలు జరిగాయి. దీంతో అక్కడి స్థానికులు నిరసనలతో చెలరేగిపోయారు. ఆ తర్వాత మిగతా ప్రాంతాలకు కూడా విస్తరించింది. ముఖ్యంగా డౌన్టౌన్ ప్రాంతంలో జరిగిన అల్లర్లు సంచలనం రేపాయి. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తీవ్రతరమయ్యాయి.
అయితే నిరసనలు జరగడం లాస్ ఏంజెల్స్కు కొత్తేమి కాదు. గతంలోనూ ఇక్కడ తీవ్ర నిరసనలు చెలరేగాయిర. 1968లో ఇక్కడ తూర్పు ప్రాంతంలో 15వేల మంది విద్యార్థులు తరగతులను బహిష్కరించి ఆందోళనలకు దిగారు. తమను చిన్న చూపు చూస్తూ తెల్లవారికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారని మెక్సికన్ అమెరికన్ విద్యార్థులు నిరసనలు చేశారు. పాఠ్యాంశాలను మార్చాలని, ద్విభాషా విద్యను ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళన షికానో పౌర హక్కుల ఉద్యమానికి స్ఫూర్తినిచ్చింది.
Also Read: ఈ నెలలోనే అమెరికా, భారత్ మధ్యంతర డీల్..500 బిలియన్ డాలర్ల వాణిజ్య ఒప్పందం
ఆ తర్వాత 1992లో రాడ్నీ కింగ్ నిరసన లాస్ ఏంజెల్స్లో అతి పెద్ద ఆందోళనగా చరిత్రలో నిలిచిపోయింది. ఆఫ్రో అమెరికన్ మోటారిస్ట్ రాడ్నీ కింగ్ను హింసించిన నలుగురు శ్వేతజాతి అధికారులను నిర్దోషులుగా ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు ఆందోళనలకు దిగారు. వారంపాటు జరిగిన హింసాత్మక ఆందోళనల్లో 50 మంది చనిపోగా.. 2,000 మంది గాయపడ్డారు. ఈ గొడవల్లో అప్పటి అధ్యక్షుడు జార్జి బుష్ కూడా వేల మంది నేషనల్ గార్డ్స్, ఆర్మీ, మెరైన్ లను లాస్ ఏంజెల్స్లో మోహరించారు.
ఇక 2020లో జార్జ్ ఫ్లాయిడ్ హత్యను నిరసిస్తూ యూఎస్ లో దేశ వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. అందులో లాస్ ఏంజెలెస్ లో అత్యంత ఎక్కువగా గొడవలు అయ్యాయి. నగరం అట్టుడికింది. బ్లాక్ లైవ్స్ మ్యాటర్స్ పేరుతో జరిగిన ఈ ఆందోళనలకు ఈ నగరం కేంద్ర స్థానంగా నిలిచింది.