Floods: రక్షించడానికి వెళ్లిన వాళ్ల ప్రాణాల మీదకు.. రెస్క్యూ టీం వాహనం బోల్తా

రాజస్థాన్‌లో గత 2రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. కోట, బుండి, సవాయి మాధోపూర్, టోంక్ వంటి అనేక జిల్లాల్లో వరద పరిస్థితి నెలకొంది. వరదల కారణంగా ఇద్దరు మహిళలు మృతి చెందగా, వందలాది మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

New Update
Rescue team vehicle

Rescue team vehicle

రాజస్థాన్‌లో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. రాష్ట్రంలోని కోట, బుండి, సవాయి మాధోపూర్, టోంక్ వంటి అనేక జిల్లాల్లో వరద పరిస్థితి నెలకొంది. వరదల కారణంగా ఇద్దరు మహిళలు మృతి చెందగా, వందలాది మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం కావడంతో రోడ్డు, రైల్వే పట్టాలు తెగిపోయి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సహాయక చర్యలకు వెళ్తున్న రెస్య్కూ టీం ట్రాక్టర్ బ్రిడ్జ్ మీద బోల్తా పడింది. దాదాపు 20 మంది ఉన్న ట్రాక్టర్ ట్రాలీ తిరగబడింది. అదృష్టశాత్తువు ప్రాణ నష్టం జరగలేదు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

బుండి జిల్లాలో ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. 50 ఏళ్ల మహిళ వరద నీటి ప్రవాహంలో కొట్టుకుపోగా, మరొక 65 ఏళ్ల మహిళ తన వ్యవసాయ క్షేత్రంలో రేకుల షెడ్డు గోడ కూలిపోవడంతో మరణించింది. ఈ దుర్ఘటనలు శనివారం చోటు చేసుకున్నాయి. అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి భారత సైన్యం, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డీఆర్‌ఎఫ్), స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్‌డీఆర్‌ఎఫ్) బృందాలను రంగంలోకి దించారు. కోట, బుండి జిల్లాల్లో సహాయక చర్యల కోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 17 హెలికాప్టర్‌ను కూడా సిద్ధంగా ఉంచారు. ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ ప్రభావిత జిల్లాల్లోని సహాయక చర్యలను సమీక్షించారు.

రాజస్థాన్ విపత్తు సహాయ మంత్రి కిరోడి మీనా, హోం మంత్రి జవహర్ సింగ్ బెధమ్ ప్రభావిత ప్రాంతాలను ఏరియల్ సర్వే నిర్వహించి, అధికారులకు తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కొన్ని జిల్లాల్లో ఒకే రోజులో 502 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీనివల్ల నగరాల్లోనూ, గ్రామాల్లోనూ తీవ్ర నష్టం వాటిల్లింది. జైపూర్‌లోని చారిత్రక అమేర్ కోటలో ఒక 200 అడుగుల గోడ కూలిపోయింది. అయితే, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను రక్షించి, వారికి అవసరమైన సహాయాన్ని అందించడానికి సహాయక బృందాలు నిరంతరం కృషి చేస్తున్నాయి. ఈ భారీ వర్షాలు రైలు, రోడ్డు రవాణాపై తీవ్ర ప్రభావం చూపాయి. కొన్ని రైళ్లు రద్దు కాగా, మరికొన్ని దారి మళ్లించారు. ఈ వర్షాలు ఇంకా కొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Advertisment
తాజా కథనాలు