Bangladesh: కొంప ముంచిన కోటా – ప్రభుత్వాన్నే కూల్చింది..

బంగ్లాదేశ్‌లో చెలరేగిన ఆందోళనలతో ఆ దేశం అట్టుడుకిపోయింది. అల్లర్లలో వందల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. దాంతో పాటూ అక్కడి ప్రభుత్వం కూలిపోయింది. ఇదంతా అసలెలా జరిగింది పూర్తి కథనం..

New Update
Bangladesh: కొంప ముంచిన కోటా – ప్రభుత్వాన్నే కూల్చింది..

Bangladesh Government Fall Off: బంగ్లాదేశ్‌ కొన్ని రోజులుగా అల్లర్లు, నిరసనలతో ఉద్రిక్తంగా మారింది. ఉద్యోగాలు లేక అసహనంతో ఉన్న విద్యార్థులు ప్రభుత్వం తెచ్చిన రిజర్వేషన్‌ వ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకించారు. 1971లో దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడినవారి కుటుంబ సభ్యులకు 30 శాతం కోటా కల్పిస్తూ ప్రభుత్వం రిజర్వేషన్లను ప్రవేశపెట్టింది. దీన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థులు తీవ్ర నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ప్రస్తుత విధానం ప్రకారం.. 1971లో బంగ్లాదేశ్‌ విముక్త పోరాటంలో అసువులు బాసిన వారి పిల్లలకు, మనవళ్లు, మనవరాళ్లకు 30శాతం రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. 10శాతం స్థానిక పరిపాలన జిల్లాల వారికి, 10శాతం మహిళలకు, 5శాతం మైనారిటీ తెగల వారికి, 1 శాతం దివ్యాంగులకు ఇస్తున్నారు. దీన్ని మార్చాలన్న డిమాండ్‌ చేస్తూ దేశ వ్యాపతంగా విద్యార్ధులు ఆందోళన చేశారు. అప్పుడు కొన్ని రోజుల పాటూ విపరీతంగా అల్లర్లు జరిగాయి. వందల మంది ప్రాణాలు కోల్పోయారు.

సుప్రీంకోర్టు తీర్పు..

ఈ సమయంలో బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు రిజర్వేషన్ల విషయంలో కల్పించుకుంది.దీని ఈద కీలకమైన తీర్పును ఇచ్చింది. విద్యార్ధులకు అనుకూలంగా తీర్పును ఇచ్చింది. ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోటాను తగ్గించాలని ఆదేశించింది. ఈ కేసు మీద అత్యవసరంగా విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు స్వతంత్ర సమరయోధుల కోటాను ఐదు శాతానికి తగ్గించాలని ఆదేశించింది. 93 శాతం నియామకాలు ప్రతిభ ఆధారంగానే చేపట్టాలని స్పష్టం చేసింది. మిగిలిన రెండు శాతం మైనారిటీలు, ట్రాన్స్‌జెండర్లు, దివ్యాంగులకు కేటాయించాలని సూచించింది. దీనికి షేక్ హసీనా ప్రభుత్వం కూడా అంగీకరించింది. అల అయినా గొడవలు తగ్గుతాయని భావించింది.

అనుకున్నట్టుగానే కొంతకాలం పాటూ ఆందోళనలు, అల్లర్లు సద్దుమణిగాయి కూడా. అయితే మళ్ళీ కొన్ని రోజుల్లోనే ఆందోళనలు మొదలయ్యాయి. అంతకు ముందు దేశంలో హింసకు ప్రధాని షేక్ హసీనా కారణమయ్యారంటూ మళ్ళీ అలజడులు రేగాయి. ఆమె రాజీనామా చేయాలని డిమాండ్ బయల్దేరింది. ప్రదర్శనలు, ఆందోళనలు జరిగాయి. దీనిలో మొత్తం 300 మంది చనిపోయారు. ప్రధాని షేక్ హసీనా ఇంటి మీద కూడా ఆందోళనలు దాడి చేశారు. ఈ క్రమంలో షేక్ హసీనా రాజీనామా చేశారు. అక్కడి ప్రభుత్వాన్ని ఆర్మీ స్వాధీనం చేసుకుంది.

ప్రధానిపై ఎప్పటి నుంచో కక్ష..

ప్రధాని పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా..అత్యంత ఎక్కువ కాలం బంగ్లాను పరిపాలించిన నేతగా రికార్డ్ సృష్టించారు. దాదాపు మూడు దశాబ్దాలపాటూ రాజకీయాల్లో ఉన్నారు. ఉక్కు మహిళగా పేరు గాంచారు. అయితే ఆమె రాజకీయ జీవితం అంత సాఫీగా ఏం జరగలేదు. షేక్ హసీనా మీద 19సార్లు హత్యాయత్నాలు జరిగాయి. బేగం ఖలీదా జియా పాలనా కాలంలో పలుమార్లు హత్యాయత్నాలు జరిగాయి. అయితే అన్నింటినుంచి ఆమె సురక్షితంగా బయటపడ్డారు. బాంబులు అమర్చడం, కిరాయి హంతకులను వినియోగించడం, విషప్రయోగం, ర్యాలీలపై భద్రతాదళాల కాల్పులు.. ఇలా ప్రత్యర్థులు ఆమెను చంపేందుకు యత్నించారు. ఇప్పుడు దేశంలో అల్లర్లు చెలరేగడానికి, ఆమె రాజీనామా చేయడానికి కూడా వెనుక ప్రత్యుర్ధులున్నారని అంటున్నారు. దేశంలో ఆందోళనలు తీవ్రమవడానికి ప్రధాన ప్రతిపక్షమైన బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీతోపాటు ఇటీవల నిషేధానికి గురైన జమాతే ఇస్లామి పార్టీ కారణమని అధికార పార్టీ ఆరోపిస్తోంది.

అల్లర్లపై ప్రభుత్వం...

అయితే బంగ్లాలో చెలరేగిన అల్లర్లను అణచడంలో షేక్ హసీనా ప్రభుత్వం వైఫల్యం కూడా కొంత ఉంది. కోటా వివాదం ముదిరాక...దాన్ని అణచడానికి ప్రభుత్వం, ప్రధాని షేక్ హసీనా ప్రత్నించకుండా తమ మాటలతో మరింత చెలరేగేలా చేశారు. ఆందోళనకారులు విధ్వంసం సృష్టిస్తున్నారని ఆరోపించారు. విధ్వంసాలకు పాల్పడేవారు నిరసనకారులు కారని..వారిని సంకెళ్లతో బంధించాలని వ్యాఖ్యలు చేశారు. అశాంతిని అణచివేసేందుకు ఇంటర్నెట్‌పై ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో ఆందోళనకారులతో చర్చలు జరిపేందుకు ప్రధాని పిలుపునిచ్చినప్పటికీ.. వారు అందుకు నిరాకరించారు. చివరకు ఆందోళనలు తీవ్రరూపం దాల్చడంతో రాజీనామా చేసిన హసీనా.. దేశం విడిచి వెళ్లాల్సి వచ్చింది.

Also Read : నేడు అమెరికాకు మంత్రి కోమటిరెడ్డి

Advertisment
తాజా కథనాలు