అల్లు అర్జున్ ఇంటిపై దాడి జరిగింది. ఓయూ జేఏసీ అల్లు అర్జున్ ఇంటిని ముట్టడించింది. పలువురు జేఏసీ నాయకులు బన్నీ ఇంట్లోకి చొరబడే ప్రయత్నం చేశారు.
బాడీగార్డ్లు అడ్డుకునే ప్రయత్నం చేయగా.. వారిపై కొందరు తిరగబడ్డారు. అల్లు అర్జున్ వల్లే రేవతి చనిపోయిందంటూ వారు ఆరోపిస్తున్నారు. వెంటనే రేవతి కుటుంబానికి బన్నీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
రూ.కోటి నష్టపరిహారం ఇవ్వాలి
Also Read : ఆసియా కప్ మనదే.. దుమ్ము దులిపేసిన టీమిండియా మహిళా క్రికెటర్లు
అంతేకాకుండా రేవతి కుటుంబానికి రూ.కోటి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ కుటుంబానికి అన్ని విధాల ఆదుకోవాలని జేఏసీ నాయకులు కోరుతున్నారు. ఇక విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకి చేరుకున్నారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకున్నారు.
తొక్కిసలాటకు అల్లు అర్జునే కారణం: రేవంత్
నిన్న (శనివారం) జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సంధ్య థియేటర్ తొక్కిసలాట వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. సంధ్య థియేటర్లో తొక్కిసలాటకు అల్లు అర్జునే కారణం అని రేవంత్ రెడ్డి అన్నారు.
అతడు థియేటర్లో సినిమా చూసి వెళ్ళిపోతే అభ్యంతరం ఉండేది కాదని.. కానీ థియేటర్కు వెళ్ళేటప్పుడు కారు రూఫ్ టాప్ ఓపెన్ చేసి రోడ్ షో చేసుకుంటూ వెళ్లడంతోనే తొక్కిసలాట జరిగిందని అన్నారు. ఈ ఘటనలో తల్లి రేవతి చనిపోగా.. కుమారుడు కోమాలోకి వెళ్లాడని ఆవేదన చెందారు.
సినిమా చూసేందుకు వచ్చి రేవతి చచ్చిపోతే ఆమె కుటుంబాన్ని చూడటానికి కూడా అల్లు అర్జున్ కానీ, సినీ ప్రముఖులు కానీ వెళ్లలేదన్నారు.
అల్లు అర్జున్ కు ఏమైనా అయిందా? కన్ను పోయిందా? కాలు పోయిందా? అని అన్నారు. అతనివల్లే రేవతి కుటుంబం నష్టపోయిందన్నారు. దీంతో ఇకనుంచి బెన్ ఫిట్ షోలకు అనుమతులు ఇవ్వమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: రాహుల్గాంధీకి బిగ్ షాక్.. యూపీ కోర్టు సమన్లు
రేవంత్ రెడ్డి వ్యాఖ్యల అనంతరం సోషల్ మీడియాలో అల్లు అర్జున్పై ట్రోల్స్, విమర్శలు మొదలయ్యాయి. నెట్టింట ఇప్పుడు ఇదే చర్చ నడుస్తోంది.
ఒక్కరాత్రి జైల్లో ఉండి వచ్చిన అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన సినీ ప్రముఖులు.. చనిపోయిన రేవతి కుటుంబం ఇంటికి ఎందుకు వెళ్లలేదని పలువురు ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడ్డుతున్నారు. మరోవైపు బన్నీ సంధ్య థియేటర్లో సినిమా ఎంతవరకు చూసారో అనేది కూడా వీడియో వైరల్ అవుతోంది.
బన్నీ జాతర ఎపిసోడ్ వచ్చేవరకు సినిమా చూసినట్లు వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. అదే సమయంలో పోలీసులు వచ్చి జరిగిన విషయం బన్నీకి చెప్పినా అతడు పట్టించుకోలేదని పోలీసులు చెప్పుకొస్తున్నారు. ఇలాంటి తరుణంలో బన్నీ ఇంటిపై జేఏసీ నాయకులు దాడి చేయడం కలకలం రేపింది.